దేశ సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో భాగ్యనగర పోలీసులు అలర్ట్ అయ్యారు. హైదరాబాద్లో ఇప్పటికే భద్రత పెంచిన పోలీసులు.. అసాంఘిక శక్తులు, అక్రమ చొరబాటుదారుల కార్యకలాపాలపై ఫోకస్ పెట్టారు. ముఖ్యంగా బంగ్లాదేశ్, రోహింగ్యాలపై నిఘా పెట్టారు. వారు ఎక్కడెక్కడ ఉంటున్నారు..? ప్రస్తుతం ఏం చేస్తున్నారు..? అనే కోణంలో పోలీస్స్టేషన్ల వారీగా స్థానికుల నుంచి సమాచారం సేకరిస్తున్నారు.
హైదరాబాద్ నగరంలో జరిగే మిస్ వరల్డ్ పోటీలకు వివిధ దేశాలకు చెందిన ప్రతినిధులు హాజరవుతున్నారు. ఆపరేషన్ సింధూర్ జరుగుతున్న క్రమంలో.. అవాంఛనీయ ఘటనలకు అవకాశం లేకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ పోటీల్లో భాగంగా ఈ నెల 13న చార్మినార్ దగ్గర హెరిటేజ్ వాక్ నిర్వహించనన్నారు. ఇప్పటికే పోలీసులు ఈ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు.
అటు దేశంలోకి అక్రమంగా చొరబడిన బంగ్లాదేశీయులు నగరంలో తలదాచుకుంటున్నారని పోలీసులకు సమాచారం ఉంది. వందలాది మంది నకిలీ జనన ధ్రువపత్రాలు, ఆధార్ సంపాదించి నివాసం ఉంటున్నారు. ముఖ్యంగా నగర శివారు ప్రాంతాల్లో 5 వేల మందికిపైగా ఉంటున్నట్లు పోలీసులు గుర్తించారు. కొందరు అధికారికంగా దేశంలోకి వచ్చి వీసా గడువు ముగిసినా ఇక్కడే ఉన్నారు.
పాకిస్తాన్లోని ఉగ్రవాద శిబిరాలపై సైనిక దాడి జరిగింది. ఈ నేపథ్యంలో నెలకొన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని శాంతి భద్రతలపై కీలక సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు శాంతి భద్రతలపై ముందస్తుగా చర్చించారు. సీఎం రేవంత్ రెడ్డి సూచన మేరకు డిప్యూటీ సీఎం సచివాలయంలో అత్యవసర సమావేశం నిర్వహించనున్నారు.
ఈ సమావేశంలో రంగారెడ్డి జిల్లా ఇంఛార్జ్ మంత్రి దుదిళ్ల శ్రీధర్ బాబు, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, హైదరాబాద్ ఇంఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్, చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, డీజీపీ జితేందర్, స్పెషల్ చీఫ్ సెక్రటరీ సీఎంవో జయేష్ రంజన్, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్, సైబరాబాద్ కమిషనర్ అవినాష్ మహంతి, రాచకొండ కమిషనర్ సుధీర్ బాబులతో డిప్యూటీ సీఎం సమావేశం నిర్వహించనున్నారు.
సంబంధిత కథనం