హైదరాబాద్లో ఎంఎంటీఎస్ రైల్లో యువతిపై అత్యాచారయత్నం కేసులో ఊహించని ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. యువతి పోలీసులను తప్పుదోవ పట్టించింది. ఈ విషయాన్ని స్వయంగా రైల్వే ఎస్పీ చందనా దీప్తి వెల్లడించారు. సదరు యువతి సెల్ఫోన్తో ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేస్తుండగా.. ప్రమాదవశాత్తు జారిపడినట్లు ఎస్పీ వివరించారు.
ఈ ఘటనపై పోలీసులకు కట్టుకథ చెప్పి.. తనపై అత్యాచారం జరిగినట్లు ఆ యువతి పోలీసులను నమ్మించినట్లు చందనా దీప్తి నిర్ధారించారు. దర్యాప్తులో భాగంగా సుమారు 300కుపైగా సీసీ కెమెరాలను రైల్వే పోలీసులు పరిశీలించారు. దాదాపు 120 మంది అనుమానితులను ప్రశ్నించారు. ఆ తర్వాత యువతిపై అత్యాచారం జరగలేదని తేల్చారు. న్యాయపరమైన అంశాలను పరిశీలించి.. కేసును మూసివేసే యోచనలో రైల్వే పోలీసులు ఉన్నట్టు తెలుస్తోంది.
మేడ్చల్ జిల్లాలోని ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తున్న అనంతపురం జిల్లాకు చెందిన యువతిపై.. ఓ యువకుడు ఎంఎంటీఎస్ రైల్లో అత్యాచారానికి పాల్పడినట్లు వార్తలు వచ్చాయి. కొంపల్లి సమీప ప్రాంతంలోని రైలు బ్రిడ్జి వద్ద కిందపడి గాయపడిన ఆమెను తొలుత గాంధీ ఆసుపత్రికి, ఆ తర్వాత ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం ఆమె పూర్తిగా కోలుకున్నట్లు తెలుస్తోంది.
ఈ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దీనిపై ప్రభుత్వం సీరియస్ అయ్యింది. రైల్వే పోలీసులు ఈ ఘటనను తీవ్రంగా పరిగణించి ముమ్మరంగా దర్యాప్తు చేశారు. ఎంతకూ యువతి చెప్పిన విషయాలకు సరైన ఆధారాలు లభించలేదు. దీంతో పోలీసులకు యువతిపై అనుమానం వచ్చింది. ఆమెను విచారించగా.. అసలు విషయం ఒప్పుకుంది. ఆ యువతి తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
సంబంధిత కథనం