పుష్ప-2 ప్రీమియర్ షో విడుదల సమయంలో సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాట గాయపడి, చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యాడు. గతేడాది డిసెంబర్ 24న పుష్ప-2 చిత్రం ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందింది. ఆమె కుమారుడు శ్రీతేజ్ గాయపడి ఇన్నాళ్లు సికింద్రాబాద్ కిమ్స్ లో చికిత్స పొందిన విషయం తెలిసిందే.
బాలుడి ఆరోగ్యం కాస్త మెరుగుపడడంతో వైద్యులు ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశారు. ఆసుపత్రి నుంచి రిహాబిలిటేషన్ కేంద్రానికి తరలించాలని వైద్యులు సూచించారు. 15 రోజుల పాటు రిహాబిలిటేషన్ కేంద్రంలో ఉంచి ఫిజియోథెరఫీ నిర్వహించిన తర్వాత ఇంటికి తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. తొక్కిసలాట ఘటన నుంచి 4 నెలల 25 రోజుల పాటు శ్రీతేజ్ కు ఆస్పత్రిలో వైద్యం కొనసాగింది.
సుమారుగా ఐదు నెలల పాటు శ్రీతేజ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని బాలుడి తండ్రి భాస్కర్ తెలిపారు. 15 రోజుల క్రితం ఐసీయూ నుంచి రూముకు షిఫ్ట్ చేశారన్నారు. బాలుడి ఆరోగ్య పరిస్థితి కొంచెం నిలకడగా ఉందని, వైద్యులు రిహాబిలిటేషన్ కేంద్రానికి తరలించాలని సూచించారన్నారు. ఆ తర్వాత ఇంటికి తీసుకెళ్లొచ్చన్నారని తెలిపారన్నారు.
శ్రీతేజ్ ఇప్పుడిప్పుడే కళ్లు తెరిచి చూస్తున్నాడని అతడి తండ్రి భాస్కర్ తెలిపారు. ద్రవ రూపంలోనే ఆహారం పైపు ద్వారా పంపిస్తున్నామన్నారు. బ్రెయిన్ ఇంకా రికవరీ కాలేదని, తమను గుర్తు పట్టడంలేదన్నారు. ఆస్పత్రిలో ఎక్కువ రోజులు ఉన్నా ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంటుందని, రిహాబిలిటేషన్కు తీసుకెళ్తే కొంత మెరుగుపడొచ్చని వైద్యులు సూచించారన్నారు.
పుష్ప- 2 సినిమా యాజమాన్యం, సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ ప్రభుత్వం అండగా నిలిచాయని శ్రీతేజ్ తండ్రి భాస్కర్ అన్నారు. బాబు ఆస్పత్రిలో చేరిన రెండో రోజు నుంచే తమకు మద్దతుగా నిలిచారన్నారు. కిమ్స్ వైద్యులు, యాజమాన్యం డబ్బులేం అడగలేదన్నారు. డిశ్చార్జ్ సమయంలో ఎవరూ బలవంతం చేయలేదన్నారు. అమ్మ ఏదని శ్రీతేజ్ చెల్లెలు అడుగుతోందని, అమ్మ ఊరెళ్లిందని చెబుతున్నామన్నారు.
సంబంధిత కథనం