Harish Rao : కాంగ్రెస్ నేతలు దుష్ప్రచారాలు చేశారని, ప్రజలు వాటిని నమ్మి కాంగ్రెస్ కి అధికారం ఇచ్చారని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. కొత్త ప్రభుత్వానికి కొంత సమయం ఇద్దామని వారు ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలమైతే, హామీల కోసం ప్రజల గొంతుక అవుదామని కార్యకర్తలకు సూచించారు. బీఆర్ఎస్ కే భవిష్యత్తు ఉంటుందని అన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం దురదృష్టవశాత్తు ఏర్పడలేదని దానికి కుంగిపోవాల్సిన అవసరం లేదని హరీశ్ రావు అన్నారు. మంగళవారం సంగారెడ్డిలో నిర్వహించిన బీఆర్ఎస్ కృతజ్ఞత సభలో హరీశ్ రావు పాల్గొన్నారు. ఆ సభలో మాట్లాడుతూ రాబోయే పంచాయతీ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలలో బీఆర్ఎస్ సత్తా చూపించాలని హరీశ్ రావు అన్నారు. అధికార పార్టీ వాళ్లు మన మానసిక స్టైర్యాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తుoటారని ధెర్యం కోల్పోవద్దన్నారు.
టీఆర్ఎస్ పెట్టినప్పుడు కూడా ఎన్నో ఇబ్బందులు పడ్డామని, 14 ఏళ్ల కష్టపడి పదవులు గడ్డి పోచల్లా వదిలేసి తెలంగాణ తెచ్చుకున్నామని హరీశ్ రావు అన్నారు . 2004లో కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకుని తెలంగాణ ఇవ్వలేదన్నారు. తెలంగాణపై కేసీఆర్ కు ఉన్న ప్రేమ ఇతరులకు ఉండదని, మనం అధికారంలో ఉన్నప్పుడు పొంగిపోలేదు. అధికారం లేనప్పుడు కుంగిపోలేదన్నారు. బీఆర్ఎస్ కు ఒడిదొడుకులు కొత్త కాదన్నారు. కేవలం 2 శాతం ఓట్ల తేడాతో బీఆర్ఎస్ ఓటమి పాలైయిందని అన్నారు. బీఆర్ఎస్ అధికార పక్షంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల పక్షమేనని అన్నారు. బీఆర్ఎస్ తెలంగాణను అన్ని రంగాల్లో దేశంలో నెంబర్ 1 స్థానంలో నిలబెట్టిందని అన్నారు.
ఉమ్మడి మెదక్ జిల్లాలో ఏడుగురు ఎమ్మెల్యేలు ఉన్నారని, అందరం కలసి పనిచేసి ఓటమిపై సమీక్ష జరుపుకుని తప్పు ఒప్పులు సరిచేసుకుందామని హరీశ్ రావు అన్నారు. రాష్ట్రమంతా కొంత ఇబ్బంది ఉన్నా సంగారెడ్డిలో మాత్రం ఈసారి గులాబీ జెండా ఎగిరిందన్నారు. చింతా ప్రభాకర్ ఆరోగ్యం దెబ్బ తిన్నా ప్రతి ఒక్క కార్యకర్త అభ్యర్థిగా కష్టపడి పనిచేసి ఆయనను సంగారెడ్డి ఎమ్మెల్యేగా గెలిపించారని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటామని హరీశ్ రావు భరోసా ఇచ్చారు.
రిపోర్టింగ్ : హెచ్.టి.తెలుగు ప్రతినిధి, సంగారెడ్డి