Revanth reddy: కేటీఆర్ కనుసన్నల్లోనే సిట్ విచారణ జరుగుతోందన్న రేవంత్ రెడ్డి-revanth reddy alleged that the sit inquiry is being conducted on the paper leak under ktr direction ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Revanth Reddy Alleged That The Sit Inquiry Is Being Conducted On The Paper Leak Under Ktr Direction

Revanth reddy: కేటీఆర్ కనుసన్నల్లోనే సిట్ విచారణ జరుగుతోందన్న రేవంత్ రెడ్డి

HT Telugu Desk HT Telugu
Mar 28, 2023 04:19 PM IST

Revanth reddy: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీక్ వ్యవహారంలో దర్యాప్తు సక్రమంగా జరగడం లేదని టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. పేపర్‌ లీక్ వ్యవహారంలో నోటీసులు తమకు, దర్యాప్తు సమాచారం కేటీఆర్‌కు సిట్ అధికారి అందిస్తున్నారని ఆరోపించారు.

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (twitter)

Revanth reddy: టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీపై ప్రశ్నించినందుకు తమకు నోటీసులు ఇస్తున్నారని, ప్రశ్నాపత్రాలు దొంగతనం చేసిన కేటీఆర్‌‌కు దర్యాప్తు సమాచారం ఇస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మండిపడ్డారు. పేపర్‌ లీక్ వ్యవహారంలో బ్యాంకు లావాదేవీల కంటే ఆర్థిక లావాదేవీలు ఎక్కువగా జరిగాయని, కోట్ల రూపాయలు చేతులు మారాయని, మనీలాండరింగ్, హవాలాతో పాటు విదేశాల్లో లావాదేవీలు జరిగాయని ఆరోపించారు.

ట్రెండింగ్ వార్తలు

సిట్ ఒక్కటే ఈ కేసును విచారించలేదని సీబీఐ, ఈడీ, ఏసీబీ శాఖలతో ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేయాల్సిందేనని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ అంశంపై ఫిర్యాదు చేసేందుకు కాంగ్రెస్ ఎంపీలు, మాజీ ఎంపీలు గత రెండు, మూడు రోజులుగా అపాయింట్‌మెంట్ అడుగుతుంటే సీబీఐ, ఈడీ డైరెక్టర్లు తమకు సమయం ఇవ్వడం లేదన్నారు. పేపర్‌ లీక్‌కేసులో ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఉన్నందున అవినీతి నిరోధక చట్టం కూడా వర్తిస్తుందన్నారు.

సిట్ అధికారులు అవినీతి నిరోధక చట్టం కింద ఒక్క సెక్షన్ కూడా పెట్టలేదని, అవినీతి నిరోధక చట్టం కింద కేసులు పెడితేచ ఈ కేసులు ఏసీబీ పరిధిలోకి వెళ్తాయని, ఏసీబీ కోర్టుకు క్రిమినల్ కేసులను కూడా విచారించే అధికారం ఉంటుందని, తద్వారా విచారణ త్వరగా ముగుస్తుందన్నారు. సీబీఐకి కేసు ఇస్తే ఈడీ కూడా వస్తుందని, అప్పుడు ఇంకా సత్వరంగా కేసులు తేలే అవకాశం ఉంటుందన్నారు. ప్రస్తుతం నిందితుల మీద పెట్టిన సెక్షన్లు, సాధారణ కోర్టుల్లో విచారణ జరిగితే కేసు తేలడానికి ఏళ్ల సమయం పడుతుందని రేవంత్ అన్నారు.

పేపర్‌ లీక్‌ కేసు నుంచి మంత్రి కేటీఆర్ తప్పించుకోవడానికి.. ఎదురుదాడి చేస్తూ.. విచారణ అధికారులపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ఒత్తిడి తీసుకు వస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. పేపర్ లీకేజీ విషయాన్ని తామే పసిగట్టామని కేటీఆర్ చెప్పడం అబద్దం అన్నారు. డబ్బు పంపకాల్లో వచ్చిన తేడాల వల్లే.. నిందితుల ద్వారా ప్రశ్నపత్రాల లీకేజీ బయటపడిందన్నారు. దీన్ని కప్పిపుచ్చడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ కుటుంబంపై ఆరోపణలు రావడంతో విధిలేని పరిస్థితుల్లోనే టీఎస్పీఎస్సీ బేగంపేట పీఎస్ లో ఫిర్యాదు చేసిందని, ఈ కేసును పక్కదారి పట్టించేందుకు, ప్రభుత్వ పెద్దలను కాపాడేందుకు ప్రభుత్వం కేసును సిట్ కు అప్పగించిందన్నారు.

తెలంగాణలో ఏదైనా సంచలన సంఘటనలు జరిగినప్పుడు.. అందులో ప్రభుత్వ పెద్దల పాత్ర కనిపించినప్పుడు... వారిని కాపాడేందుకు, సమస్యను పక్కదారి పట్టించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిసారి సిట్ ను నియమిస్తోందని చెప్పారు. ఎంసెట్, నయీం కేసుల నుంచి మొదలు ఇప్పటివరకూ వివిధ కేసుల్లో సిట్ ఒక్క నివేదికను కూడా ఇవ్వలేదని, నిందితులపైనా చర్యలు తీసుకోలేదని రేవంత్ రెడ్డి విమర్శించారు.

టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీపై ప్రశ్నించినందుకు సిట్ మాకు నోటీసులు, కేటీఆర్ కు సమాచారాన్ని ఇస్తోందన్నారు. సిట్ విచారణ కేటీఆర్ కనుసైగల్లోనే జరుగుతోందని, సిట్ విచారణ నివేదికను కోర్టుకు ఇవ్వకముందే జగిత్యాలలో పరీక్ష రాసిన వారి సమాచారం కేటీఆర్ కు ఎలా వచ్చిందన్నారు. ఈ ఇష్యూలో కేటీఆర్ పీఏ తిరుపతి చిన్న పావు మాత్రమే అన్నారు. కేటీఆర్ వద్ద నిర్దిష్టమైన సమాచారం ఉంది. ఆయనకు నోటీసులు ఇవ్వకపోగా క్రిమినల్ కేసులు పెడతామని మీడియాకు లీకులు ఇచ్చారని విమర్శించారు.

పేపర్ లీకేజీల్లో జరిగిన లావాదేవీలను, ప్రమేయం ఉన్న వ్యక్తులను కాపాడేందుకు కేటీఆర్ తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారని, కేటీఆర్ తత్తర, తొందరపాటు చూస్తే జనానికి ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుందన్నారు. నేరాన్ని చిన్నది చేసే ప్రయత్నం చేస్తున్నారని, మొత్తం ఆరోపణలు కేటీఆర్ పైనే చేస్తున్నామన్నారు.

 

IPL_Entry_Point