తెలంగాణలోని పలు జిల్లాల్లో మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని.. హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. వర్షాలు కురిసే ఈ మూడు రోజుల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి మూడు డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశాలున్నాయని స్పష్టం చేసింది. శనివారం కూడా పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తాయని తెలిపింది.
వర్షాలు కురిసే సమయంలో.. గంటకు 30 కిలోమీటర్ల నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అంచనా వేసింది. రానున్న రెండు రోజులు కూడా బలంగా ఈదురు గాలులు ఉంటాయని హెచ్చరించింది. గాలులు ఆకస్మాత్తుగా వీచే అవకాశం ఉందని.. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు.
అటు రుతుపవనాలు కూడా నిర్ణీత సమయం కంటే ముందే తీరాన్ని చేరుకోవచ్చని.. భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. మే నెల 27న రుతుపవనాలు కేరళ తీరం వరకు రానున్నాయి. సాధారణంగా నైరుతి రుతుపవనాలు జూన్ 1 నాటికి కేరళలో ప్రవేశించి జూలై 8 నాటికి దేశం వ్యాపిస్తాయి. కానీ ఈసారి ముందే వస్తాయని అంచనా వేస్తున్నారు. 2025 రుతుపవనాల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని ఐఎండీ అంచనా వేసింది.
నాలుగు నెలల రుతుపవనాల్లో (జూన్ నుంచి సెప్టెంబర్ వరకు) భారత్లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని.. మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ శాఖ కార్యదర్శి ఎం.రవిచంద్రన్ వివరించారు. ఈసారి ప్రీ మాన్ సూన్ యాక్టివిటీ కూడా బాగా కనిపిస్తోందన్నారు. నెల రోజులుగా దేశంలోని చాలా ప్రాంతాల్లో బలమైన గాలులు, వర్షాలు కురుస్తున్నాయని చెప్పారు.
ఈ సంవత్సరం రుతుపవనాలు దక్షిణ అండమాన్ సముద్రం, బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలు, నికోబార్ దీవులలోకి మే 13న ప్రవేశించవచ్చని వాతావరణ శాఖ ఇటీవల తెలిపింది. సాధారణంగా ఇది మే 20న జరుగుతుంది. కానీ ఈసారి అది ఒక వారం ముందుగానే జరుగుతోంది. నికోబార్ దీవుల నుంచి రుతుపవనాలు కేరళకు చేరుకోవడానికి సాధారణంగా 10 రోజులు వరకు పట్టే అవకాశం ఉంది.
సంబంధిత కథనం