రూ.50 లక్షలు ఇవ్వకపోతే చంపుతానని బెదిరింపులు, హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై నాన్ బెయిలబుల్ కేసు-nonbailable case filed against huzurabad mla kaushik reddy for threatening to kill him if he does not pay rs 50 lakhs ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  రూ.50 లక్షలు ఇవ్వకపోతే చంపుతానని బెదిరింపులు, హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై నాన్ బెయిలబుల్ కేసు

రూ.50 లక్షలు ఇవ్వకపోతే చంపుతానని బెదిరింపులు, హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై నాన్ బెయిలబుల్ కేసు

HT Telugu Desk HT Telugu

హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మరో వివాదంలో చిక్కుకున్నారు. ఓ గ్రానైట్ క్వారీ యజమానిని రూ.50 లక్షలు డిమాండ్ చేయగా.. బాధితుడి భార్య ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై వరంగల్ కమిషనరేట్ సుబేదారి పోలీసులు కేసు నమోదు చేశారు.

పాడి కౌశిక్‌ రెడ్డిపై నాన్‌ బెయిలబుల్‌ కేసు నమోదు

హుజురాబాద్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌ రెడ్డిపై నాన్‌బెయిలబుల్‌ కేసు నమోదైంది. గ్రానైట్‌ క్వారీ యజమానిని బెదిరించారనే ఆరోపణలపై కౌశిక్‌ రెడ్డిపై కేసు నమోదు చేశారు. బాధితులు ఫిర్యాదుతో నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేయగా.. తొందర్లోనే ఆయనను అరెస్ట్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

మరో నాలుగు రోజుల్లోనే బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ జరగనుండగా, ఇంతలో ఆ పార్టీ ఎమ్మెల్యేపై డబ్బులు డిమాండ్ చేసినందుకు నాన్ బెయిలబుల్ కేసు నమోదు కావడం తీవ్ర చర్చనీయాంశమైంది. బాధితుల కథనం మేరకు పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. హనుమకొండ జిల్లా కేంద్రంలోని ఎక్సైజ్ కాలనీలో నివాసం ఉంటున్న కట్టా మనోజ్ రెడ్డి అనే వ్యక్తి కమలాపూర్ మండలం వంగపల్లి గ్రామ శివారులో గ్రానైట్ క్వారీ నడుపుతున్నాడు.

మొదట రూ.25 లక్షలు డిమాండ్

హుజురాబాద్ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత పాడి కౌశిక్ రెడ్డి… క్వారీ యజమాని మనోజ్ రెడ్డిపై బెదిరింపులకు పాల్పడ్డాడు. తన నియోజకవర్గంలో గ్రానైట్ క్వారీ నిర్వహించాలంటే రూ.25 లక్షలు ఇవ్వాల్సిందేనని బెదిరించాడు. దీంతో భయపడిపోయిన మనోజ్ రెడ్డి రూ.25 లక్షలు ముట్టజెప్పాడు.

ఇప్పుడు 50 లక్షలు డిమాండ్

ఈ నెల 18న మధ్యాహ్నం పాడి కౌశిక్ రెడ్డి మరోసారి మనోజ్ రెడ్డికి కాల్ చేసి, ఈసారి రూ.50 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. తన నియోజకవర్గంలో గ్రానైట్ క్వారీ నడవాలంటే డబ్బులు ఇవ్వాల్సిందేనని, లేదంటే మనోజ్ రెడ్డితో పాటు అతని కుటుంబ సభ్యులను చంపుతానని బూతులు తిడుతూ బెదిరించాడు.

పోలీసులకు ఫిర్యాదు

ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి బెదిరింపులకు భయపడిపోయిన మనోజ్ రెడ్డి మనోవేదనకు గురయ్యాడు. ఈ మేరకు రెండు రోజులుగా ఆవేదన చెందుతున్నాడు. తన భర్త తీరును గమనించిన మనోజ్ రెడ్డి భార్య కట్టా ఉమాదేవి అసలు విషయంపై ఆరా తీసింది. అనంతరం హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తమను రూ.50 లక్షలు డిమాండ్ చేస్తున్నాడని, డబ్బులు ఇవ్వకపోతే తన భర్తతో పాటు కుటుంబ సభ్యులను చంపుతానని బెదిరిస్తున్నాడంటూ ఉమాదేవి సుబేదారి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

నాన్ బెయిలబుల్ కేసు

తమ కుటుంబానికి ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి నుంచి ప్రాణహాని ఉందని ఉమాదేవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సుబేదారి పోలీసులు బీఎన్ఎస్ 308(2), 308(4), 352 సెక్షన్ల కింద 225/2025 ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. నాన్ బెయిలబుల్ కేసు కావడంతో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని త్వరలోనే అరెస్ట్ చేసే అవకాశం ఉందని పోలీస్ వర్గాలు చెబుతున్నాయి. మరో నాలుగు రోజుల్లోనే బీఆర్ఎస్ రజతోత్సవ సభ జరగనుండగా.. ఆ పార్టీ ఎమ్మెల్యే వ్యవహారం పట్ల తీవ్ర చర్చ జరుగుతోంది.

(రిపోర్టింగ్: హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి)

సంబంధిత కథనం