నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్, కరీంనగర్ జిల్లాల్లో ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గాల ఓటర్ల నమోదుకు నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత కలిగిన ఓటర్లు తమ పేర్లను నమోదు చేసుకునేందుకు దరఖాస్తులు చేసుకోవచ్చని జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు సూచించారు. సెప్టెంబర్ 30 నుంచి దరఖాస్తులు ప్రారంభమయ్యాయని తెలిపారు.
నాలుగు జిల్లాలతో కూడిన ఉపాధ్యాయ శాసన మండలి నియోజకవర్గ స్థానంతో పాటు, పట్టభద్రుల శాసన మండలి నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రస్తుత ఎమ్మెల్సీ సభ్యుల కాలపరిమితి 2025 మార్చి 29 నాటితో ముగుస్తుంది. ఈ నేపథ్యంలో ఖాళీ అవుతున్న ఎమ్మెల్సీ నియోజకవర్గ స్థానాలకు ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా ఎలక్షన్ కమిషన్ అర్హత కలిగిన ఓటర్లకు పేర్ల నమోదు కోసం అవకాశం కల్పిస్తూ గత నెల 30న పబ్లిక్ నోటీసును జారీ చేసింది. అక్టోబర్ 16, 25 వ తేదీలలో సార్లు పత్రికా ప్రకటనలు జారీ చేయనున్నారు. ఇంతముందు ఓటు ఉన్నవాళ్లు కూడా మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
2024 నవంబర్ 06 వ తేదీ వరకు ఆన్లైన్ లో దరఖాస్తులు చేసుకోవాలని, ఏఈఆర్ఓ కార్యాలయాల్లో నేరుగా ఓటర్లు దరఖాస్తులు సమర్పించవచ్చని అధికారులు తెలిపారు. గతంలో ఓటు హక్కు వినియోగించుకున్న వారు సైతం మరోసారి తప్పనిసరిగా ఓటు హక్కు నమోదు చేసుకోవాల్సి ఉంటుందని కలెక్టర్ స్పష్టం చేశారు. గడువులోపు దాఖలైన దరఖాస్తులను పరిశీలించి నవంబర్ 23న ముసాయిదా ఓటరు జాబితాను ప్రకటిస్తారు. ముసాయిదా జాబితాపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే నవంబర్ 23 నుంచి డిసెంబర్ 09వ తేదీ వరకు తెలియజేయవచ్చని ఆమె అన్నారు.
2024 డిసెంబర్ 30 న నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్, కరీంనగర్ జిల్లాలతో కూడిన గ్రాడ్యుయేట్స్, టీచర్స్ ఎమ్మెల్సీ నియోజకవర్గ స్థానాలకు సంబంధించిన తుది ఓటరు జాబితాను విడుదల చేస్తారు. దీనిని దృష్టిలో పెట్టుకుని అర్హులైన ఓటర్లు జాబితాలో పేర్ల నమోదు కోసం ఈ నెల 30 నుంచి నవంబర్ 6వ తేదీ లోపు దరఖాస్తులు చేసుకోవాలని కలెక్టర్ క్రాంతి వల్లూరు సూచించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఓటర్లు ఫారం-18 లో, ఉపాధ్యాయ నియోజకవర్గ ఓటర్లు ఫారం-19 లో దరఖాస్తులు చేసుకోవాలని అన్నారు.
సీఈఓ సుదర్శన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్రంలో అన్ని జిల్లాల కలెక్టర్లతో ఓటరు జాబితాపై సమీక్ష నిర్వహించారు . ఎస్ఎస్ఆర్-2025 లో భాగంగా నిర్వహిస్తున్న ఓటరు జాబితా సవరణ ప్రక్రియను కట్టుదిట్టంగా చేపడుతూ నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలని సూచించారు. మంగళవారం హైదరాబాద్ నుంచి ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా స్పెషల్ సమ్మరీ రివిజన్, ఈ.ఆర్.ఓ నెట్ 2.0 తదితర అంశాలపై జిల్లా కలెక్టర్లతో సమీక్ష జరిపారు.
సంబంధిత కథనం