Sai Pallavai : సాయి పల్లవిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు
సాయి పల్లవిపై సుల్తాన్బజార్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు అందింది. ఓ ఇంటర్వ్యూలో ఆమె చేసిన వ్యాఖ్యలపై పోలీసులకు కంప్లైంట్ వెళ్లింది.
ప్రముఖ సినీనటి సాయి పల్లవిపై హైదరాబాద్ సుల్తాన్బజార్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కశ్మీర్ ఫైల్స్ సినిమాతో పాటు గోరక్షకులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదు వెళ్లింది. భజరంగ్దళ్ నాయకులు ఈ కంప్లైంట్ ఇచ్చారు. న్యాయసలహా తీసుకొని సాయిపల్లవిపై చర్యలు తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు.
ట్రెండింగ్ వార్తలు
విరాటపర్వం ప్రమోషన్స్ లో భాగంగా.. సాయి పల్లవి ఓ ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చింది. అందులో ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వివాదస్పదమయ్యాయి. కశ్మీర్లో కశ్మీరీ పండిట్ల హత్యకు, జై శ్రీరామ్ అనలేదనో లేక గోరక్ష పేరుతోనో చేసే హింసకు తేడా లేదని ఆమె వ్యాఖ్యానించింది. రెండూ ఒకటే అని ఇటీవలి ఒక ఇంటర్వ్యూలో చెప్పింది. దీంతో.. ఆమె మాటలు వివాదానికి దారి తీశాయి. ఆమె పేరు మీద నెటిజన్లు సోషల్ మీడియాలో తెగ పోస్టులు పెట్టేస్తున్నారు.
వైరల్ అయిన ఈ వ్యాఖ్యలపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. అనవసర వ్యాఖ్యలతో వివాదాలను కొనితెచ్చుకుంటోందని పలువురు అంటున్నారు. అవగాహన లేకుండా మాట్లాడకూడదని మరి కొందరు చెబుతున్నారు. చిన్న వయస్సులోనే పరిణతితో వ్యాఖ్యలు చేసిందని కొంతమందేమో ప్రశంసిస్తున్నారు.