TGPSC Group 1 Updates : తెలంగాణ గ్రూప్ 1 అభ్యర్థులకు అలర్ట్... వెబ్సైట్లో ప్రిలిమ్స్ OMR కాపీలు
TGPSC Group 1 Prelims Exam OMR Sheets: తెలంగాణ గ్రూప్ 1 ప్రిలిమ్స్ కు సంబంధించి టీజీపీఎస్సీ మరో అప్డేట్ ఇచ్చింది. వెబ్సైట్లో ప్రిలిమ్స్ ఓఎంఆర్ స్కాన్డ్ కాపీలను అందుబాటులో ఉంచినట్లు తెలిపింది. అభ్యర్థుల లాగిన్ వివరాలతో వీటిని పొందవచ్చని పేర్కొంది.
TGPSC Group 1 Prelims OMR : తెలంగాణ గ్రూప్ 1 ప్రిలిమ్స్ 2024 కు సంబంధించి మరో అప్డేట్ వచ్చేసింది. ఇటీవలే పరీక్ష పూర్తికాగా… ఇందుకు సంబంధించి ప్రిలిమినరీ కీ కూడా విడుదలైన సంగతి తెలిసిందే. అయితే తాజాగా అభ్యర్థుల డిజిటలైజ్డ్ ఓఎంఆర్ ఆన్సర్ షీట్లను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ మేరకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఓ ప్రకటన విడుదల చేసింది.
అభ్యర్థులు వారి లాగిన్ వివరాలతో ఓఎంఆర్ ఆన్సర్ షీట్లను కూడా పొందవచ్చని పేర్కొంది. ప్రాథమిక కీ, మాస్టర్ ప్రశ్నపత్రం ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి. ప్రిలిమినరీ కీ కి సంబంధించి ఏమైనా అభ్యంతరాలు ఉంటే… జూన్ 17వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు ఆన్ లైన్ లో పంపాల్సి ఉంటుందని టీజీపీఎస్సీ స్పష్టం చేసింది. https://www.tspsc.gov.in/ వెబ్ సైట్ నుంచి డిజిటలైజ్డ్ ఓఎంఆర్ ఆన్సర్ షీట్లను పొందవచ్చు.
అభ్యర్థులు తమ అభ్యంతరాలను ఇంగ్లీష్ లో మాత్రమే సమర్పించాలని కమిషన్ సూచించింది. అభ్యర్థులు తమ క్లెయిమ్లను ధృవీకరించేందుకు తగిన ఆధారాలను ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని తెలిపింది.
వెబ్ సైట్ పొందుపరిచిన అభ్యంతరాలను మాత్రమే పరిగణిస్తామని, ఇ-మెయిల్స్, వ్యక్తిగతంగా సమర్పించిన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోమని కమిషన్ స్పష్టం చేసింది.
జూన్ 9న గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షను నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ ఎగ్జామ్ కు మొత్తం 3.02 లక్షల మందికిపైగా అభ్యర్థులు హాజరయ్యారు. అభ్యంతరాల స్వీకరణ తర్వాత… ప్రిలిమ్స్ ఫలితాలను ప్రకటించనున్నారు. మరోవైపు… మెయిన్స్ పరీక్షల షెడ్యూల్ కూడా విడుదలైంది. అక్టోబర్ 21 నుంచి 27 వరకు ఈ పరీక్షలను నిర్వహించనున్నారు.
గ్రూప్-1 మెయిన్స్ షెడ్యూల్:
గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలను 21/10/2024 నుంచి 27/10/2024 వరకు హైదరాబాద్లో నిర్వహించనున్నట్లు టీజీపీఎస్సీ ప్రకటించింది. ఇటీవలే పరీక్షల షెడ్యూల్ ను కూడా విడుదల చేసింది.
గ్రూప్-1 మెయిన్స్ లో ఆరు పేపర్లు ఉంటాయి. ప్రతీ పేపర్ ను 3 గంటల వ్యవధిలో 150 మార్కులకు నిర్వహిస్తారు. మెయిన్ పరీక్షలను ప్రతీ రోజు మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 వరకు నిర్వహిస్తారు.
- జనరల్ ఇంగ్లిష్(క్వాలిఫైయింగ్ పేపర్) - అక్టోబర్ 21
- పేపర్-I (జనరల్ ఎస్సే) -అక్టోబర్ 22
- పేపర్-II (చరిత్ర, సంస్కృతి, భూగోళశాస్త్రం) - అక్టోబర్ 23
- పేపర్ -III (ఇండియన్ సొసైటీ, రాజ్యాంగం, అడ్మినిస్ట్రేషన్) - అక్టోబర్ 24
- పేపర్ -IV (ఎకానమీ, డెవలప్మెంట్) - అక్టోబర్ 25
- పేపర్- V (సైన్స్ &సాంకేతికత, డేటా ఇన్టర్ప్రెటేషన్ ) - అక్టోబ్ 26
- పేపర్-VI (తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర నిర్మాణం) - అక్టోబర్ 27.
మెయిన్స్ పరీక్షను ఇంగ్లిష్, తెలుగు, ఉర్దూ భాషల్లో నిర్వహిస్తారు. మెయిన్ పరీక్షలో జనరల్ ఇంగ్లిష్ తప్ప మిగిలిన పేపర్లను అభ్యర్థులు ఎంచుకున్న భాషల్లో రాయాలి. గ్రూప్-1 మెయిన్స్ లో మొత్తం 06 పేపర్లు ఉంటాయి. వీటిని అభ్యర్థి ముందుగా ఎంచుకున్న మాధ్యమంలోనే రాయాల్సి ఉంటుంది.
పేపర్లో కొంత భాగాన్ని ఇతర భాషలో రాయడానికి అభ్యర్థికి అనుమతి లేదు.ఇంగ్లిష్ లో కొంత భాగం, తెలుగు లేదా ఉర్దూలో మిగిలిన భాగం రాయడానికి అనుమతి లేదని టీజీపీఎస్సీ ప్రకటనలో తెలిపింది.