TS Weather : చల్లబడ్డ వాతావరణం.. మరో రెండు రోజులు వర్షాలు, ఎల్లో హెచ్చరికలు జారీ
Rains in Telangana: హైదరాబాద్ లో వాతావరణం చల్లబడింది. పలుచోట్ల మోస్తరు వర్షం కురిసింది. పలు జిల్లాల్లో కూడా వానలు కురుస్తున్నాయి.
Weather Updates of Telugu States: గత రెండు మూడు రోజులుగా తెలంగాణలో వాతావరణం మారుతోంది. ఓవైపు ఎండలు మండిపోతూనే..మరోవైపు వర్షాలు పడుతున్నాయి. ఇవాళ హైదరాబాద్ లో మధ్యాహ్నం వరకు ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ... ఆ తర్వాత వాతావరణం పూర్తిగా చల్లబడిపోయింది. పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురిసింది. శివారు ప్రాంతాల్లో కూడా తేలికపాటి వర్షాలు పడ్డాయి. మేడ్చల్ జిల్లాలో పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో చిరుజల్లులు కురిశాయి. జీడిమెట్ల, కుత్బుల్లాపూర్, కూకట్పల్లి, బోడుప్పల్ కేపీహెచ్బీ కాలనీ, వివేకానందనగర్, నిజాంపేట ప్రాంతాల్లో ఈదురుగాలులతో వర్షం కురిసింది.
ట్రెండింగ్ వార్తలు
రెండు రోజులపాటు వర్ష సూచన...
మరోసారి తెలంగాణకు వర్ష సూచన ఇచ్చింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. ఇవాళ రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. గురువారం ఉదయం వరకు కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో్ అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. జూన్ 1 నుంచి జూన్ 2 తేదీ వరకు చూస్తే... పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో హెచ్చరికలను జారీ చేసింది.
మరోవైపు మండిపోతున్న ఎండల నుంచి ఉపశమనం ఇచ్చేలా వాతావరణ శాఖ తీపి కబురు అందించింది. రుతుపవనాల్లో కదలిక రావడంతో పాటు మరో రెండురోజుల్లో నైరుతి, ఆగ్నేయ, మధ్య బంగాళాఖాతాల్లోకి విస్తరిస్తుందని అంచనా వేస్తోంది. జూన్ 4 కల్లా కేరళలోకి రుతుపవనాలు ప్రవేశిస్తాయని అక్కడ నుంచి అన్ని ప్రాంతాలకు విస్తరిస్తాయని ఐఎండీ పేర్కొంది. వారం రోజుల క్రితం రుతు పవనాలు అండమాన్ సముద్రంతో పాటు దక్షిణ బంగాళాఖాతంలోకి సకాలంలోనే ప్రవేశించిన తర్వాత ఊహించిన దానికంటే నెమ్మదిగా కదులుతున్నాయి. గురువారం నుంచి అవి చురుకుదనాన్ని సంతరించుకుంటాయని ఐఎండీ భావిస్తోంది. వారాంతంలోగా రుతుపవనాలు మాల్దీవులు, కొమరిన్ ప్రాంతాలతో పాటు నైరుతి, ఆగ్నేయ, మధ్య బంగాళాఖాతాల్లోని కొన్ని ప్రాంతాలకు, అనంతరం మధ్య, ఆగ్నేయ బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని భారత వాతావరణశాఖ మంగళవారం రాత్రి వెల్లడించింది.
నైరుతి రుతుపవనాల్లో ఎట్టకేలకు కదలిక వస్తోంది. వారం రోజుల క్రితం రుతు పవనాలు అండమాన్ సముద్రంతో పాటు దక్షిణ బంగాళాఖాతంలోకి సకాలంలోనే ప్రవేశించిన తర్వాత ఊహించిన దానికంటే నెమ్మదిగా కదులుతున్నాయి. గురువారం నుంచి అవి చురుకుదనాన్ని సంతరించుకుంటాయని ఐఎండి అంచనా వేసింది.
వారాంతంలోగా రుతుపవనాలు మాల్దీవులు, కొమరిన్ ప్రాంతాలతో పాటు నైరుతి, ఆగ్నేయ, మధ్య బంగాళాఖాతాల్లోని కొన్ని ప్రాంతాలకు, అనంతరం మధ్య, ఆగ్నేయ బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని భారత వాతావరణశాఖ మంగళవారం రాత్రి వెల్లడించింది.