తెలంగాణకు గుడ్ న్యూస్… కొత్తగా 150 ఎంబీబీఎస్ సీట్లు మంజూరు
తెలంగాణకు మరో 150 ఎంబీబీఎస్ సీట్లు మంజూరయ్యాయి. జగిత్యాల వైద్య కళాశాలకు ఈ సీట్లు కేటాయించేందుకు జాతీయ వైద్య కమిషన్(NMC) ఆమోదం తెలిపింది.
NMC green signal for govt medical college in Jagtial: తెలంగాణకు గుడ్ న్యూస్ చెప్పింది జాతీయ వైద్య కమిషన్. జగిత్యాలలో కొత్తగా నెలకొల్పిన ప్రభుత్వ మెడికల్ కాలేజీకి 150 ఎంబీబీఎస్ సీట్లను మంజూరు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం 2022-23 వైద్య విద్య సంవత్సరంలో కొత్తగా 8 ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రారంభించడానికి నిర్ణయించిన విషయం తెలిసిందే. జగిత్యాల సహా సంగారెడ్డి, వనపర్తి, నాగర్కర్నూల్, మహబూబాబాద్, కొత్తగూడెం, మంచిర్యాల, రామగుండంలలో వైద్య కళాశాలల నిర్మాణానికి ఇప్పటికే అనుమతులు ఇచ్చింది. ఈ 8 కళాశాలల్లో తొలి విడత తనిఖీల ప్రక్రియ పూర్తయింది.
ట్రెండింగ్ వార్తలు
ఎన్ఎంసీ సంతృప్తి…
లోపాలపై రాష్ట్ర ప్రభుత్వానికి కమిషన్ నివేదిక పంపగా.. వాటిని సవరించిన రాష్ట్ర ప్రభుత్వం రెండో విడత తనిఖీలకు ఆహ్వానించింది. ఇందులో భాగంగా జగిత్యాలలో తనిఖీ నిర్వహించిన ఎన్ఎంసీ బృందం సంతృప్తి వ్యక్తం చేసింది. కళాశాలకు అనుమతిస్తూ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖకు మంగళవారం అధికారికంగా లేఖ పంపింది.
మిగిలిన 7 కళాశాలకు....!
మిగిలిన 7 కళాశాలల్లో కొన్నింటిలో ఇప్పటికే రెండో విడత తనిఖీలు పూర్తికాగా.. మరికొన్నింటిలో ఈ నెలాఖరుకు పూర్తవుతాయని వైద్యవర్గాలు వెల్లడించాయి. అన్ని కళాశాలలకూ ఎన్ఎంసీ నుంచి అనుమతులు వస్తాయని, 2022-23 విద్యా సంవత్సరం నుంచే ఈ వైద్య కళాశాలల్లో తరగతులు ప్రారంభమవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. పెండింగ్ లో ఉన్న పనులను కూడా త్వరితగతిన పూర్తి చేసేందుకు ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టిందని అధికారులు చెప్పారు. ఫలితంగా రాష్ట్రంలో వైద్యసీట్లు భారీగా పెరిగే అవకాశం ఉండటంతో.. విద్యార్థులకు మంచి అవకాశమనే చెప్పవచ్చు.