భారత్ సమ్మిట్-2025కు నిన్ననే రావాల్సి ఉండే.. కానీ కాశ్మీర్కి వెళ్లాను.. క్షమించండి.. అంటూ రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. ఈ సమ్మిట్ నిర్వహించిన తెలంగాణ ప్రభుత్వానికి శుభాకాంక్షలు చెప్పారు. రాజకీయాల్లోకి కొత్త జనరేషన్ రావాలన్న రాహుల్.. ప్రజాస్వామ్య రాజకీయాలు ప్రపంచవ్యాప్తంగా మారిపోయాయని వివరించారు. పదేళ్ల కిందటి నాటి పరిస్థితులు ఇప్పుడు లేవని వ్యాఖ్యానించారు.
'మోడ్రన్ సోషల్ మీడియాతో అంతా మారిపోయింది. ఇప్పుడంతా మోడ్రన్ రాజకీయమే. ప్రతిపక్షాలను అణచివేసే కార్యక్రమాలు జరుగుతున్నాయి. విపక్షాలకు సభలో మాట్లాడే అవకాశం రావడం లేదు. భారత్ జోడో యాత్రలో 4 వేల కిలోమీటర్లు నడిచా. కన్యాకుమారి నుండి పాదయాత్ర మొదలుపెట్టా. 10 రోజుల తర్వాత చూస్తే నాతో పాటు నడిచే వారి సంఖ్య పెరిగిపోయింది. ఈ యాత్రలో ఎన్నో విషయాలు తెలుసుకున్నా' అని రాహుల్ గాంధీ వివరించారు.
'సగం దూరం నడిచేటప్పటికి నేను గతంలోలా లేను. ప్రజలతో ఎలా మాట్లాడాలో.. వారి సమస్యలు ఎలా వినాలో నేర్చుకున్నా. నేను గతంలో ఎప్పుడూ ప్రజలపై ఉన్న ప్రేమను వ్యక్తపరచలేదు. కానీ భారత్ జోడో యాత్రలో నేను ప్రజలపై నా ప్రేమను వ్యక్త పరచగలిగాను. నేను ఎప్పుడైతే ప్రజలపై నా ప్రేమను వ్యక్తపరిచానో అప్పట్నుంచి అందరూ స్పందిస్తున్నారు' అని రాహుల్ గాంధీ వివరించారు.
'పదేళ్లలో ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదు. అందుకే కాంగ్రెస్ పాలన మీద ఎక్కువ నమ్మకాన్ని పెట్టుకున్నారు. రూ.20 వేల కోట్లు రైతులకు రుణమాఫీ చేశాం. దేశంలోనే ఇది పెద్ద నిర్ణయం. రైతు భరోసా పేరుతో ఎకరాకు రూ.12,000 ఇస్తున్నాం. ఉపాధి హామీ కార్డు దారులకు సాయం చేస్తున్నాం. రైతులకు కనీస మద్దతు ధర ఇస్తున్నాం. దీనికి తోడు 500 బోనస్ క్వింటాల్ కీ ఇస్తున్నాం. సర్టిఫికేట్ ఉన్నా.. నైపుణ్యం లేక ఉద్యోగ అవకాశాలు లేవు. అందుకే స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేశాం. ఏడాదిన్నరలో 56 వేల ఉద్యోగాలు ఇచ్చాం' అని సీఎం రేవంత్ రెడ్డి వివరించారు.
'తెలంగాణలో పెట్టుబడులను ఆహ్వానించాం. దావోస్ నుండి లక్ష కోట్ల పెట్టుబడులు తెచ్చాం. మహిళలను కోటీశ్వరులను చేయడమే మా అజెండాగా పెట్టుకున్నాం. మహిళా పారిశ్రామికవేత్తలను బడా పారిశ్రామికవేత్తలుగా చేయాలని ఆలోచన. ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్నాం. ఉచిత విద్యుత్ అందిస్తున్నాం' అని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
భారత్ సమ్మిట్పై కేఏ పాల్ సంచలన ఆరోపణలు చేశారు. 'భారత్ సమ్మిట్ టోటల్ డిజాస్టర్. రేవంత్ రెడ్డి రూ.100 కోట్లు పెట్టి భారత్ సమ్మిట్ సదస్సు నిర్వహిస్తే.. ఒక్క ప్రపంచ నాయకుడు రాలేదు. ఇది భారత్ సమ్మిట్ కాదు కాంగ్రెస్ సమ్మిట్. ఒక్క ప్రెసిడెంట్, ఒక్క ప్రైమ్ మినిస్టర్, ఒక్క గ్లోబల్ సెలబ్రెటీ, 3000 మంది బిలియనీర్లు ఎవ్వరూ రాలేదు. తెలంగాణ రాష్ట్రాన్ని, దేశాన్ని సర్వనాశనం చేసిన సమ్మిట్ ఇది' అని కేఏ పాల్ ఆరోపించారు.