'తెలంగాణకు వచ్చిన పాక్ పౌరులు వెళ్లిపోవాలి' - డీజీపీ కీలక ఆదేశాలు-police have announced that pakisthan citizens staying in telangana must leave by april 27 ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  'తెలంగాణకు వచ్చిన పాక్ పౌరులు వెళ్లిపోవాలి' - డీజీపీ కీలక ఆదేశాలు

'తెలంగాణకు వచ్చిన పాక్ పౌరులు వెళ్లిపోవాలి' - డీజీపీ కీలక ఆదేశాలు

కేంద్రం ఆదేశాలతో పాకిస్థాన్ పౌరులకు తెలంగాణ పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. తెలంగాణకు వచ్చిన వారంతా.. వెంటనే వెళ్లిపోవాలని స్పష్టం చేశారు. ఆదేశాలు ఉల్లంఘిస్తే… న్యాయపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

తెలంగాణ పోలీసుల ప్రకటన

కశ్మీర్ లో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్రం ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో తెలంగాణ పోలీసులు అలర్ట్ అయ్యారు. తెలంగాణకు వచ్చిన పాకిస్తాన్ దేశ పౌరులు… ఏప్రిల్ 27లోపు వెళ్లిపోవాలని డీజీపీ జితేందర్ సూచించారు.

మెడికల్ వీసాపై వచ్చిన వారికి ఏప్రిల్ 29 వరకు గడువు ఉంటుందని డీజీపీ తెలిపారు. ఏప్రిల్ 30 వరకు అటారి వాఘ బార్డర్ తెరిచి ఉంటుందని… ఈలోపు వెళ్లిపోవాలని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘించి ఇక్కడే ఉంటే… న్యాయపరమైన చర్యలు ఉంటాయన్నారు.

నగరంలో ఉంటున్న వారిపై నిఘా…!

కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు.. హైదరాబాద్ పోలీసులు నగరంలో ఉంటున్న పాకిస్తాన్ జాతీయుల వివరాలపై ఆరా తీస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం.. హైదరాబాద్‌లో 208 మంది పాకిస్తానీలు నివసిస్తున్నారు. వీరిలో.. 156 మంది దీర్ఘకాలిక వీసాలపై ఉన్నారు. 13 మంది స్వల్పకాలిక వీసాలపై ఉన్నారు. మిగిలిన 39 మంది వైద్య, వ్యాపార వీసాలపై నగరానికి వచ్చినట్టు తెలుస్తోంది.

కశ్మీర్ ఉగ్రదాడి ఘటన నేపథ్యంలో…. హైదరాబాద్‌లో ఉగ్ర కదలికలపై నిఘా చాలా విస్తృతంగా ఉంది. అనేక భద్రతా, నిఘా సంస్థలు సమన్వయంతో పనిచేస్తూ నగరంలో ఉగ్రవాద కార్యకలాపాలను నిరోధించడానికి ప్రయత్నిస్తున్నాయి. హైదరాబాద్ పోలీసులు, తెలంగాణ రాష్ట్ర పోలీసులు ప్రత్యేక నిఘా విభాగాలను కలిగి ఉన్నారు. వీరు నిరంతరం సమాచారాన్ని సేకరిస్తూ, విశ్లేషిస్తూ ఉంటారు. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ), ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) వంటి కేంద్ర సంస్థలు కూడా హైదరాబాద్‌లో ఉగ్ర కదలికలపై నిఘా ఉంచడంలో సహాయం చేస్తాయి.

పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతిస్పందనగా భారత ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసింది. అట్టారీ వద్ద ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్టును మూసివేయడం, మొత్తం హైకమిషన్ల సంఖ్యను 55 నుంచి 30కి తగ్గించడం వంటి కఠిన నిర్ణయాలను తీసుకుంది. జమ్ముకశ్మీర్ లోని పహల్గామ్ లో మంగళవారం పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో 26 మంది మరణించారు. ఈ దాడిని ఖండిస్తూ ఈ నిర్ణయాలను తీసుకుంది.

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం