సికింద్రాబాద్ పరిధిలోని జవహర్నగర్ డంపింగ్ యార్డులో ఘోర ప్రమాదం జరిగింది. డంపింగ్ యార్డు నిర్మాణ పనుల్లో లిఫ్ట్ తెగిపడింది. ఈ ఘటనలో ముగ్గురు కార్మికులు మృతి చెందారు. పవర్ ప్రాజెక్ట్ లో చిమ్నీ అమర్చుతుండగా లిఫ్ట్ కూలిపోయిందని అక్కడున్నవారు చెబుతున్నారు. మృతులు ఉత్తర్ప్రదేశ్కు చెందిన సురేశ్ సర్కార్ (21), ప్రకాశ్ మండల్ (24), అమిత్రాయ్ (20)గా పోలీసులు గుర్తించారు.
ఈ ఘటన జరిగిన వెంటనే ముగ్గురిని హుటాహుటిన ఈసీఐఎల్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ ముగ్గురూ మృతి చెందారని పోలీసులు తెలిపారు. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనలో పలువురికి గాయాలైనట్లు తెలుస్తోంది.
హైదరాబాద్ నగరంలోని ఇటీవల లిఫ్ట్ ప్రమాదం జరిగింది. సూరారంలోని ఓ అపార్ట్మెంట్ లో లిఫ్ట్ మీద పడి ఆర్ఎంపీ వైద్యుడు అక్బర్ పాటిల్ (39)మృతి చెందారు. అపార్ట్మెంట్ లిఫ్ట్ గుంతలో పడిన బంతిని తీసేందుకు ప్రయత్నించగా, ఈ ప్రమాదం చోటుచేసుకుంది. లిఫ్ట్ గుంతలోకి బంతిని తీసేందుకు తలపెట్టినప్పుడు పైనుంచి ఒక్కసారిగా లిఫ్ట్ పడటంతో అతడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
ఇటీవల హైదరాబాద్ వరుస లిఫ్ట్ ప్రమాదాలు కలవరపెడుతున్నాయి. ఇటీవల నాంపల్లిలో లిఫ్ట్లో ఇరుక్కుని ఓ చిన్నారి మృతి చెందాడు. మరో ఘటనలో మెహదీపట్నంలోని ఆసిఫ్నగర్ పీఎస్ పరిధిలోని సంతోష్నగర్కాలనీలో నాలుగున్నరేళ్ల చిన్నారి లిఫ్ట్లో ఇరుక్కుని మరణించాడు.
సంబంధిత కథనం