జమ్మూ కశ్మీర్‌ ఉగ్రదాడిలో హైదరాబాద్‌, విశాఖ నెల్లూరు వాసులు మృతి.. పారిపోతున్నా వెంటాడి కాల్చేసిన ముష్కరులు-residents of hyderabad and visakhapatnam killed in jammu and kashmir terror attack ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  జమ్మూ కశ్మీర్‌ ఉగ్రదాడిలో హైదరాబాద్‌, విశాఖ నెల్లూరు వాసులు మృతి.. పారిపోతున్నా వెంటాడి కాల్చేసిన ముష్కరులు

జమ్మూ కశ్మీర్‌ ఉగ్రదాడిలో హైదరాబాద్‌, విశాఖ నెల్లూరు వాసులు మృతి.. పారిపోతున్నా వెంటాడి కాల్చేసిన ముష్కరులు

Sarath Chandra.B HT Telugu

జమ్మూకశ్మీర్‌ ఉగ్రదాడిలో హైదరాబాద్‌, విశాఖపట్నంలకు చెందిన ఇద్దరు పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. హైదరాబాద్‌లో పనిచేస్తున్న ఇంటెలిజెన్స్‌ బ్యూరో సెక్షన్ ఆఫీసర్‌ మనీశ్‌రంజన్‌, విశాఖకు చెందిన రిటైర్డ్‌ బ్యాంకు ఉద్యోగి చంద్రమౌళి ప్రాణాలు కోల్పోయారు.

పహల్గాం దాడిలో హైదరాబాద్‌, విశాఖలకు చెందిన పర్యాటకుల మృతి (ANI)

జమ్మూ కాశ్మీర్‌ ఉగ్రదాడిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు పర్యాటకులు మృతి చెందారు. విశాఖపట్నంకు చెందిన చంద్రమౌళి, హైదరాబాద్‌కు చెందిన ఇంటెలిజెన్స్ ఉద్యోగి మనీశ్ రంజన్‌ ప్రాణాలు కోల్పోయారు.

కశ్మీర్‌లో జరిగిన ఉగ్ర దాడిలో హైదరాబాద్‌ వాసి ఒకరు ప్రాణాలు కోల్పోయారు. కేంద్ర ప్రభుత్వంలో ఉద్యోగం చేస్తున్న మనీశ్‌ రంజన్‌ను ఉగ్రవాదులు కాల్చేశారు. కోఠీలోని ఇంటెలిజెన్స్‌ సబ్సిడరీ కార్యాలయంలో సెక్షన్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న మనీశ్‌ రంజన్‌ ఎల్టీసీలో భాగంగా జమ్మూ కశ్మీర్ పర్యటనకు వెళ్లారు.

భార్యఇద్దరు పిల్లలతో కలిసి కశ్మీర్‌లో పర్యటిస్తున్న మనీశ్‌ రంజన్‌ను ఉగ్రవాదులు కాల్చి వేశారు. దాడికి ముందు మనీశ్‌ రంజన్‌ ప్రయాణిస్తున్న ట్రావెల్స్‌ బస్సును చుట్టుముట్టిన ఉగ్రవాదులు అందులో ప్రయాణికులను కిందకు దింపేశారు.

అతడి వద్ద ఉన్న పత్రాలను పరిశీలించిన తర్వాత కుటుంబ సభ్యులను విడిచి పెట్టి మనీశ్‌ రంజన్‌పై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో మనీశ్‌ భార్య, ఇద్దరు పిల్లల ముందే ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ ఘటనతో వారు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.

ఉగ్రవాదులు దాడి జరిగిన సమయంలో మనీష్‌ కుటుంబం బస్సులో ఉంది. బస్సు నుంచి కిందకు దింపి పేరు అడిగి, గుర్తింపు కార్డు చూసిన తర్వాత తలకు గురి పెట్టి కాల్చేసినట్టు కుటుంబ సభ్యులు తెలతిపారు. . బీహార్‌కు చెందిన మనీశ్‌ రంజన్‌ ఉద్యోగంలో భాగంగా హైదరాబాద్‌లో పనిచేస్తున్నారు. 2022 లో హైదరాబాద్‌ బదిలీపై వచ్చారు.

నాలుగు రోజుల క్రితం కశ్మీర్‌ పర్యటనకు వచ్చారు. సబ్సిడరీ ఇంటెలిజెన్స్ బ్యూరోలో పనిచేస్తున్నారు. హైదరాబాద్‌ క్వార్టర్‌లో ఒంటరిగా నివసిస్తున్న మనీశ్ రంజన్‌ బీహార్‌లో ఉంటున్న కుటుంబ సభ్యులతో కలిసి విహార యాత్రకు వెళ్లినట్టు సహచర ఉద్యోగులు తెలిపారు. పోస్టుమార్టం తర్వాత మృతదేహాన్ని స్వస్థలానికి తరలించనున్నారు.

విశాఖ వాసిపై కాల్పులు…

జమ్మూ కశ్మీర్‌‌లో పర్యాటకులపై జరిగిన దాడిలో విశాఖపట్నంకు చెందిన చంద్రమౌళి ప్రాణాలు కోల్పోయారు. స్నేహితులతో కలిసి కాశ్మీర్ పర్యటనకు వెళ్లిన చంద్రమౌళి ఉగ్రవాదులు దాడితో పారిపోయేందుకు ప్రయత్నించినా ఉగ్రవాదులు వెంటాడి కాల్పులు జరిపారు. ఉగ్రవాదులు వెళ్లిన తర్వాత చంద్రమౌళి మృతదేహాన్ని సహచర పర్యాటకులు గుర్తించారు.

ఉగ్రవాదులకు ఎదురు పడగా పారిపోతుండగా వెంటాడి కాల్చేసినట్టు చంద్రమౌళి మిత్రులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. చంద్రమౌళి విజయా బ్యాంకులో పనిచేసి రిటైర్ అయ్యారు. కాల్పులు జరిగిన మూడు గంటల తర్వాత సహచర పర్యాటకులు మృతదేహాన్ని గుర్తించారు. సమాచారం తెలియడంతో కుటుంబ సభ్యులు విశాఖ నుంచి కశ్మీర్‌ బయల్దేరి వెళ్లారు.

విశాఖకు చెందిన చంద్రమౌళి ఆరుగురు స్నేహితులతో కలిసి జమ్మూ పర్యటనకు వెళ్లారు. ఈ నెల 18న కశ్మీర్ వెళ్ళి 26న తిరుగు ప్రయాణం కావాల్సి ఉంది. ఈ బృందంలో మిగిలిన వారు సురక్షితంగా ఉన్నట్టు కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. ఎయిరిండియా విమానంలో స్వస్థలాలకు బయల్దేరినట్టు బంధువులు మీడియాకు సమాచారం అందించారు.

ఏపీకి చెందిన మధుసూదనరావు మృతి…

ఉగ్రవాదుల దాడిలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మధుసూదనరావు అనే పర్యాటకుడు కూడా మృతి చెందారు. ఏపీకి చెందిన మధుసూదనరావు బెంగుళూరు ఇందిరానగర్‌లో నివసిస్తున్నారు. బంధువులతో కలిసి కశ్మీర్‌ పర్యటనకు వెళ్లి ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయారు.

నెల్లూరు జిల్లా కావలికి చెందిన సోమిశెట్టి మధుసూధన్ రావు ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయారు. బెంగుళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా స్థిరపడిన మధుసూదనరావు ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయారు. భార్య, కుమారుడు, కుమార్తెతో పాటు కావలిలో నివాసం ఉన్న వారి తల్లిదండ్రులు తిరుపాల్ , పద్మ లకు మంత్రి ఆనం సానుభూతి తెలిపారు.

నేడు కావలికి మధుసూదన్ భౌతికకాయం

బెంగళూరులో స్థిరపడ్డ మధుసూదన్ కుటుంబ సభ్యులతో విహారయాత్రకు వెళ్ళగా ఈ దారుణం జరిగింది. మధుసూదన్ ఐబీఎమ్ సాఫ్ట్వేర్ కంపెనీలో సీనియర్ ఆర్కిటెక్ గా విధులు నిర్వహిస్తున్నారు. కావలి అన్నాల వారి వీధిలో నివాసముండే సోమిశెట్టి తిరుపాల్, పద్మ దంపతుల కుమారుడు మధుసూదన్. ఆయనకు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు.

నేడు ప్రత్యేక విమానంలో మధుసూదన్ మృతదేహాన్ని చెన్నైకి తరలించనున్నారు. అక్కడి నుంచి సాయంత్రానికి కావలికి తీసుకోస్తారు. తల్లిదండ్రులు హుద్రోగులు కావడంతో మధుసూదన్ మరణవార్తను బంధువులు గోప్యంగా ఉంచారు.

శరత్‌ చంద్ర హిందుస్తాన్ టైమ్స్‌ తెలుగు న్యూస్‌ ఎడిటర్‌గా ఉన్నారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో వివిధ హోదాల్లో 2001 నుంచి పని చేస్తున్నారు. జర్నలిజంలో నాగార్జున యూనివర్శిటీ నుంచి పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. గతంలొ ఈనాడు, ఎన్‌టీవీ, టీవీ9, హెచ్‌ఎంటీవీ, టీవీ5లలో వివిధ హోదాలలో విజయవాడ, హైదరాబాద్‌, ఢిల్లీలలో పనిచేశారు. 2022లో హెచ్‌టీ తెలుగులో చేరారు. ఇక్కడ ఏపీ తెలంగాణకు సంబంధించిన వర్తమాన అంశాలు, బ్యూరోక్రసీ, రాజకీయ వార్తలు, క్రైమ్ వార్తలను అందిస్తారు.

సంబంధిత కథనం