Bandi Sanjay: రాహుల్ గాంధీ కులం మతం జాతి లేని వ్యక్తి, మరోసారి బండి సంజయ్ వివాదాస్పద కామెంట్
Bandi Sanjay: కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ పై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. కులం మతం జాతి లేని వ్యక్తి రాహుల్ గాంధీ అని మండిపడ్డారు. రాహుల్ గాంధీ ఏ కుల మతానికి చెందిన వారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

Bandi Sanjay: కరీంనగర్ లో కేేంద్ర మంత్రి బండి సంజయ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అంబేద్కర్ స్టేడియంలో ఆరు రోజుల పాటు స్వదేశీ జాగరణ మంచ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘స్వదేశీ మేళా’’ ముగింపు కార్యక్రమానికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ హాజరై రాహుల్ గాంధీ కులం, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కులగణన బిసి రిజర్వేషన్ పై మండిపడ్డారు.
కాంగ్రెస్ నేతల మాట్లాడిన మాటలు టీవీల్లో చూశానని చెప్పిన బండి సంజయ్, తండ్రి కులమే కొడుకుకు వర్తిస్తుందని, రాజీవ్ గాంధీ హిందువు అయినందున ఆయన కుమారుడు రాహుల్ గాంధీ కూడా హిందువేనని కాంగ్రెస్ నేతలు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. అసలు రాజీవ్ గాంధీ హిందువు ఎట్లా అవుతాడో చెప్పాలన్నారు.
రాజీవ్ గాంధీ తండ్రి ఫిరోజ్ జహంగీర్ ఖాన్ పార్శీ మతస్థుడు. పర్సియాలోని ముస్లిం సంతతికి చెందిన వాళ్ల పూర్వీకులు ఇండియాకు వచ్చి పార్శీలుగా మారారు. ఫిరోజ్ జహంగీర్ ఖాన్ మతమే రాజీవ్ గాంధీకి వర్తిస్తుంది. కాబట్టి రాజీవ్ గాంధీ అసలు హిందూ కానేకాదు... ముస్లిం మూలాలున్న పార్శీ మతస్తుడు....
టెన్ జన్ పథ్ లోని రాహుల్ గాంధీ కుటుంబానికి కులం, మతం, జాతి, దేశం లేదు... కానీ మోదీ పక్కా ఇండియన్ అని స్పష్టం చేశారు. మోదీకి విదేశీయులే సాష్టాంగ నమస్కారం చేస్తున్నారని, విదేశాల్లో ప్రతి భారతీయుడు గర్వంగా ఇండియన్ ఇని కాలర్ ఎగరేసి తలెత్తుకుని తిరిగేలా చేస్తున్నారని తెలిపారు.
బిసిలను తగ్గించేందుకు కాంగ్రెస్ కుట్ర...
బీసీ కుల గణన పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం హిందువులకు తీవ్రమైన అన్యాయం చేస్తుందని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. ఒక వర్గానికి, మతానికి కొమ్ము కాసేందుకు కాంగ్రెస్ నేతలు బీసీల జనాభా తగ్గించే కుట్ర చేస్తున్నారని విమర్శించారు.
10 శాతమున్న ముస్లింలను బీసీల్లో కలిపారని, 42 శాతం బీసీ రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి... అందులో 10 శాతం ముస్లింలకే ఇచ్చేందుకు కుట్ర చేస్తుందని ఆరోపించారు. ఈ లెక్కన బీసీలకు 32 శాతం రిజర్వేషన్లు మాత్రమే వర్తిస్తాయని, మరి 42 శాతం బీసీలకు రిజర్వేషన్లు ఎట్లా ఇస్తారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీరువల్ల బీసీలకు న్యాయం కంటే అన్యాయం ఎక్కువ జరుగుతుందన్నారు.
లవ్ జిహాది కి వ్యతిరేకంగా చట్టం రావాలి..
మత మార్పిడీలకు, లవ్ జిహాదీలకు వ్యతిరేకంగా చట్టం తీసుకురావాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ డిమాండ్ చేశారు. మహారాష్ట్ర ప్రభుత్వం లవ్ జిహాది, మతమార్పిడీలకు వ్యతిరేకంగా తీసుకురావాలని నిర్ణయించిందన్నారు. అట్లాంటి చట్టం తెలంగాణలోనూ తీసుకురావాలని కోరారు. అలా కాకుండా ముస్లింలను బీసీ జాబితాలో కలిపి కేంద్రానికి పంపితే... ఆ జాబితాను కేంద్రం ఆమోదించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
ఇందులో ఎలాంటి మొహమాటం లేదన్నారు. హిందూ ధర్మ సమాజం కోసం నిరంతరం పనిచేస్తామని తెలిపారు. మమ్ముల్ని మతతత్వ వాదులుగా ముద్రవేసిన పర్వాలేదు...కానీ ముస్లీంలను బీసీ జాబితాలో చేర్చితే మాత్రం చూస్తు ఊరుకోబోమని హెచ్చరించారు. బిసీల నుంచి ముస్లింల జనాభాను తీసేసి కేంద్రానికి పంపిస్తే తప్పనిసరిగా ఆ జాబితా ఆమోదం పొందేలా చేస్తామని తెలిపారు.
(రిపోర్టింగ్ కె వి రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు)
సంబంధిత కథనం