ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే మరో అప్డేట్ ఇచ్చింది. రద్దీ దృష్యా మరికొన్ని ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఇందులో భాగంగా చర్లపల్లి - కాకినాడ - లింగంపల్లి మధ్య ప్రత్యేక రైళ్లను నడపనుంది.
దక్షిణ మధ్య రైల్వే వెల్లడించిన వివరాల ప్రకారం…కాకినాడ టౌన్ – చర్లపల్లి ( రైలు నెంబర్ 07447) మధ్య స్పెషల్ ట్రైన్ అందుబాటులో ఉంటుంది. ఈ రైలు జూలై 5 నుంచి వచ్చే ఏడాది మార్చి 26 వరకు రాకపోకలు సాగిస్తుంది. ప్రతి శనివారం రాత్రి 8.10 గంటలకు కాకినాడ టౌన్లో బయలుదేరుతుంది. మరునాడు ఉదయం 08.30 గంటలకు చర్లపల్లి చేరుకుంటుంది.
అంతేకాకుండా చర్లపల్లి - కాకినాడ టౌన్ (రైలు నెంబర్ 07448) మధ్య మరో రైలు నడవనుంది. జూలై 6 నుంచి వచ్చే ఏడాది మార్చి 29 వరకు ప్రతి ఆదివారం రాత్రి 7.30 గంటలకు చర్లపల్లి నుంచి బయల్దేరుతుంది. మరునాడు ఉదయం 9 గంటలకు కాకినాడ టౌన్ కు చేరుకుంటుంది.
ఈ ప్రత్యేక రైళ్లు సామర్లకోట, రాజమండ్రి, తణుకు, భీమవరం టౌన్, ఆకివీడు, కైకలూరు, గుడివాడ, విజయవాడ, గుంటూరు, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, మిర్యాలగూడ, నల్గొండ స్టేషన్లలో ఆగుతాయి. ఇందులో 1 ఏసీ, 2 ఏసీ, 3 ఏసీ, 3 ఏసీ ఎకాననీ, స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్ లు ఉంటాయి.
మరోవైపు కాకినాడ టౌన్–లింగంపల్లి (రైలు 07445) మధ్య స్పెషల్ ట్రైన్ అందుబాటులో ఉంటుంది. ఈ ట్రైన్ జూలై 2 నుంచి వచ్చే ఏడాది మార్చి 30 వరకు నడుస్తుంది. ప్రతి సోమ, బుధ, శుక్రవారాల్లో రాత్రి 8.10 గంటలకు కాకినాడ టౌన్లో బయలుదేరుతుంది. మరునాడు ఉదయం 8.50 గంటలకు లింగంపల్లి చేరుకుంటుంది.
ఇక లింగంపల్లి - కాకినాడ టౌన్ మధ్య (రైలు నెంబర్ 07446) మరో రైలు రాకపోకలు సాగించనుంది. జూలై 3 నుంచి వచ్చే ఏడాది మార్చి 31 వరకు అందుబాటులో ఉంటుంది. ప్రతి మంగళ, గురు, శనివారాల్లో సాయంత్రం 6.30 గంటలకు లింగంపల్లిలో బయలుదేరుతుంది. మరునాడు ఉదయం 9 గంటలకు కాకినాడ టౌన్ చేరుకుంటుంది.
ఈ స్పెషల్ ట్రైన్స్ సామర్లకోట, రాజమండ్రి, తణుకు, భీమవరం టౌన్, ఆకివీడు, కై కలూరు, గుడివాడ, విజయవాడ, గుంటూరు, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, మిర్యాలగూడ, నల్గొండ, చర్లపల్లి స్టేషన్లలో ఆగుతాయి.ఇందులో 1 ఏసీ, 2 ఏసీ, 3 ఏసీ, 3 ఏసీ ఎకాననీ, స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్ లు ఉంటాయని రైల్వే అధికారులు తెలిపారు. ఈ సేవలను వినియోగించుకోవాలని ప్రయాణికులను కోరారు.