Revanth Reddy : నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న‌పై రేవంత్ రెడ్డి కీలక కామెంట్స్.. 10 ముఖ్యమైన అంశాలు-revanth reddy 10 key comments on constituency redivision ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Revanth Reddy : నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న‌పై రేవంత్ రెడ్డి కీలక కామెంట్స్.. 10 ముఖ్యమైన అంశాలు

Revanth Reddy : నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న‌పై రేవంత్ రెడ్డి కీలక కామెంట్స్.. 10 ముఖ్యమైన అంశాలు

Revanth Reddy : ప్ర‌స్తుతం దేశం పెద్ద స‌వాల్‌ను ఎదుర్కొంటోందని సీఎం రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీ జ‌నాభా జ‌రిమానాల విధానాన్ని కొన‌సాగిస్తోందన్నారు. నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న‌పై చెన్నై స‌ద‌స్సులో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు. దీనికి సంబంధించిన ముఖ్యమైన అంశాలు ఇలా ఉన్నాయి.

సమావేశంలో మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి

నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌నపై అంద‌రిని ఏక‌తాటిపై తెచ్చిన త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి స్టాలిన్‌కు ప్ర‌త్యేక అభినంద‌న‌లు.. పున‌ర్విభ‌జ‌న‌పై అభిప్రాయాలను పంచుకోవాలి అని రేవంత్ రెడ్డి సూచించారు. ఈ విష‌యంలో ద‌క్షిణాది రాష్ట్రాలు ఐక్యంగా పోరాడాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. ఆయన అభిప్రాయాల‌ను మిగతా నాయకులతో పంచుకుంటున్నారు. 1971లో జ‌నాభాను నియంత్రించాల‌ని నిర్ణ‌యం తీసుకున్న‌ప్ప‌టి నుంచి.. ద‌క్షిణాది రాష్ట్రాలు దాన్ని అమ‌లు చేస్తే.. ఉత్త‌రాదిలోని పెద్ద రాష్ట్రాలు విఫ‌ల‌మ‌య్యాయని సీఎం రేవంత్ వివరించారు.

10 ముఖ్యమైన అంశాలు..

1.ద‌క్షిణాది రాష్ట్రాల‌న్నీ వేగంగా ఆర్థిక వృద్దిని సాధించాయి. జీడీపీ, త‌ల‌స‌రి ఆదాయం, వేగంగా ఉద్యోగాల క‌ల్ప‌న‌, మెరుగైన మౌలిక వ‌స‌తుల క‌ల్ప‌న‌, సుప‌రిపాల‌న‌, సంక్షేమ కార్య‌క్ర‌మాల నిర్వ‌హ‌ణ‌లో మంచి ప్ర‌గ‌తి సాధించాయి. దేశ ఖ‌జానాకు మ‌నం పెద్ద మొత్తంలో నిధులు ఇస్తూ త‌క్కువ మొత్తాన్ని పొందుతున్నాం.

2.త‌మిళ‌నాడు ప‌న్నుల రూపంలో కేంద్రానికి రూపాయి చెల్లిస్తే.. 29 పైస‌లే వెన‌క్కి వ‌స్తున్నాయి. ఉత్త‌రప్ర‌దేశ్‌కు రూపాయికి రెండు రూపాయ‌ల 73 పైస‌లు వెన‌క్కి వెళుతున్నాయి. బీహార్‌ రూపాయి చెల్లిస్తే రూ. 6.06 వెన‌క్కి పొందుతోంది. రూపాయిలో క‌ర్ణాట‌క‌కు కేవ‌లం 14 పైస‌లు, తెలంగాణ‌కు 41 పైస‌లు, కేర‌ళ‌కు 62 పైస‌లు మాత్ర‌మే వెన‌క్కి వ‌స్తున్నాయి. అదే స‌మ‌యంలో మ‌ధ్యప్ర‌దేశ్ రూపాయి ప‌న్ను రూపంలో కేంద్రానికి ఇస్తే.. రూ. 1.73 పైసలు వెనక్కు పొందుతోంది.

3.ద‌క్షిణాది రాష్ట్రాల‌కు కేంద్రం కేటాయింపులు.. ప‌న్ను చెల్లింపులు క్ర‌మంగా త‌గ్గిస్తోంది. చివ‌ర‌కు జాతీయ ఆరోగ్య మిష‌న్ కేటాయింపుల్లోనూ ఉత్త‌రాది రాష్ట్రాల‌కే 60 నుంచి 65 శాతం నిధులు ద‌క్కుతున్నాయి. మ‌నది ఒకే దేశం.. మ‌నం దానిని గౌర‌విస్తాం. కానీ ఈ పున‌ర్విభ‌జ‌న‌ను మ‌నం అంగీక‌రించం. ఎందుకంటే ఇది దక్షిణాది రాష్ట్రాల రాజ‌కీయ కుదింపు. మంచి ప్ర‌గ‌తి సాధిస్తున్న రాష్ట్రాల‌ను ఈ ప్ర‌క్రియ శిక్షిస్తోంది. ఈ అస‌మ‌గ్ర‌మైన పున‌ర్విభ‌జ‌న ప్ర‌క్రియ చేప‌ట్ట‌కుండా బీజేపీని అడ్డుకోవాలి.

4.మొద‌టి పాయింట్‌... సీట్లు పెంచొద్దు. ఉన్న సీట్ల‌తోనే పున‌ర్విభ‌జ‌న ప్ర‌క్రియ చేప‌ట్టాలి. 1976లో ఇందిరాగాంధీ నేతృత్వంలోని కేంద్ర ప్ర‌భుత్వం అలానే పున‌ర్విభ‌జ‌న చేప‌ట్టింది. లేకుంటే రాష్ట్రాల మ‌ధ్య రాజ‌కీయ తేడాలు వ‌చ్చేవి. 2001లో ప్ర‌ధాన‌మంత్రి వాజ్‌పేయీ నేతృత్వంలోని ప్ర‌భుత్వం పున‌ర్విభ‌జ‌న ప్ర‌క్రియ‌ను అలానే ప్రారంభించింది. లోక్‌స‌భ సీట్ల‌ను అదే సంఖ్య‌లో ఉంచుతూ.. న‌రేంద్ర మోదీ అదే విధంగా చేయ‌గ‌ల‌రా?

5.రెండో పాయింట్‌... జ‌నాభా దామాషా ప్రాతిప‌దిక పున‌ర్విభ‌జ‌ను ద‌క్షిణాది వ్య‌తిరేకిస్తోంది. బీజేపీ ప్ర‌తిపాదిస్తున్న జ‌నాభా దామాషా ప‌ద్ద‌తిలో పున‌ర్విభ‌జ‌న చేప‌డితే ద‌క్షిణాది రాష్ట్రాలు రాజ‌కీయ గ‌ళం కోల్పోతాయి. జ‌నాభా ప్రాతిపదిక‌న పున‌ర్విభ‌జ‌న చేప‌డితే.. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌, బీహార్‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, రాజ‌స్థాన్‌, ఛత్తీస్‌గ‌ఢ్ వంటి రాష్ట్రాలు దేశంపై ఆధిప‌త్యం చ‌లాయిస్తాయ‌ని ఇక్క‌డ ఉన్న ప్ర‌తి ఒక్క‌రూ అంగీకరిస్తారు. ఏ ప‌రిస్థితుల్లోనూ దీనికి అంగీక‌రించ‌కూడ‌దు. బీజేపీ అనుస‌రిస్తున్న ఈ విధానానికి వ్య‌తిరేకంగా ద‌క్షిణాది ప్ర‌జ‌లు, పార్టీలు, నాయ‌కులు ఏకం కావాలి.

6.మూడో పాయింట్‌.. ప్రొరేటా విధానాన్ని అంగీక‌రించ‌లేం. ప్రొరేటా విధానం కూడా ద‌క్షిణాదికి న‌ష్ట‌మే క‌లిగిస్తుంది.. ప్రొరేటా ప్ర‌క్రియ కూడా రాజ‌కీయ అంత‌రాల‌ను పెంచుతుంది. ప్రొరేటా విధానాన్ని పాటిస్తే సీట్ల మ‌ధ్య తేడా కేంద్ర ప్ర‌భుత్వ ఏర్పాటును నిర్ణ‌యిస్తుంది. ఒక్క సీటు కూడా తేడాను చూపుతుంది.. ఒక్క సీటుతో కేంద్ర ప్ర‌భుత్వం ప‌డిపోయిన చ‌రిత్ర మ‌న దేశంలో ఉంది. కాబ‌ట్టి ప్రొరేటా విధానం కూడా ద‌క్షిణాది రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల‌కు భంగం క‌లిగిస్తుంది.

7.న‌రేంద్ర మోదీ మాజీ ప్ర‌ధాన‌మంత్రి వాజ్‌పేయీ విధానాన్ని పాటించాలి. మ‌రో 25 ఏళ్ల‌పాటు లోక్‌స‌భ సీట్ల‌లో ఎటువంటి మార్పు తీసుకురావ‌ద్దు. సీట్ల సంఖ్య‌లో మార్పు లేకుండా పున‌ర్విభ‌జ‌న ప్ర‌క్రియ చేప‌ట్టాలి. పున‌ర్విభ‌జ‌న‌కు రాష్ట్రాన్ని యూనిట్ తీసుకొని చేయాలి. రాష్ట్రాల్లోని జ‌నాభా ఆధారంగా పున‌ర్విభ‌జ‌న చేప‌ట్టాలి. రాష్ట్రాల్లోని న‌గ‌రాలు, గ్రామాల్లోని జ‌నాభా ఆధారంగా లోక్‌స‌భ సీట్ల హ‌ద్దుల‌ను మార్పు చేయాలి.

8.తాజా జ‌నాభా లెక్క‌ల ప్ర‌కారం రాష్ట్రాల్లో ఎస్సీ, ఎస్టీ సీట్ల సంఖ్య పెంచాలి. ప్ర‌తి రాష్ట్రంలో మ‌హిళ‌ల‌కు 33 శాతం రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించాలి. లోక్ స‌భ స్థానాల పెంపును మ‌రో 25 ఏళ్ల‌పాటు వాయిదా వేయాలి. తెలంగాణ‌లోని మ‌ల్కాజిగిరి ఎంపీగా చేశాను. అది ప్ర‌పంచంలోనే అతి పెద్ద నియోజ‌క‌వ‌ర్గం. అక్క‌డ మొత్తం జ‌నాభా 45 ల‌క్ష‌లైతే.. ఓట‌ర్లు 32 లక్ష‌లు. కాబ‌ట్టి ఈ స‌మ‌స్య‌ను పూర్తిగా అర్ధం చేసుకోగ‌ల‌ను.

9.పార్ల‌మెంట్ దేశానికి విధాన‌ప‌ర‌మైన శాస‌నాల‌ను రూపొందిస్తుందే త‌ప్ప.. ప్ర‌జ‌ల‌కు అవ‌స‌ర‌మైన చిన్న చిన్న స‌మ‌స్య‌ల‌పై నిర్ణ‌యాలు చేయ‌దు. ప్ర‌జ‌ల‌కు సంబంధించిన ముఖ్య‌మైన స‌మ‌స్య‌ల‌ను స్థానిక సంస్థ‌లు, రాష్ట్రాలు, శాస‌న‌స‌భ నియోజ‌క‌వ‌ర్గాల ప‌రిధిలోనే ప‌రిష్కారమ‌వుతాయి. జ‌నాభా నియంత్ర‌ణ‌కు సంబంధించి ద‌క్షిణాది రాష్ట్రాలను శిక్షించే విధానానికి కేంద్రం స్వ‌స్తి చెప్పాలి. దేశ నిర్మాణంలో 1975 నుంచి 2025 వ‌ర‌కు 50 ఏళ్ల పాటు అందించిన సేవ‌ల‌కు మ‌న‌ల్ని అభినందించాలి. మ‌న‌కు వెన‌క్కి కొంత చెల్లించాలి.

10.జ‌నాభా దామాషా ప్రాతిపదిక‌న చేసే పున‌ర్విభ‌జ‌న చేప‌ట్టొద్ద‌ని ద‌క్షిణాది రాష్ట్రాలు డిమాండ్ చేస్తున్నాయి. లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గాల‌కు సంబంధించి దేశంలోని ఇత‌ర రాష్ట్రాలతో సంబంధం లేకుండా.. చిన్న రాష్ట్రాలు, ఈశాన్య రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో సీట్ల‌ను ఏర్పాటు చేసిన‌ట్లే ద‌క్షిణాదికి అవ‌కాశం ఇవ్వాలి. మంచి ప్ర‌గ‌తి సాధించిన ద‌క్షిణాది రాష్ట్రాల‌కు పార్ల‌మెంట్ సీట్లలో మంచి వాటా ఇవ్వ‌డం ద్వారా.. ఇత‌ర రాష్ట్రాలు ఆర్థిక వృద్ది, సుప‌రిపాల‌న‌పై దృష్టి సారించేలా చేయాలి. ఎట్టి ప‌రిస్థితుల్లోనూ బీజేపీ పున‌ర్విభ‌జ‌న ప్ర‌క్రియ చేప‌ట్టాల‌నుకుంటే ప్ర‌ధాన డిమాండ్.. రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.

Basani Shiva Kumar

TwittereMail
బాసాని శివకుమార్ హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 8 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్‌లో ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పీజీ పూర్తి చేశారు. గతంలో ఈనాడు, ఈటీవీ భారత్, టీవీ9 తెలుగు, టైమ్స్ ఆఫ్ ఇండియా సమయంలో పని చేశారు. 2025లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.