MMTS Accused: ఎంఎంటీఎస్‌లో యువతిపై దాడి చేసిన నిందితుడి గుర్తింపు, పోలీసుల అదుపులో నిందితుడు-police identified the accused who attacked woman in mmts accused is in police custody ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Mmts Accused: ఎంఎంటీఎస్‌లో యువతిపై దాడి చేసిన నిందితుడి గుర్తింపు, పోలీసుల అదుపులో నిందితుడు

MMTS Accused: ఎంఎంటీఎస్‌లో యువతిపై దాడి చేసిన నిందితుడి గుర్తింపు, పోలీసుల అదుపులో నిందితుడు

Sarath Chandra.B HT Telugu

MMTS Accused: మేడ్చల్ ఎంఎంటీఎస్‌ రైల్లో ఏపీకి చెందిన యువతిపై లైంగిక దాడికి ప్రయత్నించిన వ్యక్తిని పోలీసులు గుర్తించారు. దాడికి యత్నించిన వ్యక్తి ఫోటోలను బాధితురాలు గుర్తించడంతో నిందితుడు మహేష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఎంఎంటీఎస్‌ రైల్లో యువతిపై లైంగిక దాడికి ప్రయత్నించిన నిందితుడు మహేష్‌

MMTS Accused: హైదరాబాద్‌ ఎంఎంటీఎస్‌ రైల్లో యువతిపై అత్యాచారానికి ప్రయత్నించిన వ్యక్తిని పోలీసులు గుర్తించార. అత్యాచాారానికి ప్రయత్నించిన వ్యక్తి ఫోటోలను బాధితురాలు గుర్తించడంతో అతడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు హైదరాబాద్‌కు చెందిన మహేష్‌గా గుర్తించారు. నిందితుడిని ఏడాది క్రితం భార్య వదిలేసినట్టు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.

హైదరాబాద్‌‌లో శనివారం రాత్రి ఎంఎంటీఎస్‌ రైల్లో యువతిపై అత్యాచార యత్నం ఘటన సంచలనం సృష్టించింది. సికింద్రాబాద్‌లో మొబైల్ రిపేర్ చేయించుకుని మేడ్చల్‌ వెళ్లే ఎంఎంటీఎస్‌ రైలు ఎక్కిన యువతిపై గుర్తు తెలియని వ్యక్తి లైంగిక దాడికి ప్రయత్నించాడు. దీంతో ఆందోళనకు గురైన యువతి కదులుతున్న రైలు నుంచి దూకేసింది. ఈ ఘటనలో ఆమెకు తీవ్రగాయాలయ్యాయి. అనంతరం స్థానికుల సమాచారంతో బాధితురాలిని గాంధీ ఆస్పత్రికి అక్కడ నుంచి యశోదా ఆస్పత్రికి తరలించారు. యువతి కాళ్లకు తీవ్ర గాయాలు కావడంతో పాటు పళ్లు విరిగిపోయాయి.

ఎంఎంటీఎస్‌ రైల్లో మహిళల కోచ్‌లో యువతిపై దాడికి ప్రయత్నించడం తీవ్ర సంచలనం సృష్టించింది. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో నిందితుడి కోసం ప్రత్యేక దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేశారు. బాధితురాలికి అనుమానితుల ఫోటోలను చూపినా గుర్తించలేకపోయింది. ఈ క్రమంలో సోమవారం లైంగిక దాడికి ప్రయత్నించిన వ్యక్తిని బాధితురాలు గుర్తించింది. హైదరాబాద్‌కు చెందిన మహేష్‌గా గుర్తించారు.

బాధితురాలు ఇచ్చిన వివరాల ఆధారంగా నిందితుడికి 25 ఏళ్ల వయసు ఉంటుందని గుర్తించారు. తొలుత అనుమానితుల ఫోటోలను బాధితురాలు గుర్తించ లేకపోయింది. తర్వాత సికింద్రాబాద్ నుంచి మేడ్చల్ వరకూ 28 కిలోమీటర్ల పరిధిలో ఉన్న అన్ని రైల్వే స్టేషన్లలో అన్ని సీసీ కెమెరాలను పరిశీలించి అనుమానితుల ఫోటోలు సేకరించారు. చివరకు మహేష్‌ను బాధితురాలు గుర్తించింది.

ఆంధ‌్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాకు చెందిన యువతి మేడ్చల్‌లో ఉన్న ప్రైవేట్‌ సంస్థలో పని చేస్తోంది. శనివారం సాయంత్రం ఎంఎంటీఎస్‌ రైల్లో సికింద్రాబాద్‌ వచ్చింది. రాత్రి 7.15 గంటలకు సికింద్రాబాద్‌ స్టేషన్‌లో తెల్లాపూర్-మేడ్చల్ ఎంఎంటీఎస్ రైలు లోని మహిళల బోగీలో ఎక్కింది. రాత్రి 8.15 గంటల సమయంలో అల్వాల్ స్టేషన్‌లో బోగీలో ఉన్న ఇద్దరు మహిళలు దిగి పోవడంతో యువతి మాత్రమే ఉంది.

ఆ సమయంలో బోగీలో ఉన్న మహేష్‌ యువతి దగ్గరకెళ్లి లైంగిక వాంఛ తీర్చాలంటూ ఆమెను తాకుతూ పట్టుకోవడానికి ప్రయత్నించాడు. భయపడిన యువతి కొంపల్లి సమీపంలో గుండ్ల పోచంపల్లి స్టేషన్‌ సమీపంలో రైలు నుంచి దూకింది. తీవ్రగాయాలతో పట్టాల పక్కన పడి ఉన్న యువతిని స్థానికులు గుర్తించి 108లో గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం యశోదా ఆస్పత్రికి తరలించారు.

యశోద ఆసుపత్రి లో చికిత్స పొందుతున్న బాధితురాలిని డీఆర్ఎం లోకేష్ విష్ణోయ్, సీఎంఎస్ డాక్టర్ సీహెచ్ పద్మ, డీసీఎం డాక్టర్ అనిరుధ్ పవర్ రైల్వే ఉన్నతాధికారులు పరామర్శించారు. నిందితుడు మహేష్‌ను పోలీసులు విచారిస్తున్నారు.

Sarath Chandra.B

TwittereMail
శరత్‌ చంద్ర హిందుస్తాన్ టైమ్స్‌ తెలుగు న్యూస్‌ ఎడిటర్‌గా ఉన్నారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో వివిధ హోదాల్లో 2001 నుంచి పని చేస్తున్నారు. జర్నలిజంలో నాగార్జున యూనివర్శిటీ నుంచి పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. గతంలొ ఈనాడు, ఎన్‌టీవీ, టీవీ9, హెచ్‌ఎంటీవీ, టీవీ5లలో వివిధ హోదాలలో విజయవాడ, హైదరాబాద్‌, ఢిల్లీలలో పనిచేశారు. 2022లో హెచ్‌టీ తెలుగులో చేరారు. ఇక్కడ ఏపీ తెలంగాణకు సంబంధించిన వర్తమాన అంశాలు, బ్యూరోక్రసీ, రాజకీయ వార్తలు, క్రైమ్ వార్తలను అందిస్తారు.

సంబంధిత కథనం