Posters in Munugodu: కాంట్రాక్ట్ పే పోస్టర్లతో ఎలాంటి సంబంధం లేదన్న ఫోన్ పే
contract pe posters in munugodu: మునుగోడులో ఫోన్ పే తరహాలో వెలిసిన కాంట్రాక్ట్ పే పోస్టర్లు హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ పోస్టర్ల అంశంపై ఫోన్ పే( Phone Pay) సంస్థ స్పందిస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది.
phone pay on contract pe posters in munugodu: మునుగోడులో రాజకీయ పార్టీల ప్రచారం తారాస్థాయికి చేరింది. ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్ధులు నామినేషన్లు వేసేశారు. అయితే బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి నామినేషన్ వేసిన కొద్దిగంటల్లోనే పోస్టర్లు వెలిసిన సంగతి తెలిసిందే. అయితే ఇందులో ఫోన్ పే తరహాలోనే కాంట్రాక్ట్ పే పేరుతో ఈ పోస్టర్లు దర్శనమిచ్చాయి. దాదాపు నియోజవర్గవ్యాప్తంగా గుర్తు తెలియని వ్యక్తులు అంటించారు. ఈ వ్యవహరంపై ప్రధాన పార్టీల మధ్య పెద్ద మాటల యుద్ధమే నడిచింది. అయితే తాజాగా ఈ పోస్టర్ల పై ఫోన్ పే సంస్థ స్పందించింది.
ట్రెండింగ్ వార్తలు
మాకు సంబంధం లేదు : ఫోన్ పే
కాంట్రాక్ట్ పే పేరుతో పలు ప్రసార మాధ్యమాల్లో వస్తున్న వార్తలకు తమకు ఎలాంటి సంబంధం లేదని ఫోన్ పే (Phone Pay) స్పష్టం చేసింది. తమకు ఏ కంపెనీతో గానీ, పార్టీ, అభ్యర్థి, రాజకీయ పార్టీలతోనూ సంబంధంలేదని పేర్కొంది. కాంట్రాక్ట్ పే(contract pe)ను రూపొందించటంలో ఫోన్ పే లోగోను ఉపయోగించటం తప్పుదారి పట్టించేలా ఉందని తెలిపింది. ఇది ఫోన్ పే మేథోసంపత్తి హక్కులను ఉల్లంఘించడమే అవుతుందని అభిప్రాయపడింది. దీనికి సంబంధించిన భవిష్యత్తులో తగిన చట్టపరమైన చర్యలపై తీసుకునే హక్కు తమకు ఉంటుందని ఫోన్ పే వెల్లడించింది.
రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడటం వెనుక కోట్ల రుపాయల కాంట్రాక్టులు ప్రభావం చూపాయని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో కర్ణాటకలో సిఎం బొమ్మైకు వ్యతిరేకంగా జరిగిన ఫోన్ పే పోస్టర్ల తరహాలోనే కోమటిరెడ్డికి వ్యతిరేకంగా పోస్టర్లు వెలిశాయి. “రూ.18వేల కోట్ల కాంట్రాక్ట్ కోమటిరెడ్డికి కేటాయించడం జరిగింది” అంటూ పోస్టర్లలో పేర్కొన్నారు. ట్రాన్సక్షన్ ఐడి పేరుతో బీజేపీ 18వేలకోట్లు అంటూ తెలిపారు. ఆ పోస్టర్లో రూ.500కోట్ల బోనస్ అని రివార్డ్ గా చూపించారు. Phone Pay తరహాలో Contract Pe, 18000 కోట్లు Transaction కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కు కేటాయించడం జరిగిందని వేల సంఖ్యలో షాపులకు, గోడలకు రాత్రికి రాత్రి అంటించారు.
ఈ పోస్టర్ల పని టీఆర్ఎస్ వారిదే అంటూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు. నేరుగా ఎదుర్కొనే ధైర్యం లేక ఇలాంటి చర్యలకు దిగుతోందని విమర్శించారు.