బాలసదన్‌లే వారికి అమ్మా, నాన్న.. కన్నీరు పెట్టిస్తున్న అనాథ విద్యార్థుల అమాయకపు చూపులు-orphaned students are going to balasadan during the summer vacation ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  బాలసదన్‌లే వారికి అమ్మా, నాన్న.. కన్నీరు పెట్టిస్తున్న అనాథ విద్యార్థుల అమాయకపు చూపులు

బాలసదన్‌లే వారికి అమ్మా, నాన్న.. కన్నీరు పెట్టిస్తున్న అనాథ విద్యార్థుల అమాయకపు చూపులు

సాధారణంగా సెలవులు వస్తున్నాయంటే.. విద్యార్థులు ఎగిరి గంతేస్తారు. ఊర్లకు వెళ్లొచ్చు, స్నేహితులతో ఆడుకోవచ్చు, సరదాగా గడపొచ్చు అని సంబరపడతారు. కానీ.. ఆ విద్యార్థులు మాత్రం సెలవులు వస్తున్నాయంటే.. దిగాలుగా చూస్తుంటారు. కన్నీళ్లు పెట్టుకుంటారు. వారే వివిధ హాస్టళ్లో ఉండి చదువుకునే అనాథ విద్యార్థులు.

బాల సదన్‌లకు చిన్నారులు (unsplash)

ప్రస్తుతం రాష్ట్రంలోని స్కూళ్లు, కాలేజీలకు వేసవి సెలవులు వచ్చాయి. అందరు విద్యార్థులు ఆనందంగా ఇళ్లకు వెళ్తున్నారు. కానీ అమ్మా నాన్నలు, ఆదరించే వారు లేని విద్యార్థుల పరిస్థితి వేరు. గురుకులాలు, కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాల్లో చదువుకుంటూ, హాస్టళ్లలో ఉండే వారికి వేసవి సెలవులు సమీపిస్తున్నాయంటే దిగులు మొదలవుతుంది. పాఠశాలలకు ప్రభుత్వం వేసవి సెలవులు ప్రకటించడంతో.. ఇలాంటి చిన్నారులంతా బాలసదన్‌లకు వెళ్తున్నారు.

దీనంగా చూస్తుంటే..

హాస్టళ్లలో ఉన్న ఇతర పిల్లలను వారి అమ్మానాన్నలు వచ్చి తీసుకెళుతుంటే దీనంగా చూడటం ఈ అనాథ పిల్లల వంతయ్యింది. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లోని గురుకులాలు, కేజీబీవీల్లో ఇలాంటి దృశ్యాలు కన్పించాయి. తమ కోసం ఎవరూ లేరనే ఆవేదన కొంచెం ఎదిగిన పిల్లల్లో కన్పించింది. అప్పటివరకు స్కూల్లో చదువుకుంటూ, హాస్టళ్లలో తోటి విద్యార్థులతో సరదాగా గడిపిన వీరంతా.. విషాదం నిండిన మొహాలు వేయడం ఇతర పిల్లల తలిదండ్రులను కదిలించింది. ఏమీ చేయలేని నిస్సహాయ పరిస్థితి.. వారిని ఆవేదనకు గురి చేసింది. తమ పిల్లలు వారికి ఉత్సాహంగా బైబై చెబుతుంటే.. వారి గుండెలు బరువెక్కాయి.

విద్యార్థుల కంటతడి..

ఈ సందర్భంగా కొందరు అనాథ పిల్లలు కంటతడి పెట్టుకున్నారు. దీంతో తోటి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, అక్కడి సిబ్బంది, బాలసదన్‌ల నిర్వాహకులు కూడా కంటతడి పెట్టారు. నిర్మల్‌ జిల్లాలో బైంసా మండల కేంద్రంలో వేర్వేరు స్కూళ్లలో చదువుతున్న ముగ్గురు పిల్లలకు సెలవులు వచ్చినా.. అమ్మా నాన్నలు లేక, తీసుకెళ్లేవారు లేక.. సెలవుల్లోనూ వేర్వేరు ప్రాంతాల్లో ఉండి కలుసుకోలేని పరిస్థితి.. అందర్నీ కదిలించింది. తల్లిదండ్రులు లేని కొందరు విద్యార్థులను వారి బంధువులు తీసుకెళ్లినా.. చాలామంది బాలసదన్‌లకు వెళ్లారు.

బాల సదన్‌లు ఎలా పనిచేస్తాయి..

తెలంగాణలోని బాలసదన్‌లు అనాథలు, నిరాశ్రయులైన పిల్లలకు ఆశ్రయం, సంరక్షణ కల్పించే గృహాలు. వీటిని ప్రభుత్వం, ఇతర సంస్థలు నిర్వహిస్తాయి. బాలసదన్‌లు పిల్లలకు సురక్షితమైన, ఆరోగ్యకరమైన నివాస స్థలాన్ని అందిస్తాయి. వారికి ఆహారం, దుస్తులు, నిద్రించడానికి స్థలం కల్పిస్తారు. పిల్లల శారీరక, మానసిక, భావోద్వేగ అవసరాలను తీర్చడానికి సిబ్బంది ఉంటారు. వారికి ప్రేమ, ఆప్యాయత, భద్రతా భావాన్ని అందిస్తారు.

ఆరోగ్య సంరక్షణ..

బాలసదన్‌లలోని పిల్లలకు పాఠశాల విద్యను అందించడానికి ఏర్పాట్లు చేస్తారు. కొన్ని సంస్థలు తమ సొంత పాఠశాలలను కలిగి ఉండవచ్చు లేదా సమీపంలోని పాఠశాలల్లో పిల్లలను చేర్పిస్తాయి. వారి చదువుకు అవసరమైన పుస్తకాలు, ఇతర సామగ్రిని అందిస్తారు. పిల్లలకు అవసరమైనప్పుడు వైద్య పరీక్షలు, చికిత్సలు అందించడానికి ఏర్పాట్లు చేస్తారు. ఆరోగ్య సంరక్షణ, పరిశుభ్రత గురించి వారికి అవగాహన కల్పిస్తారు.

స్వతంత్రంగా ఎదగడానికి..

పిల్లల ఆసక్తులు, సామర్థ్యాలను గుర్తించి, వారికి తగిన నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు, వృత్తి శిక్షణ ఇవ్వడానికి ప్రయత్నిస్తారు. ఇది వారు స్వతంత్రంగా జీవించడానికి సహాయపడుతుంది. పిల్లలు తమ బాధలను, సమస్యలను పంచుకోవడానికి వారికి మానసిక నిపుణులు, సంరక్షకుల మద్దతు ఉంటుంది. వారికి సామాజికంగా అభివృద్ధి చెందడానికి, సమాజంలో కలిసిపోవడానికి సహాయం చేస్తారు.

దత్తత ప్రక్రియ ద్వారా..

వీలైనంత వరకు పిల్లలను వారి కుటుంబాలతో తిరిగి కలపడానికి ప్రయత్నిస్తారు. ఇందుకోసం కుటుంబాలను గుర్తించడం, వారికి అవసరమైన సహాయం అందించడం, కౌన్సెలింగ్ ఇవ్వడం వంటి చర్యలు తీసుకుంటారు. దత్తత తీసుకోవడానికి అర్హులైన పిల్లలను దత్తత ప్రక్రియ ద్వారా కొత్త కుటుంబాలలో స్థిరపడేలా చూస్తారు. ఒకవేళ ఇవి లేకపోతే.. రాష్ట్రంలో ఎంతోమంది పిల్లలు రోడ్లపైనే నివసించే పరిస్థితి వచ్చేదనే అభిప్రాయాలు ఉన్నాయి.

సంబంధిత కథనం