Salman Khan : 'గ్రీన్ ఇండియా ఛాలెంజ్'లో పాల్గొన్న సల్మాన్ ఖాన్
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ పాల్గొన్నారు. హైదరాబాద్ కు షూటింగ్ కోసం వచ్చారు.
ఒక్కో మొక్క ఒక్కో మనిషికి సరిపడా ఆక్సిజన్ ను అందిస్తుందన్నారు బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్. తన తాజా సినిమా షూటింగ్ కోసం హైదరాబాద్ కి వచ్చారు. రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ తో కలిసి రామోజీ ఫిల్మ్ సిటీలో మొక్కలు నాటి 'గ్రీన్ ఇండియా ఛాలెంజ్ 5.0'లో పాల్గొన్నారు.
మొక్కలు నాటడాన్ని ప్రతీ ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని సల్మాన్ కోరారు. ఏదో మొక్కను నాటామా.. పని అయిపోయిందా అని కాకుండా ఆ మొక్క పెరిగే వరకు శ్రద్ధ తీసుకోవాలన్నారు. అకాల వర్షాలు, వరదలు, విపత్తులతో మన కళ్ల ముందే దేశంలో అనేక మంది ప్రజలు చనిపోతుండటం బాధాకరమన్నారు. వాతావరణ మార్పులతో జరిగే అనర్థాలు ఆగాలంటే మనం చెట్లు నాటడం ఒక్కటే మార్గమన్నారు. ఆ పనికి జోగినిపల్లి సంతోష్ కుమార్ 'గ్రీన్ ఇండియా ఛాలెంజ్' ద్వారా బాటలు వేశారన్నారు. దాన్ని మనం కొనసాగిస్తే మన నేలను, భవిష్యత్ తరాలను కాపాడుకోవచ్చని తెలిపారు. అభిమానులంతా విధిగా 'గ్రీన్ ఇండియా ఛాలెంజ్' కార్యక్రమంలో పాల్గొని విరివిగా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.
అనంతరం రాజ్యసభ సభ్యుడు.., జోగినిపల్లి సంతోష్ కుమార్ మాట్లాడారు. పెద్ద మనసుతో “గ్రీన్ ఇండియా ఛాలెంజ్”లో భాగంగా మొక్కలు నాటుదామని చెప్పగానే వచ్చి మొక్కలు నాటిన సల్మాన్ ఖాన్ కు కృతజ్ఞతలు తెలిపారు. మొక్కలు నాటడం వల్ల కోట్ల మంది అభిమానులకు స్ఫూర్తిగా నిలుస్తుందని చెప్పారు.
సంబంధిత కథనం