తెలంగాణలో 5 శాసన మండలి స్థానాలకు నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఇవాళ్టి నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. నామినేషన్ల దాఖలుకు చివరి తేది మార్చి 10గా నిర్ణయించారు. మార్చి 11న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. నామినేషన్ల ఉపసంహరణకు మార్చి 13 వరకు గడువు విధించారు. మార్చి 20న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. మార్చి 20న సాయంత్రం 5 గంటలకు కౌంటింగ్ ఉంటుంది.
అసెంబ్లీలో సంఖ్యా బలం ప్రకారం.. కాంగ్రెస్కు నాలుగు స్థానాలు దక్కే అవకాశం ఉంది. ప్రతిపక్ష బీఆర్ఎస్కు ఒకటి దక్కే ఛాన్స్ ఉంది. బీఆర్ఎస్ విషయం అటుంచితే.. కాంగ్రెస్లో పోటీ ఎక్కువగా ఉంది. కాంగ్రెస్కు దక్కే ఎమ్మెల్సీల్లో ఒక్కొక్కటి కావాలంటూ మిత్రపక్షాలు సీపీఐ, ఎంఐఎం కోరుతున్నాయి. కాంగ్రెస్ నుంచి అద్దంకి దయాకర్, వేం నరేందర్ రెడ్డి, బానోతు విజయ్ బాయ్, పారిజాత నర్సింహా రెడ్డి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.
ఇటీవల బీసీ నినాదం కాంగ్రెస్ పార్టీలో చర్చనీయాంశంగా మారింది. బీసీల నుంచి పెద్ద సంఖ్యలో ఎమ్మెల్సీ పదవిని ఆశిస్తున్నారు. బీసీ వర్గం నుంచి ఈరవత్రి అనిల్ కుమార్, గాలి అనిల్ కుమార్, చరణ్ కౌశిక్ యాదవ్, జెరిపాటి జైపాల్, కైలాష్ నేత తదితరులు ఈ పదవులను ఆశిస్తున్నారు. వీరే కాకుండా టీపీసీసీ మీడియా కమిటీ ఛైర్మన్ సామా రాంమోహన్ రెడ్డి, పీసీసీ మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ జట్టి కుసుమ కుమార్, గాంధీ భవన్ ఇన్ఛార్జ్ కుమార్ రావు, హర్కార వేణు గోపాల్ రావు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీలోని బీసీ లీడర్లు ఆలర్ట్ అయ్యారు. సామాజిక సమీకరణాల ఆధారంగానే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల కులగణన చేయడంతో బీసీల లెక్కలు తేలాయని అంటున్నారు. బీసీలు 56 శాతం ఉండడంతో.. ఆ ప్రాతిపదికనే సీట్లు కేటాయించాలనే డిమాండ్ ఉంది. అందర్నీ సంతృప్తిపరచేలా బీసీ, రెడ్డి, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాల నుంచి ఒక్కో సీటు ఇస్తారనే టాక్ వినిపిస్తోంది. కానీ.. బీసీ నేతలు మాత్రం రెండుకు తగ్గితే ఒప్పుకనే పరిస్థితి కనిపించడం లేదు.
ఈ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి తలనొప్పిగా మారాయనే చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లారు. ఈ పర్యటనలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులపై పార్టీ అగ్ర నేతలతో చర్చించే అవకాశం ఉంది. అక్కడ ఫైనల్ చేసిన చేసిన వారికే అవకాశం ఇవ్వనున్నారు. దీంతో పదవి ఆశిస్తున్న నేతల్లో ఉత్కంఠ నెలకొంది.