Rain Alert For Telugu States: ద్రోణి ఎఫెక్ట్... మార్చి 16 నుంచి వర్ష సూచన!
Weather Updates Telugu States: రాష్ట్రంలో ఎండలు షురూ అయ్యాయి. క్రమంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఇదిలా ఉంటే మార్చి 16 తర్వాత పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ ప్రకటించింది.
Telugu States Weather News: తెలుగురాష్ట్రాల్లోని ప్రజలకు వేడి నుంచి ఉపశమనం లభించనుంది. ఛత్తీస్గఢ్ నుంచి విదర్భ, తెలంగాణ మీదుగా కర్ణాటక వరకు ద్రోణి ఏర్పడింది. ఫలితంగా తెలంగాణ, ఏపీలోని పలు ప్రాంతాల్లో మార్చి 16 నుంచి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెల 20వ తేదీ వరకు రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా తక్కువగా నమోదయ్యే అవకాశాలున్నట్లు అంచనా వేసింది.
ట్రెండింగ్ వార్తలు
ప్రస్తుతం పడమర గాలులతో ద్రోణి ఏర్పడినట్లు వాతావరణశాఖ పేర్కొంది. ఇది సముద్ర మట్టానికి 5.8 కి.మీ. నుంచి 7.6 కి.మీ. ఎత్తులో ఉంటూ బిహార్ నుంచి దక్షిణ కర్ణాటక వరకు ఛత్తీస్గఢ్, విదర్భ, తెలంగాణ, ఉత్తర అంతర్గత కర్ణాటక మీదుగా కొనసాగుతోందని తెలిపింది. ఈ నెల 16న ఈస్టిండియాపై మరో ద్రోణి, దక్షిణాది రాష్ట్రాలపై మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడబోతున్నాయి. వీటి ప్రభావంతో గాలుల దిశ మారనుందని అంచనా వేస్తోంది. మార్చి 16 నుంచి 20 వరకు తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో పలుచోట్ల పగటి (గరిష్ట) ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2–4 డిగ్రీలు తక్కువగా నమోదవుతున్నాయి. రానున్న ఐదారు రోజులు కూడా ఇవే ఉష్ణోగ్రతలు కొనసాగుతాయని ఐఎండీ చెప్పింది.
మరోవైపు శనివారం గరిష్ఠ ఉష్ణోగ్రతలన్నీ సాధారణం కన్నా తక్కువగా నమోదయ్యాయి. హైదరాబాద్లో సాధారణం కన్నా 2.6 డిగ్రీలు తక్కువగా 32.7 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. ఇవాళ కూడా సాధారణం కంటే పలు డిగ్రీలు తక్కువగానే నమోదయ్యే అవకాశం ఉంది. పొడి వాతవరణం ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. 14వ తేదీ వరకు ఇదే పరిస్థితి ఉంటుందని.. మార్చి 15 నుంచి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తాజా బులెటిన్ పేర్కొంది.