ఈ నెల 15 నుంచి కాళేశ్వరం సరస్వతీ పుష్కరాలు, సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం-saraswati pushkaralu 2025 set for grand festival from may 15 officials invites cm revanth reddy ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  ఈ నెల 15 నుంచి కాళేశ్వరం సరస్వతీ పుష్కరాలు, సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం

ఈ నెల 15 నుంచి కాళేశ్వరం సరస్వతీ పుష్కరాలు, సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం

ఈ నెల 15 నుంచి 26 వరకు 12 రోజుల పాటు కాళేశ్వరం సరస్వతీ పుష్కరాలు జరగనున్నాయి. పుష్కరాల్లో పాల్గొనాల్సిందిగా సీఎం రేవంత్ రెడ్డికి దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఆహ్వానం అందించారు.

ఈ నెల 15 నుంచి కాళేశ్వరం సరస్వతీ పుష్కరాలు, సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం

ఈ నెల 15 నుంచి ప్రారంభం కానున్న సరస్వతీ పుష్కరాలలో పాల్గొనాల్సిందిగా సీఎం రేవంత్ రెడ్డికి దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఆహ్వానం అందించారు. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఉన్నతాధికారులతో కలిసి జూబ్లీహిల్స్ లోని సీఎం నివాసంలో ఆహ్వానం అందజేశారు.

12 రోజుల పాటు సరస్వతీ పుష్కరాలు

మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్సీ, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ కు మంత్రి కొండా సురేఖ ఆహ్వానం అందించారు. ఈ నెల 15 నుంచి 26 వ తేదీ వరకు 12 రోజుల పాటు జరిగే భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం సరస్వతీ పుష్కరాలకు వచ్చే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి సూచించారు.

మంత్రుల సమీక్ష

ఈ నెల 15 నుంచి 26వ తేదీ వరకూ సరస్వతీ పుష్కరాలు జరగనున్నాయి. దీనిపై మంగళవారం సచివాలయంలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, కొండా సురేఖ, అధికారులతో సమీక్ష నిర్వహించారు. పుణ్య స్నానాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేయాలని మంత్రులు అధికారులను ఆదేశించారు. ఈ భేటీలో సీఎస్, డీజీపీ, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

హెలికాఫ్టర్ జాయ్ రైడ్

సరస్వతీ పుష్కరాల్లో హెలికాప్టర్‌ రైడ్ అందుబాటులోకి రానుంది. పుష్కరాలకు వచ్చిన భక్తులు కాళేశ్వరం ఆలయం, పుష్కర ఘాట్‌లు, చుట్టు పక్కల ప్రకృతి అందాలను వీక్షించేలా రాష్ట్ర ప్రభుత్వం జాయ్‌రైడ్‌ ను ఏర్పాటు చేస్తుంది. ఇందుకోసం ఆరుగురు ప్రయాణించేలా ఎయిర్‌బస్‌ హెచ్‌-125 మోడల్‌ హెలికాప్టర్‌ను అందుబాటులో ఉంచనున్నారు.

టికెట్ ధర రూ.4500

హెలికాఫ్టర్ రైడ్ టికెట్‌ ధరను ఒక్కొక్కరికీ రూ.4,500 చొప్పున ఖరారు చేశారు. జాయ్ రైడ్ సమయాన్ని 6-7 నిమిషాలుగా నిర్ణయించారు. హెలికాప్టర్‌ ప్రయాణాలకు అవసరమైన అనుమతులు, ఇతరత్రా వ్యవహారాలు ఇప్పటికే పూర్తి చేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకే హెలికాఫ్టర్ రైడ్‌లను నిర్వహించనున్నారు. హెలికాప్టర్‌ ప్రయాణాల బాధ్యతలను బెంగళూరుకు చెందిన ఓ సంస్థకు అప్పగించారు.

సరస్వతీ నది పుష్కరాలు భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో జరగనున్నాయి. ఇందుకోసం పుష్కర ఘాట్లు ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులు ఇబ్బందులు పడకుండా ప్రత్యేక కార్యాచరణను రూపొందించారు. ఇందులో భాగంగానే పుష్కరాల పూర్తి సమాచారంతో కూడిన వెబ్‌ పోర్టల్, యాప్‌ను తీసుకువచ్చారు.

సరస్వతీ పుష్కరాల ముఖ్యాంశాలు

  1. దేశంలో ప్రాశస్త్యం పొందిన 12 నదులకు పుష్కరాలు సంప్రదాయంగా వస్తుండగా ఏటా ఒక నదికి పుష్కరాలు జరుగుతుంటాయి. ఈ 12 నదుల్లో సరస్వతీ నది కూడా ఉండటంతో 12 ఏళ్లకోసారి పుష్కరాలు జరుగుతాయి.
  2. ప్రాణహిత, గోదావరి నదుల సంగమం అయిన కాళేశ్వరంలో అంతర్వాహినిగా సరస్వతీ నది కలుస్తుంది. ఈ ప్రాంతాన్ని పవిత్రమైన సంగమంగా భావిస్తారు.
  3. రాష్ట్ర ప్రభుత్వం ఈసారి కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాలను అత్యంత ఘనంగా నిర్వహించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా మే 15 నుంచి 26 వరకు సరస్వతీ నది పుష్కరాలు జరగనున్నాయి.
  4. కాళేశ్వరం మీదుగా ప్రవహిస్తున్న గోదావరినదిలో మహారాష్ట్ర మీదుగా ప్రవహించే ప్రాణహిత నది కలుస్తుంది. రెండు నదులు సంగమించిన చోట సరస్వతీ అంతర్వాహిని నది ఉద్బవిస్తుందని పురాణాలు చెప్తున్నాయి.
  5. మే 15వ తేదీన శ్రీ గురుమదనానంద సరస్వతి పీఠానికి చెందిన మాధవానంద సరస్వతిస్వామి పుష్కరాలను ప్రారంభిస్తారు.

సత్యప్రసాద్ బండారు హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలు, పొలిటికల్ వార్తలను రాస్తారు. జర్నలిజంలో 6 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఆంధ్ర యూనివర్సిటీలో జర్నలిజం(MJMC) పీజీ చేశారు. గతంలో ఈటీవీ భారత్, ఇన్ షార్ట్స్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పనిచేశారు. సత్యప్రసాద్ 2023లో హెచ్.టి.తెలుగులో చేరారు.

సంబంధిత కథనం