Show Cause Notices to Komatireddy Venkata Reddy: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి... తెలంగాణ కాంగ్రెస్ లో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. మునుగోడు ఉప ఎన్నిక నుంచి ఆయన చేస్తున్న కామెంట్స్.. చర్చనీయాంశంగా మారాయి. అభ్యర్థి ఎంపిక తర్వాత కూడా ప్రచారానికి వస్తానంటూ చెప్పిన ఆయన.. చివర్లో ట్విస్ట్ ఇచ్చారు. ప్రచారానికి దూరంగా ఉంటూ విదేశాలకు వెళ్లారు. ఇదే సమయంలో ఆయన మాట్లాడిన ఆడియోలతో పాటు వీడియో కూడా వైరల్ అయింది. ఈ పరిణామం తెలంగాణ కాంగ్రెస్ ను ఉక్కిరిబిక్కిరి చేసిందనే చెప్పొచ్చు. ఈ క్రమంలో పార్టీ అధినాయకత్వం ఆయనకు షోకాజ్ నోటీసులు ఇచ్చింది. మునుగోడులో కాంగ్రెస్ పార్టీ గెలవదనే వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చింది. అయిదే దీనిపై కోమటిరెడ్డి వివరణ ఇవ్వలేదు. గడువు కూడా ముగిసింది. దీంతో మరోసారి ఇవాళ కూడా కాంగ్రెస్ అధిష్టానం నోటీసులు ఇచ్చింది.
మునుగోడులో ఉప ఎన్నిక నేపథ్యంలో బీజేపీ అభ్యర్థి, తన తమ్ముడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఓటేయాలంటూ వెంకట్ రెడ్డి కాంగ్రెస్ కార్యకర్తలను కోరినట్లు సామాజిక మాధ్యమాల్లో వీడియో వైరల్ అయింది. దీనిపై స్పందించిన అధిష్టానం వివరణ ఇవ్వాలని కోరుతూ గతంలో క్రమశిక్షణా కమిటీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. అక్టోబర్ 22న నోటీసులు జారీ చేసింది. ఈనెల 1వ తేదీతో పది రోజుల గడువు ముగిసింది. ఈ నేపథ్యంలో మరోసారి షోకాజ్ నోటీసులు పంపింది.
షోకాజ్ నోటీసులు ఇచ్చిన సమయంలో ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నారు. తమకు ఆ నోటీసులు అందలేదని కోమటిరెడ్డి కార్యాలయం తెలిపినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి మరోసారి ఏఐసీసీ క్రమశిక్షణ కమిటీ షోకాజ్ నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ నోటీసులపై తక్షణమే వివరణ ఇవ్వాలని స్పష్టం చేసింది.
ఇప్పటికే రాష్ట్రానికి చేరుకున్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి... ఇప్పటివరకైతే రాహుల్ పాదయాత్రలో పాల్గొనలేదు. మీడియా ముందుకు కూడా రావటం లేదు. ఈ క్రమంలో... ఈసారైనా షోకాజ్ నోటీసులపై కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రియాక్ట్ అవుతారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు వివరణ ఇవ్వకపోతే కోమటిరెడ్డిపై వేటు తప్పదనే వార్తలు బయటికి వస్తున్నాయి.