ప్రయాణికుల రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే అప్డేట్ ఇచ్చింది. సికింద్రాబాద్ - నాగర్ సోల్ మధ్య ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. మొత్తం 8 స్పెషల్ ట్రైన్స్ నడపనున్నట్లు తెలిపింది. ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించింది.
దక్షిణ మధ్య రైల్వే తెలిపిన వివరాల ప్రకారం... సికింద్రాబాద్ - నాగర్ సోల్ (ట్రైన్ నెంబర్ - 07001) మధ్య 4 ప్రత్యేక రైళ్లు నడుస్తాయి. జూలై 3వ తేదీ నుంచి జూలై 24 తేదీల మధ్య గురువారం రోజుల్లో రాకపోకలు ఉంటాయి. రాత్రి 09. 20 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయల్దేరి... మరునాడు 09. 45 గంటలకు నాగర్ సోల్ కు చేరుకుంటుంది.
ఇక నాగర్ సోల్ - సికింద్రాబాద్ (ట్రైన్ నెంబర్ 07002) మధ్య మరో 4 ప్రత్యేక రైళ్లు ఉంటాయి. ఇవి జూలై 04 నుంచి జూలై 25 తేదీల మధ్య ప్రతి శుక్రవారం అందుబాటులో ఉంటాయి. సాయంత్రం 05. 30 గంటలకు నాగర్ సోల్ నుంచి బయల్దేరే ట్రైన్.... మరునాడు ఉదయం 07.30 గంటలకు చేరుకుంటుంది.
ఈ ప్రత్యేక రైళ్లు... మల్కాజ్ గిరి, బొల్లారం, మేడ్చల్, కామారెడ్డి, నిజామాబాద్, బాసర, నాందేడ్, పర్బాణీ, జల్నా, ఔరంగాబాద్ స్టేషన్లలో ఆగుతాయి. ఈ రైళ్లలో 1 ఏసీ, 2 ఏసీ, 3 ఏసీ కోచ్ లు అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు.
రద్దీ దృష్యా మరికొన్ని ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఇందులో భాగంగా చర్లపల్లి - కాకినాడ - లింగంపల్లి మధ్య ప్రత్యేక రైళ్లను నడపనుంది. కాకినాడ టౌన్ – చర్లపల్లి ( రైలు నెంబర్ 07447) మధ్య స్పెషల్ ట్రైన్ అందుబాటులో ఉంటుంది. ఈ రైలు జూలై 5 నుంచి వచ్చే ఏడాది మార్చి 26 వరకు రాకపోకలు సాగిస్తుంది. ప్రతి శనివారం రాత్రి 8.10 గంటలకు కాకినాడ టౌన్లో బయలుదేరుతుంది. మరునాడు ఉదయం 08.30 గంటలకు చర్లపల్లి చేరుకుంటుంది.
చర్లపల్లి - కాకినాడ టౌన్ (రైలు నెంబర్ 07448) మధ్య మరో రైలు నడవనుంది. జూలై 6 నుంచి వచ్చే ఏడాది మార్చి 29 వరకు ప్రతి ఆదివారం రాత్రి 7.30 గంటలకు చర్లపల్లి నుంచి బయల్దేరుతుంది. మరునాడు ఉదయం 9 గంటలకు కాకినాడ టౌన్ కు చేరుకుంటుంది.
ఈ ప్రత్యేక రైళ్లు సామర్లకోట, రాజమండ్రి, తణుకు, భీమవరం టౌన్, ఆకివీడు, కైకలూరు, గుడివాడ, విజయవాడ, గుంటూరు, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, మిర్యాలగూడ, నల్గొండ స్టేషన్లలో ఆగుతాయి. ఇందులో 1 ఏసీ, 2 ఏసీ, 3 ఏసీ, 3 ఏసీ ఎకాననీ, స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్ లు ఉంటాయి.
కాకినాడ టౌన్–లింగంపల్లి (రైలు 07445) మధ్య స్పెషల్ ట్రైన్ అందుబాటులో ఉంటుంది. ఈ ట్రైన్ జూలై 2 నుంచి వచ్చే ఏడాది మార్చి 30 వరకు నడుస్తుంది. ప్రతి సోమ, బుధ, శుక్రవారాల్లో రాత్రి 8.10 గంటలకు కాకినాడ టౌన్లో బయలుదేరుతుంది. మరునాడు ఉదయం 8.50 గంటలకు లింగంపల్లి చేరుకుంటుంది.
ఇక లింగంపల్లి - కాకినాడ టౌన్ మధ్య (రైలు నెంబర్ 07446) మరో రైలు రాకపోకలు సాగించనుంది. జూలై 3 నుంచి వచ్చే ఏడాది మార్చి 31 వరకు అందుబాటులో ఉంటుంది. ప్రతి మంగళ, గురు, శనివారాల్లో సాయంత్రం 6.30 గంటలకు లింగంపల్లిలో బయలుదేరుతుంది. మరునాడు ఉదయం 9 గంటలకు కాకినాడ టౌన్ చేరుకుంటుంది.