పోలీస్ ఉద్యోగం కత్తిమీద సాము లాంటిది.. డిపార్ట్‌మెంట్ గురించి రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు-revanth reddy interesting comments about the telangana police department ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  పోలీస్ ఉద్యోగం కత్తిమీద సాము లాంటిది.. డిపార్ట్‌మెంట్ గురించి రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

పోలీస్ ఉద్యోగం కత్తిమీద సాము లాంటిది.. డిపార్ట్‌మెంట్ గురించి రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

పోలీస్ ఉద్యోగం కత్తిమీద సాము లాంటిది.. అని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో.. పోలీసులకు 'రియల్ హీరోస్ జీ అవార్డ్స్-2025' అవార్డులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోలీస్ శాఖ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

తెలంగాణలో పోలీసులు నూటికి నూరుశాతం శాంతిభద్రతలు కాపాడుతున్నారని.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొనియాడారు. తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలబడి.. ప్రపంచస్థాయి పెట్టుబడులను ఆకర్షించగలుగుతోందన్నారు. దేశ సరిహద్దుల్లోని సైనికుల్లా.. రాష్ట్రంలో శాంతి భద్రతలను పరిరక్షిస్తున్నారని అభినందించారు. పోలీస్ ఉద్యోగం కత్తిమీద సాము లాంటిదని అభివర్ణించారు.

పోలీస్ కుటుంబాలకు భరోసా..

'విధి నిర్వహణలో పోలీసులు చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు కాబట్టే.. మనం ప్రశాంతంగా ఉండగలుగుతున్నాం. ప్రజా ప్రభుత్వంలో విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసుల కుటుంబాలకు భరోసా అందిస్తున్నాం. విధి నిర్వహణలో మరణించిన ఐపీఎస్‌ల కుటుంబాలకు రూ.2 కోట్లు, అడిషనల్ ఎస్పీ, ఎస్పీల కుటుంబాలకు రూ.కోటిన్నర అందిస్తున్నాం. విధి నిర్వహణలో మరణించిన పోలీస్ కుటుంబాలను ఆదుకునేందుకు ప్రజా ప్రభుత్వంలో చర్యలు తీసుకున్నాం' అని సీఎం వివరించారు.

పిల్లల భవిష్యత్ కోసం..

'పోలీస్ పిల్లల భవిష్యత్ కోసం 50 ఎకరాల్లో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్‌ను ప్రారంభించుకున్నాం. వారికి మంచి భవిష్యత్‌ను అందించే బాధ్యత మాది. డ్రగ్స్ నియంత్రణకు యాంటీ నార్కోటిక్స్ విభాగాన్ని ఏర్పాటు చేసుకున్నాం. మారుతున్న కాలంతో పాటు నేరగాళ్లు కొత్త పద్ధతులు అవలంబిస్తున్నారు. సైబర్ క్రైమ్ నియంత్రణకు ఆ విభాగాన్ని మరింత బలోపేతం చేశాం. నేరం జరిగినప్పుడే కాదు.. నేరం జరగకుండా నియంత్రించాల్సిన బాధ్యత పోలీసులపై ఉంది' అని రేవంత్ వ్యాఖ్యానించారు.

ఎవరి మీద సమరం..

'ఇక సమరమే అని ఉద్యోగ సంఘాలు ప్రకటిస్తున్నాయి. మీ సమరం తెలంగాణ ప్రజలపైనా? ఎందుకు మీ సమరం.. గతంలో లేని విధంగా మొదటి తారీఖునే జీతాలు ఇస్తున్నందుకా? ప్రతీ నెలా రూ.7వేల కోట్లు కట్టాల్సిన పరిస్థితి ప్రభుత్వానిది. గత పాలకులు రూ.8500 కోట్లు రిటైర్మెంట్ బెనిఫిట్స్ బకాయిలు పెట్టి వెళ్లారు. కొన్ని రాజకీయ పార్టీలు మాపై ఆరోపణలు చేస్తున్నాయి. అవన్నీ వాళ్లు చెల్లించకుండా పెండింగ్ పెట్టి వెళ్లిన బకాయిలే. కేవలం పదహారు నెలల్లో మేం రూ.30 వేల కోట్ల నగదు రైతుల ఖాతాలకు బదిలీ చేశాం' అని ముఖ్యమంత్రి వివరించారు.

అన్ని బకాయిలే..

'ఉచిత విద్యుత్ అని చెప్పి.. ఆ శాఖకు బకాయిలు పెట్టి వెళ్లారు. విద్యుత్ ఉత్పత్తికి బొగ్గు కొనుగోలు చేసి సింగరేణికి బకాయి పెట్టి వెళ్లారు. ప్రాజెక్టులు కట్టామని చెప్పి.. కాంట్రాక్టర్లకు బకాయిలు పెట్టారు. 11 శాతం వడ్డీకి అప్పులు తెచ్చారు. ఇంతకంటే దుర్మార్గం ఉంటుందా? ప్రభుత్వం అంటే మేం ఒక్కరమే కాదు.. మనమంతా కలిస్తేనే ప్రభుత్వం. మనం పాలకులం కాదు.. సేవకులం' అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.

మనం సేవకులమే..

'ప్రభుత్వం ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు సహకరించాల్సిన ఉద్యోగ సంఘాల నాయకులు.. సమరం అని అంటుండ్రు. ఎవరిపై సమరం.. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు వారికి అండగా ఉండాల్సిన బాధ్యత ఉద్యోగ సంఘాల నాయకులపై లేదా? ఉద్యోగ సంఘాల నాయకులకు నేను విజ్ఞప్తి చేస్తున్న.. ఏదైనా సమస్య ఉంటే చర్చించుకుందాం. మనం సమరం చేయడానికి ఇక్కడ లేము. ప్రజలకు సేవచేయడానికే ఇక్కడ ఉన్నాం. ప్రజలపై యుద్ధం చేసిన వాళ్లు బాగుపడినవారు ఎవరూ లేరు' అని రేవంత్ స్పష్టం చేశారు.

నేనేం చేయలేను..

'ప్రభుత్వాన్ని అస్థిరపరిచాలనే రాజకీయ పార్టీల కుట్రలో ఉద్యోగ సంఘాలు పావులుగా మారొద్దు. కొత్త కోరికలతో ధర్నాలు చేస్తే.. ఉన్న వ్యవస్థ కుప్పకూలుతుంది. బాధ్యతగా వ్యవహరించాల్సిన మీరు బాధ్యత మరిచి వ్యవహరిస్తే తెలంగాణ సమాజం సహించదు. అప్పులు పుట్టినా ఏదైనా చేయొచ్చు.. కానీ ఎక్కడా అప్పు పుట్టడంలేదు. స్వీయ నియంత్రణనే దీనికి పరిష్కారం. ఉద్యోగ సంఘాల నాయకుల్లారా.. రాష్ట్ర ప్రభుత్వం మన కుటుంబం.. కుటుంబ పరువును బజారున పడేయొద్దు. రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థ దెబ్బతిన్నది.. నన్ను కోసినా.. వచ్చిన ఆదాయానికి మించి నేను ఏం చేయలేను' అని సీఎం తేల్చిచెప్పారు.

సంబంధిత కథనం