కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు.. హైదరాబాద్ పోలీసులు ప్రస్తుతం అయ్యారు. నగరంలో ఉంటున్న పాకిస్తాన్ జాతీయుల వివరాలపై ఆరా తీస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం.. హైదరాబాద్లో 208 మంది పాకిస్తానీలు నివసిస్తున్నారు. వీరిలో.. 156 మంది దీర్ఘకాలిక వీసాలపై ఉన్నారు. 13 మంది స్వల్పకాలిక వీసాలపై ఉన్నారు. మిగిలిన 39 మంది వైద్య, వ్యాపార వీసాలపై నగరానికి వచ్చినట్టు తెలుస్తోంది.
అయితే.. తాజా పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వారిని వెనక్కి వెళ్లాలని ఆదేశించింది. వైద్యం కోసం వచ్చిన వారికి ఏప్రిల్ 29 వరకు అవకాశం ఇచ్చింది. మిగతా వారికి ఈనెల 27వ తేదీ వరకు ఛాన్స్ ఇచ్చింది. దీంతో స్పెషల్ బ్రాంచ్ పోలీసులు రంగంలోకి దిగారు. భాగ్యనగరానికి వచ్చిన పాకిస్తానీలు ఇన్నాళ్లు ఎక్కడ ఉన్నారు, ఎవరితో ఉన్నారు, ఇక్కడివారిని వివాహం చేసుకున్నవారు ఎవరు.. వారి ఫోన్ నంబర్లు అవేనా.. అనే వివరాలు సేకరిస్తున్నారు.
ఏప్రిల్ 27న ఇమ్మిగ్రేషన్ అధికారులతో సమన్వయం చేసుకుని.. పాకిస్తానీలందరూ నగరం విడిచి వెళ్లేలా చూస్తామని పోలీసు అధికారులు చెబుతున్నారు. అలా చేసిన తర్వాత.. గ్రౌండ్ లెవల్లో ఫిజికల్ ఐడెంటిఫీకేషన్ డ్రైవ్లు నిర్వహిస్తామని స్పష్టం చేస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు.. పాకిస్తానీలు అందరూ నిర్ణీత గడువు లోగా వెళ్లిపోవాలని అధికారులు చెబుతున్నారు.
హైదరాబాద్లో ఉగ్ర కదలికలపై నిఘా చాలా విస్తృతంగా ఉంది. అనేక భద్రతా, నిఘా సంస్థలు సమన్వయంతో పనిచేస్తూ నగరంలో ఉగ్రవాద కార్యకలాపాలను నిరోధించడానికి ప్రయత్నిస్తున్నాయి. హైదరాబాద్ పోలీసులు, తెలంగాణ రాష్ట్ర పోలీసులు ప్రత్యేక నిఘా విభాగాలను కలిగి ఉన్నారు. వీరు నిరంతరం సమాచారాన్ని సేకరిస్తూ, విశ్లేషిస్తూ ఉంటారు. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ), ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) వంటి కేంద్ర సంస్థలు కూడా హైదరాబాద్లో ఉగ్ర కదలికలపై నిఘా ఉంచడంలో సహాయం చేస్తాయి.
'దేశంలో అలజడులు సృష్టించేందుకు పన్నిన కుట్ర ఇది. ఈ సంఘటనను భారత ప్రభుత్వం తీవ్రంగా పరిగణించి కఠిన చర్యలు తీసుకోవాలి. రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు సంఘటితమయ్యాయి. కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ.. ప్రభుత్వం తీసుకునే చర్యలను సమర్థిస్తూ తీర్మానం చేసింది. హిందూ ముస్లింల మత సామరస్యాన్ని దెబ్బతియ్యడంతో పాటు కశ్మీర్ ఆర్ధిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసేందుకు జరిపిన ఈ దాడిని.. దేశ ప్రజలు ముక్త కంఠంతో ఖండిస్తున్నారు' అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు.
సంబంధిత కథనం