కొద్దిరోజులుగా తెలంగాణలో భిన్న వాతావరణ పరిస్థితులు ఉన్నాయి. ఓవైపు ఎండల తీవ్రత ఉన్నప్పటికీ… మరోవైపు సాయంత్రం దాటితే వాతావరణం చల్లబడిపోతోంది. కొన్నిచోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ తో సహా పలు జిల్లాల్లోనూ ఇదే పరిస్థితులు ఉన్నాయి. మరో నాలుగైదు రోజుల పాటు కూడా రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉంది.
దక్షిణ తెలంగాణతో పాటు పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో ఉపరితల ఆవర్తనం తక్కువగా ఉన్నట్లు వాతావరణశాఖ తెలిపింది. ఇది దక్షిణ తెలంగాణ నుంచి రాయలసీమ మరియు తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కిమీ ఎత్తులో కొనసాగుతున్నట్లు వెల్లడించింది.
మరోవైపు నైరుతి రుతుపవనాలపై కూడా ఐఎండీ కీలక అప్డేట్ ఇచ్చింది. దక్షిణ అండమాన్ సముద్ర, అగ్నేయ బంగాళాఖాతం, నికోబార్ దీవులలోని కొన్ని ప్రాంతాల్లోకి మే 13, 2025వ తేదీ నాటికి ప్రవేశించే అవకాశం ఉందని పేర్కొంది.
తాజా వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇవాళ (మే 7) తెలంగాణలోని కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం,ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్ధిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్ గిరి జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.
రేపు (మే 08) నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, జనగాం, సిద్ధిపేట, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్ గిరి, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో అక్కడకక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.
తెలంగాణలో మే 11వ తేదీ వరకు కూడా పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆ తర్వాత తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. వర్షాలతో ఉష్ణోగ్రతల్లో స్వల్ప మార్పులు ఉన్నాయి.
ఇక ఏపీలో ఇవాళ కృష్ణా, గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో వర్షంతో పాటు పిడుగులు పడే అవకాశం అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఉరుములతో కూడిన వర్ష సూచన ఉండటంతో ప్రజలు చెట్ల క్రింద నిలబడవద్దని సూచించింది. ఈదురుగాలుల వీచేప్పుడు హోర్డింగ్స్ దగ్గర ఉండరాదని హెచ్చరించింది.
అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు,గంగవరం మండలాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు,అలాగే ఉత్తరాంధ్ర జిల్లాల్లో పలుచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. 40-50కిమీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది.