Revanth Reddy: తెలంగాణ వచ్చినా పాలమూరులో వలసలు ఎందుకు ఆగలేదన్న రేవంత్ రెడ్డి-revanth reddy said that migration in palamuru has not stopped even if telangana state came
Telugu News  /  Telangana  /  Revanth Reddy Said That Migration In Palamuru Has Not Stopped Even If Telangana State Came
టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి
టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి

Revanth Reddy: తెలంగాణ వచ్చినా పాలమూరులో వలసలు ఎందుకు ఆగలేదన్న రేవంత్ రెడ్డి

26 May 2023, 5:50 ISTHT Telugu Desk
26 May 2023, 5:50 IST

Revanth Reddy: “తెలంగాణ వస్తే పాలమూరు జిల్లాను అభివృద్ధి చేస్తామని కేసీఆర్ మాట ఇచ్చారని, తెలంగాణ వచ్చినా పాలమూరులో వలసలు ఆగలేదని నిరుద్యోగుల ఆత్మహత్యలు, రైతుల ఆత్మహత్యలు ఆగలేదని టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు.

Revanth Reddy: కేసీఆర్ పాలమూరు పాలిట శనిలా, శకునిలా తయారయ్యారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో భాగంగా గురువారం జడ్చర్లలో నిర్వహించిన సభలో రేవంత్ రెడ్డి ప్రసంగించారు.

రాష్ట్రంలో అభివృద్ధి నిధులన్నీ సిద్దిపేట, గజ్వేల్, సిరిసిల్లకు వెళుతున్నాయని ఆరోపించారు. 2009లో కరీంనగర్ ప్రజలు బొంద పెడ్తారని భయడి పాలమూరుకు వస్తే ఇక్కడి ప్రజలు గెలిపించి కేసీఆర్ కు రాజకీయ భిక్ష పెట్టారన్నారు. తెలంగాణ పునర్నిర్మాణంలో పాలమూరు జిల్లాను అభివృద్ధి చేస్తానని కేసీఆర్ మాట ఇచ్చి తప్పారని రేవంత్ రెడ్డి ఆరోపించారు.

కాళేశ్వరం, మల్లన్నసాగర్, కొండపోచమ్మ పూర్తయ్యాయని వాటి కంటే ముందు మొదలు పెట్టిన పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును ఎందుకు పూర్తి చేయలేదని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. 2010లో అలంపూర్ ప్రాంతంలో వరదలు వస్తే బంజారాహిల్స్ లోని తన ఇల్లు అమ్మి అయినా వరద బాధితులకు అమ్మి ఇళ్లు కట్టిస్తా అని మాట ఇచ్చాడని ఒక్క ఇల్లు కట్టివ్వలేదన్నారు.

“పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల కట్టడాన్ని ఎవరు అడ్డుకున్నారని కేసీఆర్ ను ప్రశ్నించారు.కేసీఆర్ చర్మం ఒలిచి చెప్పులు కుట్టించినా పాలమూరు ప్రజల రుణం తీర్చుకోలేరని పాలమూరులో 10లక్షల ఎకరాలను ఎడారి చేసే హక్కు కేసీఆర్ ఎవరు ఇచ్చారన్నారు.

2000లో చిన్నారెడ్డి నేతృత్వంలో 42 మంది శాసనసభ సభ్యులు సోనియా గాంధీకి తెలంగాణ కావాలని వినతి పత్రం ఇచ్చారని, అప్పుడు వనపర్తిలో సభ నిర్వహిస్తే 10 వేల మంది కూడా రారు అనుకుంటే 50 వేల మందికి పైగా వచ్చిన విషయాన్ని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు.

హైదరాబాద్ రాష్ట్ర ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు, సురవరం ప్రతాపరెడ్డి, సూదిని జైపాల్ రెడ్డి, మహేంద్రనాథ్, మల్లు అనంతరాములు, మల్లికార్జున గౌడ్ వంటి మహామహులు పాలమూరు నుంచి ప్రాతినిధ్యం వహించారని, వారంతా పాలమూరు బిడ్డలే అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. వచ్చిన తెలంగాణలో కేసీఆర్ కుటుంబంలో అందరికీ ఉద్యోగాలు ఇచ్చుకొని బడుగు బలహీనవర్గాల బిడ్డలు కులవృత్తులు చేసుకోని బతకాలని అంటున్నాడని ఇందుకోసమే తెలంగాణ తెచ్చుకుందని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.

100పడకల ఆస్పత్రి కూడా తీసుకురాలేదు…

జడ్చర్లకు ప్రాతినిధ్యం వహించిన లక్ష్మారెడ్డి వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉండి కూడా ఈ ప్రాంతానికి 100 పడకల ఆసుపత్రి తేలేకపోయారని, కనీసం ఆస్పత్రిలో కరెంట్ పోతే పెట్టుకునేందుకు జనరేటర్ కూడా లేదని రేవంత్ రెడ్డి విమర్శించారు. ఎర్రశేఖర్, మల్లు రవి ఉన్నప్పుడే జడ్చర్ల అభివృద్ధి జరిగిందని, సెజ్ కూడా కాంగ్రెస్ హయాంలోనే వచ్చిందన్నారు. జడ్చర్లపై అభివృద్ధి చర్చకు సిద్ధమన్నారు రేవంత్ రెడ్డి. “నేను ఇంతకు ముందే సవాల్ విసిరా...మరోసారి ఇక్కడ లక్ష్మారెడ్డికి సవాల్ విసురుతున్నానని ఏ ఊర్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చారో అక్కడే ఓట్లు అడగాలని ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చిన గ్రామాల్లో మేం ఓట్లు అడుగుతాం” దీనికి సిద్ధమా అని రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు.

2006లో మిడ్జిల్ నుంచి జెడ్పీటీసీగా స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేస్తే నన్ను గెలిపించారని, ఆ రోజు నాటిన మొక్క ఇవాళ మహా వృక్షమైందని టీపీసీసీ అధ్యక్షుడుగా మీ ముందు నిలబడ్డానని ఇది మిడ్జిల్ ప్రజల గొప్పదనమని రేవంత్ చెప్పారు. నల్లమల అడవుల్లో పుట్టిన బిడ్డకు టీపీసీసీ అధ్యక్షుడుగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని నడిపించే బాధ్యతను సోనియా గాంధీ గారు అప్పగించారని చెప్పారు. జిల్లాలో 14కు 14 అసెంబ్లీ స్థానాలను, 2 పార్లమెంటు స్థానాలను గెలిపించాలని అలా చేస్తేనే సోనియమ్మకు కృతజ్ఞత చెల్లించిన వాళ్లం అవుతామన్నారు. ఇది ఆత్మగౌరవానికి సంబంధించి అంశమని చెప్పారు.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏడాదిలోనే పాలమూరు-రంగారెడ్డి, నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల, తుమ్మిళ్ల ప్రాజెక్టులను పూర్తి చేసే బాధ్యత తీసుకుంటామని రేవంత్ రెడ్డి అన్నారు. బోయలను ఎస్టీల్లో చేరుస్తామన్నారు.

“కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఇల్లు కట్టుకునే పేదలకు రూ.5లక్షలు అందిస్తామని, రైతులకు 2లక్షల రుణమాఫీ అందిస్తామని 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తామని ప్రకటించారు. ఆరోగ్యశ్రీ ద్వారా రూ.5లక్షల వరకు వైద్య ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుందని రూ. 500లకే పేదలకు గ్యాస్ సిలిండర్ అందించే బాధ్యత కాంగ్రెస్‌దన్నారు

ఉచిత సిలిండర్ ఇస్తామని ఆడబిడ్డలని మోసం చేసేందుకు కేసీఆర్ కుట్ర చేస్తున్నాడని, ఉచిత సిలిండర్ కాదు కేసీఆర్ కిడ్నీలు అమ్మి ఇస్తానని చెప్పినా తెలంగాణ సమాజం నమ్మదని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.