ఈ దేశ రక్షణ బాధ్యత యువతీ యువకులపై ఉందని.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్ నగరం కొన్ని దశాబ్దాలుగా దేశ రక్షణలో అత్యంత కీలక పాత్ర పోషిస్తోందని చెప్పారు. బీడీఎల్, డీఆర్డీవో, మిదానీ, హెచ్ఏఎల్ వంటివి దేశ రక్షణ కోసం రాకెట్లు, మిస్సైల్స్ తయారు చేస్తున్నాయని వివరించారు. ఇందుకు సంబంధించి హైదరాబాద్ నగరం, చుట్టూ పరిశ్రమలు ఉన్నాయని వ్యాఖ్యానించారు.
'దేశాన్ని రక్షించడంలో మన హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రం అత్యంత క్రియాశీలక పాత్ర పోషిస్తోంది. లక్షలాది మంది విద్యార్థులకు దేశాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యతపై వారిలో స్ఫూర్తిని, అవగాహన కల్పించడానికి ఈ ప్రత్యేకమైన ఎగ్జిబిషన్ను ఏర్పాటు చేసుకున్నాం. తెలంగాణ రాష్ట్రం నుండి ప్రతి ఏటా లక్షకు పైగా ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లు, ముఖ్యంగా కంప్యూటర్ సైన్స్ చదివి, అమెరికాకు వెళుతున్నారు. వారికి దేశభక్తితో, దేశ రక్షణ ప్రాధాన్యతనలు వివరించడానికి ఈ వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహిస్తున్నాం' అని సీఎం వివరించారు.
'దేశ రక్షణ రంగానికి అవసరమైన, సమర్ధవంతమైన ఇంజినీర్లను అందించేందుకు ప్రయత్నిస్తున్నాం. దేశ రక్షణ కోసం అవసరమైన ఇంజినీర్లను తయారుచేయడం మరింత ముఖ్యం. స్వాతంత్ర్యం ముందు, తర్వాత హైదరాబాద్లో బీడీఎల్, హెచ్ఎచ్ఎల్, మిదానీ, డీఆర్డీవో వంటి అనేక సంస్థలు దేశ రక్షణ కోసం ఉత్పత్తి రంగంలో విశేషంగా పని చేస్తున్నాయి. దేశ రక్షణ రంగానికి హైదరాబాద్, బెంగళూరు ముఖ్య కేంద్రాలుగా ఉన్నాయి' అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
'గతంలో మీతో చర్చించినట్టుగా హైదరాబాద్- బెంగళూరును డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్గా ప్రకటించాలి. తద్వారా భారీగా పెట్టుబడులు వస్తాయి. రాకెట్ తయారీ సహా ఆకాశ మార్గం (స్కై రూట్) వంటి స్టార్టప్లు అభివృద్ధి చెందుతాయి. అందుకోసం మీ సహకారం, మద్దతు అవసరం. రక్షణ రంగంలో భారతదేశాన్ని నంబర్ వన్ స్థాయికి తీసుకెళ్లేందుకు మేము ప్రయత్నిస్తాం' అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.