Rahul Gandhi Yatra : ‘మోదీ- కేసీఆర్లు కలిసే పనిచేస్తున్నారు’
Rahul Gandhi Yatra : తెలంగాణలో భారత్ జోడో యాత్ర ముగిసింది. ఈ నేపథ్యంలో కామారెడ్డిలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో మోదీ, కేసీఆర్లపై తీవ్ర ఆరోపణలు చేశారు.
Rahul Gandhi concludes Bharat Jodo Yatra in Telangana : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్లు కలిసే పనిచేస్తున్నారని ఆరోపించారు కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ. మోదీ తీసుకొచ్చే ప్రతి చట్టానికీ పార్లమెంట్లో కేసీఆర్ బృందం మద్దతిస్తోందని అన్నారు. అటు ప్రధాని మోదీ.. ప్రభుత్వ రంగాల ప్రైవేటీకరణ చేస్తుంటే, ఇటు సీఎం కేసీఆర్.. ప్రాజెక్టుల పేరుతో కమీషన్లు దోచుకుంటున్నారని విమర్శించారు.
ట్రెండింగ్ వార్తలు
తెలంగాణలో గత కొన్ని రోజులుగా సాగుతున్న భారత్ జోడో యాత్ర.. సోమవారం ముగిసింది. ఈ నేపథ్యంలో సోమవారం సాయంత్రం కామారెడ్డి జుక్కల్లోని మేనూర్లో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసింది కాంగ్రెస్. ఈ సభలో మాట్లాడిన రాహుల్ గాంధీ.. మోదీ, కేసీఆర్లపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. అదే సమయంలో కాంగ్రెస్ కార్యకర్తలను ప్రశంసించారు.
Bharat Jodo Yatra Telangana : "మోదీ పాలన నుంచి దేశాన్ని రక్షించేందుకే భారత్ జోడో యాత్ర చేపట్టాము. నోట్ల రద్దుతో రైతులు, ప్రజల జీవితాలను మోదీ నాశనం చేశారు. తెలంగాణ ప్రభుత్వం రైతులకు ఏం చేయడం లేదు. మేము తెలంగాణలో అధికారంలోకి వచ్చిన వెంటనే రైతుల రుణాలను మాఫీ చేస్తాము. రైతుల వెన్నంటే ఉంటాము," అని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు.
"12 రోజుల పాటు తెలంగాణలో పాద యాత్ర చేశాను. తెలంగాణను విడిచి వెళుతుంటే బాధగా ఉంది. కాంగ్రెస్ కార్యకర్తలు ఇక్కడ అద్భుతంగా పనిచేస్తున్నారు. ఎన్ని ఎదురుదెబ్బలు తగిలినా.. పోరాటం ఆపని వీరులు మీ తెలంగాణ ప్రజలు," అని రాహుల్ గాంధీ అన్నారు.
ఈ సందర్భంగా.. యాత్రలో పాల్గొన్న ఓ బాలుడి గురించి మాట్లాడారు రాహుల్ గాంధీ.
Rahul Gandhi Bharat Jodo Yatra : "ఓ పిల్లాడు నాతో పాటు పాదయాత్ర చేసేందుకు ప్రయత్నించాడు. కానీ పోలీసులు అడ్డుకున్నారు. వెనక్కి పంపించేశారు. కిందపడినా.. ఆ బాలుడు వెనకడుగు వేయలేదు. నా వరకు వచ్చాడు. నన్ను ఏం అడగలేదు. నాతో కలిసి పాదయాత్ర చేశాడు. ఇదంతా నేను చూస్తూనే ఉన్నాను. ఆ బాలుడి తండ్రి గురించి అడిగాను. అనారోగ్యంతో రాలేదని చెప్పాడు. నేను ఆ తండ్రితో ఫోన్లో మాట్లాడాను. నిస్వార్థంగా వచ్చి నాతో పాదయాత్రలో పాల్గొన్న ఆ పిల్లాడిని చూస్తే సంతోషం వేసింది. తెలంగాణ ప్రజలందరు అంతే. ఇక్కడి ప్రజల్లో పోరాడే స్వభావం ఉంది," అని రాహుల్ గాంధీ అన్నారు.
తెలంగాణలో భారత్ జోడో యాత్ర మొత్తం మీద 375కిలోమీటర్లు సాగింది. ఇక ఇప్పుడు సోమవారం రాత్రికి మహారాష్ట్రలోకి ప్రవేశిస్తుంది.
సంబంధిత కథనం