Rythu Bandhu Scheme: గుడ్ న్యూస్.. ఈనెల 28 నుంచి 'రైతుబంధు' నిధులు జమ
Rythu Bandhu in Telangana: యాసంగి సీజన్ లో రైతుబంధు నిధులు ఇచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ మేరకు డిసెంబర్ 28వ తేదీ నుంచి డబ్బులు జమ చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు ఇచ్చారు.
Rythu Bandhu Scheme Funds: రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది తెలంగాణ సర్కార్. యాసంగి సీజన్ లో ఇచ్చే రైతుబంధు డబ్బులపై కీలక అప్డేట్ ఇచ్చింది. పెట్టుబడి సాయం కింద ఇచ్చే రైతుబంధు నిధులను డిసెంబర్ 28 నుంచి విడుదల చేయడం ప్రారంభించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావుకు సూచించారు. ఈ నిధులను గతంలో మాదిరిగానే ఒక ఎకరం నుంచి ప్రారంభమై సంక్రాంతి కల్లా రైతులందరి ఖాతాల్లో జమ కానున్నాయి. ఇందుకోసం గాను రూ. 7,600 కోట్లను, రైతుల ఖాతాల్లో రాష్ట్ర ప్రభుత్వం జమ చేయనుంది.
ట్రెండింగ్ వార్తలు
పదో విడతతో దాదాపు రూ.66 వేల కోట్లు నేరుగా రైతుల ఖాతాలలోకి జమ చేయనున్నట్లు వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి చెప్పారు. దేశంలో నేరుగా రైతుల ఖాతాలలో జమచేస్తున్న మొట్టమొదటి పథకం అని తెలిపారు. "ఇప్పటివరకు 9 విడతలలో రూ.58 వేల కోట్లు రైతుల ఖాతాలలో జమచేశాం. వ్యవసాయరంగానికి తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న చేయూత దేశంలో ఏ రాష్ట్రం ఇవ్వడం లేదు. 60 శాతం మందికి ఉపాధి కల్పించే వ్యవసాయరంగానికి చేయూత ఇవ్వాలన్నదే కేసీఆర్ ఆలోచన. కేంద్ర ప్రభుత్వ సహకారం లేకున్నా తెలంగాణలో సంక్షేమ, అభివృద్ధి పథకాలను కేసీఆర్ విజయవంతంగా అమలు చేస్తున్నారు. డిసెంబర్ 28 నుండి రోజుకు ఎకరా చొప్పున రైతుల ఖాతాలలో నిధులు జమ అవుతాయి.సంక్రాంతి లోపు అందరు రైతుల ఖాతాలలో నిధులు జమ ప్రక్రియ పూర్తి అవుతుంది" అని మంత్రి వెల్లడించారు.
ఇక వానాకాలం సీజన్ కిందట జూన్ నెలలో 64 లక్షలకుపైగా రైతుల ఖాతాల్లో నిధులు జమ చేసిన సంగతి తెలిసిందే. మొత్తం 1.47 కోట్ల ఎకరాలకు రూ. 7,372.56 కోట్లు చెల్లించారు. ఒక్కో ఎకరాకు రూ. 5 వేల చొప్పున రైతుబంధు సొమ్ము అందించారు. ప్రస్తుతం రాష్ట్రంలోని అన్నదాతలకు ఏటా రెండు సీజన్లకు ఎకరాకు రూ.5 వేల చొప్పున పెట్టుబడి సాయం చేస్తోంది. వానాకాలం సీజన్ కోసం రైతుబంధు పథకం కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.7,700 కోట్లు విడుదల చేసింది. అయితే ఈసారి మరికొంత మంది కొత్త లబ్ధిదారులు కూడా చేరే అవకాశం ఉంది. ఖర్చు కూడా పెరిగే అవకాశం ఉంది. కొత్తగా నమోదు చేసుకునే వారికి పలు ధపాలుగా అవకాశం కూడా కల్పించింది సర్కార్.
మరోవైపు రైతుబంధు పథకం కింద వ్యవసాయశాఖ జమ చేస్తున్న నిధులు కొందరు రైతులకు అందడం లేదు. ఖాతాల వివరాలు సరిగా నమోదు కాకపోవడంతో పాటు.. కొందరు రైతుల బ్యాంకు అకౌంట్లు పనిచేయకపోవడం ఇందుకు కారణం. ఆరు నెలల పాటు ఎలాంటి లావాదేవీలు జరగకపోవటం, కేవైసీ అప్డేట్ చేసుకోపోవటం వంటి కారణాలతో నిధులు జమ కావటం లేదని తెలుస్తోంది. వానాకాలం నిధులు జమ సమయంలోనూ పలువురి ఖాతాల్లో నిధులు జమ కాలేదు. ఇలా ఇలాంటి సాంకేతిక సమస్యల వల్ల దాదాపు రెండున్నర లక్షల మంది రైతులు ఇబ్బంది పడినట్లు అధికారుల గుర్తించారు. ఈసారి అలా జరగకుండూ చూసేందుకు అధికారులు జాగ్రత్తలు చేపడుతున్నారు.