Sangareddy Teachers Suspended : సంగారెడ్డి జిల్లాలోని కంగ్టి మండల కేంద్రంలో ఉన్న ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాల, కళాశాల వసతి గృహంలో విద్యార్థులతో వంటలు చేయించిన ఉపాధ్యాయులను జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి సస్పెండ్ చేస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. కంగ్టి సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాల కళాశాలలో విద్యార్థులతో వంటలు చేసిన వార్తలు వెలువబడడంతో వెంటనే కలెక్టర్ నారాయణఖేడ్ ఆర్డీఓ అశోక్ చక్రవర్తిని విచారణకు ఆదేశించారు.
ఆర్డీవో గురువారం పాఠశాలను సందర్శించి విద్యార్థులతో, సిబ్బందితో మాట్లాడి విద్యార్థులు వంట చేసిన విషయం వాస్తవమేనని కలెక్టర్ కు నివేదిక సమర్పించడంతో... ఆర్డీఓ నివేదిక ఆధారంగా పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ జి. మహేష్, టీజీటీ (మ్యాథ్స్ )ఉపాధ్యాయుడు కె.శివకుమార్ ను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ క్రాంతి వల్లూరు ఉత్తర్వులు జారీ చేశారు. నిబంధనల ప్రకారం సస్పెన్షన్ కు గురైన ఉపాధ్యాయులు అందుబాటులో ఉండాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
కంగ్టి ట్రైబల్ వెల్ఫేర్ కళాశాల వసతి గృహంలో విద్యార్థులతో పనిచేయించిన ఘటనపై సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి స్పందించారు. విద్యార్థులతో పనిచేయిస్తున్న సిబ్బందిపై కలెక్టర్ క్రాంతి ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులతో పనిచేయించిన ఘటనకు సంబంధించి విచారణ జరిపి నివేదిక సమర్పించాలని నారాయణఖేడ్ ఆర్డీవో అశోక్ చక్రవర్తిని ఆదేశించారు.
కలెక్టర్ ఆదేశాలతో ఆర్డీవో గురువారం కంగ్టి ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాల కళాశాల వసతి గృహాన్ని సందర్శించారు. విద్యార్థులతో మాట్లాడి పూర్తి వివరాలు సేకరించారు. చదువుకోవడానికి వచ్చిన విద్యార్థులతో వసతి గృహంలో పని చేయించడంపై ఆర్డీవో ఆగ్రహం వ్యక్తం చేసి, పూర్తి నివేదిక కలెక్టర్ కు అందజేచేసినట్టు తెలిపారు. తమతో తరచుగా హాస్టల్ లో టీచర్లు పని చేయిస్తున్నారని విద్యార్థులు విచారణ అధికారికి చెప్పారు. పనులు చేయటం వలన, తాము చదువు పైన సరిగా దృష్టి పెట్టలేకపోతున్నామని ఫిర్యాదు చేశారు.
రామచంద్రపురం మండల పరిధిలోని, వెలిమెల మోడల్ స్కూల్, జూనియర్ కళాశాల, ఉస్మాన్ నగర్ కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాలను శనివారం జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. సందర్భంగా పాఠశాలల్లో వంటగదిని డైనింగ్ హాల్ ను, స్టోర్ రూమ్ లో పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఉపాధ్యాయులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు.
విద్యార్థులకు నూతన మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని నిర్వాహకులకు సూచించారు. నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ పిల్లలకు రుచికరమైన వంట వండి పెట్టాలని ఆదేశించారు. పాఠశాలలో శానిటేషన్ సమస్య తలెత్తకుండా అవసరమైన ముందు జాగ్రత్తగా చర్యలు తీసుకోవాలన్నారు. పదో తరగతి పరీక్షలకు సమయం దగ్గర పడుతున్నందున విద్యార్థులు శ్రద్ధతో చదివి మెరుగైన ఫలితాలు సాధించాలని సూచించారు.
సంబంధిత కథనం