సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని కలెక్టర్ వల్లూరు క్రాంతి మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలోని బయోమెట్రిక్ హాజరు రికార్డులను పరిశీలించారు. పదిమంది వైద్యులు తమకున్న క్యాజువల్ లీవుల పరిమితి కంటే ఎక్కువగా తీసుకున్నట్లు, రోజువారీ విధులకు గైర్హాజరైనట్టు కలెక్టర్ గుర్తించారు. వారికి షోకాజ్ నోటీసులు జారీ చేయాలనీ ఆదేశించారు.
అనుమతి లేకుండా ఎక్కువ రోజులు విధులకు రాని వైద్యాధికారులను.. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ కార్యాలయానికి సరెండర్ చేయాలని ఆసుపత్రి సూపరింటెండెంట్ను ఆదేశించారు. అనంతరం ఆసుపత్రిలోని అన్ని వార్డులను పరిశీలించారు. సిబ్బంది సమయపాలన పాటించాలని ఆదేశించారు. సిబ్బంది ఉదయం 9:15 గంటల వరకు విధులకు హాజరుకావాలని స్పష్టం చేశారు.
ప్రతి రోజు సిబ్బంది, వైద్యుల హాజరును పరిశీలించాలని.. ఆసుపత్రి సూపరింటెండెంట్ను ఆదేశించారు. వైద్యులు, సిబ్బంది తమ విధులు, బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలన్నారు. ఆస్పత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆస్పత్రిలో రోగులకు అవసరమైన అన్ని రకాల వసతులు కల్పించాలని సూచించారు.
ప్రభుత్వ ఆసుపత్రిలో రోగుల సహాయకుల కోసం సీఎస్ఆర్ నిధులతో ప్రత్యేక వసతి భవనాన్ని నిర్మిస్తున్నారు. దీని నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేయాలని ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు చేపట్టాలన్నారు. అనంతరం రోగులతో మాట్లాడారు. ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. ఇన్ పేషెంట్గా చేరిన వారికి అందిస్తున్న భోజనం, పాలు, బ్రెడ్ ఎలా ఉంది అని అడిగి తెలుసుకున్నారు. నాణ్యమైన ఆహారం అందించాలని ఆదేశించారు. .
ఆసుపత్రిలోని ఫిజియోథెరపీ కేంద్రాన్ని, దంతవైద్య విభాగాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఫిజియోథెరపీ కేంద్రంలో అవసరమైన పరికరాల గురించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి.. సమస్య పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకోనున్నట్లు వివరించారు. నాణ్యమైన వైద్య సేవలు అందించాలన్న ఉద్దేశంతో.. ప్రతి ఉద్యోగి తన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాలని సూచించారు.
(రిపోర్టింగ్- ఉమ్మడి మెదక్ జిల్లా ప్రతినిధి, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)