ఇంద్రవెల్లి నెత్తుటి ఘటనకు 44 ఏళ్లు - తొలిసారి అధికారికంగా సంస్మరణ దినం!-section 144 lifted in indravelli arrangements made on behalf of the government to commemorate the martyrs ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  ఇంద్రవెల్లి నెత్తుటి ఘటనకు 44 ఏళ్లు - తొలిసారి అధికారికంగా సంస్మరణ దినం!

ఇంద్రవెల్లి నెత్తుటి ఘటనకు 44 ఏళ్లు - తొలిసారి అధికారికంగా సంస్మరణ దినం!

HT Telugu Desk HT Telugu

ఇవాళ్టితో ఇంద్రవెల్లి నెత్తుటి గాయానికి 44 ఏళ్లు. నాడు అమరులైన వారికి నివాళులు అర్పించటంపై ఉన్న నిషేధాన్ని ప్రభుత్వం ఎత్తివేసింది. అంతేకాదు అధికారికంగా తొలిసారి అమరవీరుల సంస్మరణ దినాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు సిద్ధం చేసింది.

ఇంద్రవెల్లి అమరుల స్తూపం

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఇంద్రవెల్లి అమరవీరుల సంస్మరణ దినాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించనుంది. ఇందుకోసం అమరవీరుల స్థూపం ఏర్పాట్లు సిద్ధం చేసింది. ఇప్పటికే స్మృతివనం ఏర్పాటుకు రూ.95లక్షలు మంజూరు చేసి అభివృద్ధి పనులు చేపట్టింది. ఇందులో భాగంగా ఇవాళ (ఏప్రిల్ 20) సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది.

ఆ రోజు ఏం జరిగిందంటే….

1981 ఏప్రిల్ 20న ఇంద్రవెల్లిలో జల్, జంగిల్, జమీన్ కోసం అడవి బిడ్డలు శాంతియుత సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. కానీ పరిస్థితులు అదుపుతప్పటంతో ఓ పోలీసుపై ఆదివాసీ మహిళ దాడి చేయడంతో ఆయన నేలకొరిగారు. ఈ క్రమంలోనే పోలీసులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో వందలాది మంది ఆదివాసీ బిడ్డలు అమరులయ్యారని స్థానికులు చెబుతారు. ఆ తర్వాత ఇక్కడ ఓ స్థూపాన్ని కూడా నిర్మించారు. అయితే ఇక్కడ నివాళులు అర్పించకుండా ప్రభుత్వం నిషేధాజ్ఞలను అమలు చేస్తూ వస్తోంది. ఉట్నూర్ ఎక్స్ రోడ్డు నుంచి గుడిహత్నూర్ వరకు పోలీసులు నిర్భందంలో ఉంచి 144 సెక్షన్ విధించేవారు.

రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్… ఇంద్రవెల్లి అమరవీరులను స్మరించుకునేందుకు ఏర్పాట్లు చేసింది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…. పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఇంద్రవెల్లి ఆమరవీరుల స్థూపం నుంచే ఎన్నికల శంఖారావం పూరించారు. కాంగ్రెస్ అధికారంలో రాగానే అమరవీరుల స్థూపాన్ని స్మృతి వనంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. ఇందుకు అనుగుణంగా అధికారంలోకి రాగానే చర్యలు తీసుకున్నారు.

అధికారంలోకి రాగానే రూ.95 లక్షలతో స్థూపం చుట్టూ ప్రహరీ గోడ.. సీసీ రోడ్డు నిర్మాణం, గెస్ట్ రూమ్, స్మృతివనం పనులను చేపట్టారు. అంతేకాదు ఇక్కడ తొలిసారిగా నివాళులు అర్పించేందుకు అధికారికంగా అనుమతులు కూడా జారీ అయ్యాయి. ఈ సందర్భంగా అమరులైన 15 మంది కుటుంబాలకు మోడల్ ఇందిరమ్మ ఇండ్లతో పాటు రూ.1.5 కోట్లతో ట్రైకార్ ద్వారా వివిధ రుణాలను మంత్రి సీతక్క చేతుల మీదుగా అందజేయనున్నారు. జిల్లా కలెక్టర్, ఎస్పీతో పాటు ఐటీడీఏ అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉండగానే… ఇక్కడ సంస్మరణ కార్యక్రమంపై నిషేధం ఉండేది. అయితే తెలంగాణ వచ్చాక గత బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో ఉన్ ఆంక్షలను సడలించింది. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం…. పూర్తిగా నిషేధాజ్ఞలను ఎత్తేసింది. దీంతో ఆదివాసీలు ఇవాళ అధికారికంగా అమరవీరుల సంస్మరణ దినం చేసుకోనున్నారు.

(రిపోర్టింగ్: వేణుగోపాల కామాజి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రతినిధి, హిందుస్థాన్ టైమ్స్ తెలుగు).