ఇంట్లో భారీగా పేలుడు పదార్థాలు.. జిలెటిన్ స్టిక్స్, డిటోనేటర్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు-police seize large quantity of explosives from a house in jangaon district ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  ఇంట్లో భారీగా పేలుడు పదార్థాలు.. జిలెటిన్ స్టిక్స్, డిటోనేటర్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు

ఇంట్లో భారీగా పేలుడు పదార్థాలు.. జిలెటిన్ స్టిక్స్, డిటోనేటర్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు

HT Telugu Desk HT Telugu

పేలుడు పదార్థాలను అక్రమంగా నిల్వ చేసిన ఇంటిపై వరంగల్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఆకస్మికంగా రైడ్స్ నిర్వహించారు. ప్రమాదకరమైన జిలెటిన్ స్టిక్స్, డిటోనేటర్లు గుట్టుగా తీసుకురావడం, ఇంట్లో దాచి పెట్టినట్టు గుర్తించి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు.

పేలుడు పధార్థాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు

వరంగల్ టాస్క్‌ఫోర్స్ ఏసీపీ మధుసూదన్ తెలిపిన ప్రకారం పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ మండలం నమిలిగొండ గ్రామానికి చెందిన బోసు బుచ్చమ్మ.. జిలెటిన్ స్టిక్స్, డిటోనేటర్లు, అమ్మోనియం నైట్రేట్ వంటి పేలుడు పదార్థాలను తీసుకొచ్చి తన ఇంట్లో స్టోర్ చేసింది. పెద్ద మొత్తంలో బ్లాస్టింగ్ కు సంబంధించిన సామగ్రి నిల్వ ఉన్నట్లు వరంగల్ టాస్క్ ఫోర్స్ పోలీసులకు సమాచారం అందింది. దీంతో శనివారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. టాస్క్ ఫోర్స్ సీఐ కె.శ్రీధర్ తన సిబ్బందితో సోదాలు చేపట్టగా.. బోసు బుచ్చమ్మ ఇంట్లో పేలుడు పదార్థాలు లభ్యమయ్యాయి.

ఆటోలో బ్లాస్టింగ్ సామగ్రి..

పోలీసులు బుచ్చమ్మ ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్న క్రమంలోనే హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం పెద్ద పెండ్యాల గ్రామానికి చెందిన ఒర్సు రమేశ్ అనే యువకుడు ఆటోలో ఆమె ఇంటికి వచ్చాడు. ఒర్సు రమేశ్ కదలికలు అనుమానాస్పదంగా ఉండటంతో.. పోలీసులు ఆటోను కూడా తనిఖీ చేశారు. ఆటోలో కూడా పేలుడు పదార్థాలు లభ్యం కావడంతో షాక్ అయ్యారు. ఈ మేరకు వారి నుంచి పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకుని, బోసు బుచ్చమ్మతో పాటు ఒర్సు రమేశ్ ను అదుపులోకి తీసుకున్నారు.

భారీగా పేలుడు పదార్థాలు..

పోలీసులు స్వాధీనం చేసుకున్న వాటిలో 10 జిలెటిన్ స్టిక్స్, 50 డిటోనేటర్లు, 55 కిలోల అమ్మోనియం నైట్రేట్, పేలుడుకు ఉపయోగించే బత్తులు, ఫ్యూజుల బెండలు రెండు ఉన్నాయి. ఇంత పెద్ద మొత్తంలో పేలుడు పదార్థాలు స్టోర్ చేసి ఉండటం, ఏదైన ఘటనా జరిగితే భారీగా ప్రాణనష్టం జరిగే అవకాశం ఉండటంతో పోలీసులు వాటిని సీజ్ చేశారు. పేలుడు పదార్థాలతో పాటు ఒర్సు రమేశ్ కు చెందిన ఆటో, ఒక స్మార్ట్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణ నిమిత్తం బోసు బుచ్చమ్మతో పాటు ఒర్సు రమేశ్, స్వాధీనం చేసుకున్న పేలుడు పదార్థాలను స్టేషన్ ఘనపూర్ పోలీసులకు అప్పగించారు.

దర్యాప్తు చేపట్టిన పోలీసులు..

బోసు బుచ్చమ్మతో పాటు ఒర్సు రమేశ్ మరికొంతమంది కలిసి జిలెటిన్ స్టిక్స్, డిటోనేటర్లు, అమ్మోనియం నైట్రేట్ తదితర పేలుడు సామగ్రితో బావుల్లో పూడికతీత పనులు చేపడుతున్నట్లుగా తెలిసింది. ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా పేలుడు పదార్థాలు నిల్వ ఉంచడంతో అసలు వీరికి బ్లాస్టింగ్ సామగ్రి ఎక్కడి నుంచి వస్తుందనే కోణంలో పోలీసులు దర్యాప్తు జరుపుతున్నట్లు సమాచారం. ఇళ్లలో అక్రమంగా పేలుడు పదార్థాలు నిల్వ చేసి, జనాల ప్రాణాలతో చెలగాటమాడితే.. చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని వరంగల్ పోలీసులు హెచ్చరిస్తున్నారు.

(రిపోర్టింగ్: హిందుస్తాన్ టైమ్స్ తెలుగు, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి)