మిస్ వరల్డ్ పోటీల ప్రారంభోత్సవానికి సమయం దగ్గర పడింది. మే 10వ తేదీన సాయంత్రం గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో మిస్ వరల్డ్ పోటీలు అధికారికంగా మొదలవుతాయి. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం విసృత స్థాయిలో అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఎయిర్ పోర్టుతో సహా హైదరాబాద్ నగరాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేసేందుకు ప్రభుత్వ యంత్రాంగం నిమగ్నమైంది. ఈ ఏర్పాట్లన్నీ దాదాపు తుదిదశకు చేరుకున్నాయి.
ప్రపంచం నలుమూలల నుంచి ఇప్పటికే 95 దేశాలకు చెందిన మిస్ వరల్డ్ పోటీ దారులు హైదరాబాద్ చేరుకున్నారు. మరికొంత మంది ప్రతినిధులు వివిధ దేశాల నుంచి రానున్న రెండు రోజుల్లో వస్తారని మిస్ వరల్డ్ నిర్వాహకులు తెలిపారు. వీరికి తోడు 28 మంది మిస్ వరల్డ్ సంస్థ నుంచి నిర్వహణ ప్రతినిధులు, 17 మంది సహాయకులు వచ్చారు. గత వారం రోజులుగా వస్తున్నఅతిధులు అందరినీ తెలంగాణ సంసృతీ, సాంప్రదాయాలకు అనుగుణంగా స్వాగతం పలుకుతూ వారికి బస ఏర్పాట్లను టూరిజం శాఖ కల్పించింది. విదేశీ ప్రతినిధులు బస చేసిన ట్రిడెంట్ హోటల్ దగ్గర పోలీసులు భారీ భద్రత కల్పించారు.
ఇవాళ, రేపు ఈ కంటెస్టంట్లు రిహార్సల్స్ కార్యక్రమాల్లో పాల్గొంటారు. పోటీదారులను వివిధ గ్రూపులుగా ఏర్పాటు చేసి వారు పాల్గొనబోయే కార్యక్రమాల వివరాలను సిద్ధం చేస్తున్నారు.
వివిధ దేశాలకు చెందిన కంటెస్టంట్లు విభిన్న కార్యక్రమాలతో పాటు తెలంగాణలో ఉన్న చారిత్రక, పర్యాటక ప్రదేశాల సందర్శనలో పాల్గొంటారు. అలాగే బ్రెస్ట్ క్యాన్సర్ నివారణ, మహిళలకు అవగాహన కల్పించే కార్యక్రమాలను కూడా మిస్ వరల్డ్ కంటెస్ట్ లో భాగంగా చేపడుతున్నారు.
'తెలంగాణ జరూర్ ఆనా' (తప్పకుండా తెలంగాణ రండి, పర్యటించండి) అనే నినాదాన్ని విసృతంగా ప్రపంచవ్యాప్తం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఫలితంగా పర్యాటక రంగం పెరగటం, పెట్టుబడుల సాధన, ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని భావిస్తోంది. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ ఈవెంట్ గురించి రాష్ట్ర ప్రభుత్వం దేశ విదేశాలతో పాటు అన్ని రాష్ట్రాల ప్రధాన విమానాశ్రయాల్లో ప్రచారం కల్పిస్తోంది.
మే 10వ తేదీ నుంచి ప్రారంభమయ్యే ఈ పోటీలు మే 31వ తేదీతో ముగుస్తాయి. సుమారు 120 దేశాల నుంచి కంటెస్టెంట్ లు… ఈ మెగా ఈవెంట్ లో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ సంస్కృతి, చరిత్ర, పర్యాటక ఆకర్షణలు, మెడికల్, సేఫ్టీ టూరిజం, తెలంగాణ గ్రోత్ స్టోరీ , ఇతర ప్రత్యేకతలు ప్రపంచానికి పరిచయం చేయడానికి ప్రత్యేక థీమ్స్ , టూరిస్ట్ సర్క్యూట్లు రూపొందించారు.
హైదరాబాద్ మాత్రమే కాకుండా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కార్యక్రమాలను చేపట్టనున్నారు. అయితే ఈ కార్యక్రమాలను సామాన్యులు వీక్షించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. పరిమిత సంఖ్యలో అవకాశం కల్పించేందుకు వీలుగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈ పోటీలను వీక్షించాలనుకునే వారు ముందుగు తెలంగాణ టూరిజం వెబ్ సైట్ లోకి వెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. వీరిలో ఎంపికైన వారికి 5 కేంద్రాల్లో వేయి మందికి చొప్పున మొత్తం ఐదువేల మందికి మిస్ వరల్డ్ పోటీలను వీక్షించే అవకాశం కల్పించనున్నారు. ఆ దిశగా అధికారులు కసరత్తు చేస్తున్నారు.
ఆధార్ కార్డులో ఉన్న విధంగా పేరు, మొబైల్ నెంబర్, వయసు, వృత్తితో పాటు మరికొన్ని వివరాలను నమోదు చేయాలి. ఆ తర్వాత ఐదు ప్రశ్నలు ఉంటాయి. వీటికి సమాధానాలు ఇవ్వాలి. చివరల్లో సబ్మిట్ చేసి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ పూర్తి చేసుకోవాలి. అయితే రిజిస్ట్రేషన్ చేసుకునే వారి వయసు తప్పకుండా 18 ఏళ్లు పూర్తై ఉండాలి. ఎంపికైన వారికి అధికారుల నుంచి సమాచారం అందుతుంది.
సంబంధిత కథనం