హైదరాబాద్ నగరంతో పాటు పలు ప్రాంతాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. మధ్యాహ్నం వరకు ఎండగా ఉన్నప్పటికీ.. సాయంత్రం కల్లా పూర్తిగా మారిపోయింది. పలు ప్రాంతాల్లో ఒక్కసారిగా భారీ ఈదురుగాలులతో కూడిన వర్షం మొదలైంది. దీంతో పలుచోట్ల ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి.
బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, సచివాలయం, నాంపల్లి, ఫిలింనగర్, గచ్చిబౌలి, చిక్కడపల్లితో పాటు మరికొన్ని ప్రాంతాల్లో వర్షం దంచికొడుతుంది. దిల్ సుఖ్ నగర్, ఎల్బీ నగర్, కొత్తపేట, హయత్ నగర్, ఉప్పల్ తో మరికొన్ని ప్రాంతాల్లోనూ వర్షం పడుతోంది. పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.
ఓల్డ్ బోయిన్పల్లి ఎయిర్పోర్ట్ మార్గంలో వరద నీరు భారీగా నిలిచిపోయింది. మాదాపూర్లో రోడ్డుపై భారీగా వరదనీరు ఉండటంతో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. నాంపల్లి రెడ్హిల్స్లో ట్రాన్స్ఫార్మర్పై చెట్టు కూలిపోయింది. అంతేకాకుండా నిజాం కాలేజ్ దగ్గర రోడ్డుపై ఓ చెట్టు కూలిపోవటంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.
ఇవాళ కొత్తగూడెం, ములుగు, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు ఎల్లో హెచ్చరికలను జారీ చేసింది. ఆయా జిల్లాల్లోని పలుచోట్ల ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది.
రేపు నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, మహబూబ్నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి ఉండొచ్చని అంచనా వేసింది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలను జారీ చేసింది.
సంబంధిత కథనం