Fake Reels : రీల్స్ చేస్తున్నట్లు డ్రామా, ఒంటరిగా చిక్కితే నకిలీ తుపాకీతో బెదిరించి దోపిడీ-nirmal police arrested three youths duped with fake gun on reel drama ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Fake Reels : రీల్స్ చేస్తున్నట్లు డ్రామా, ఒంటరిగా చిక్కితే నకిలీ తుపాకీతో బెదిరించి దోపిడీ

Fake Reels : రీల్స్ చేస్తున్నట్లు డ్రామా, ఒంటరిగా చిక్కితే నకిలీ తుపాకీతో బెదిరించి దోపిడీ

HT Telugu Desk HT Telugu

Fake Reels : రీల్స్ తీస్తున్నట్లు డ్రామా అడుతూ.. నకిలీ తుపాకీ, కత్తితో ఒంటరిగా ఉన్న వారిని లక్ష్యంగా చేసుకుని దోపిడీ చేస్తున్న ముగ్గురిని నిర్మల్ పోలీసులు అరెస్టు చేశారు.

రీల్స్ చేస్తున్నట్లు డ్రామా, ఒంటరిగా చిక్కితే నకిలీ తుపాకీతో బెదిరించి దోపిడీ

Fake Reels : జల్సాలకు అలవాటుపడిన ముగ్గురు యువకులు అమాయకులను ఆసరా చేసుకుని దోపిడీకి పాల్పడుతూ పోలీసులకు చిక్కారు. ఈ సంఘటన నిర్మల్ జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. నిర్మల్ పట్టణానికి చెందిన ముగ్గురు యువకులును పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. జిల్లా పోలీసు అధికారి జానకి షర్మిల కేసు వివరాలను వెల్లడించారు. సులభంగా డబ్బు సంపాదించేందుకు చోరీలు మొదలెట్టారని, నకిలీ తుపాకీ, కత్తి వంటి మారణాయుధాలను ఉపయోగించి ఒంటరిగా ఉన్నవారిని లక్ష్యంగా చేసుకొని బెదిరింపులకు పాల్పడుతూ అందినకాడికి దోచుకునేవారని అన్నారు.

రీల్స్ చేస్తూ.... పోలీసులను పక్కదారి పట్టిస్తూ

స్థానిక గుల్జార్ మార్కెట్ కు చెందిన అవేజ్ ఛెస్, చిక్కడపల్లికి చెందిన షేక్ మతీనుద్దీన్, షేక్ ఆదిల్ మిత్రులు. మతిన్ మాఫియా పేరిట సామాజిక మాధ్యమంలో ప్రత్యేకంగా పేజీ ఏర్పా టుచేసుకున్నారు. నకిలీ తుపాకీ, కత్తి వంటి ఆయుధాలను ఉపయోగించి రీల్స్ చేస్తూ పోస్ట్ చేసేవారు. రాత్రివేళల్లో పట్టణ శివారు ప్రాంతాల్లో తిరుగుతూ ఒంటరిగా కనిపించిన ప్రేమజంటలను, వ్యక్తులపై బెదిరింపులకు పాల్పడేవారు. వారి నుంచి అందినకాడికి దోచుకొనేవారు. ప్రయాణ ప్రాంగణం, ఇతర ప్రదేశాల్లోనూ ఒంటరిగా నిద్రిస్తున్న వారిని సైతం వీరు లక్ష్యంగా చేసుకునేవారు. ఇలా కొంతకాలంగా దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఎవరైనా గమనిస్తే వెంటనే.. రీల్స్ చేస్తున్నట్లు నటిస్తూ వివిధ రకాల నటనతో ముందుకు సాగుతూ తప్పించుకునేవారు.

పట్టణ ఎస్సై అశోక్, తన సిబ్బందితో కలిసి స్థానిక శివాజీచౌక్ ప్రాంతంలో వాహన తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో ద్విచక్రవాహనంపై ఉన్న ఇద్దరు యువకులు వీరిని చూసి పారిపోయారు. బయపడి పారిపోతుండగా పోలీసులు పట్టుకుని విచారిస్తే అసలు విషయాలు బయటపడ్డాయి. వారిని తనిఖీ చేయగా వారివద్ద నకిలీ తుపాకీ పట్టుబడింది. హైదరాబాద్ కు చెందిన గుర్తుతెలియని వ్యక్తి వద్ద వీరు దాన్ని కొనుగోలు చేసినట్లు గుర్తించారు. దీని సాయంతోనే రీల్స్ చేయడం, బెదిరించి దోచుకోవడం చేస్తున్నట్లు ఒప్పుకున్నారు. వీరిలో ఒకరు మొబైల్ దొంగతనం కేసులో నిందితుడిగా ఉన్నాడు. నిందితుల నుంచి నకిలీ తుపాకీ, స్కూటీ, 3 చరవాణులు స్వాధీనం చేసుకున్నారు. వారిని రిమాండ్ కు తరలించారు. సామాజిక మాధ్యమాలపై జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక విభాగం ఏర్పాటుచేసి నిరంతర నిఘా ఏర్పాటు చేశామని ఎస్పీ జానకి షర్మిల వివరించారు. రీల్స్ పేరిట అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినా చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. నిందితులను పట్టుకోవడంలో కీలకంగా పనిచేసిన ఐటీ కోర్, పోలీసు సిబ్బందిని అభినందించారు.

మృతురాలి భర్త, మామకు ఏడేళ్ల జైలు శిక్ష..

అదనపు కట్నం కోసం వేధింపులకు గురిచేసి వివాహిత మృతికి కారణమైన ఘటనలో భర్త, మామకు నిర్మల్ న్యాయస్థానం జైలు శిక్ష విధించింది. నిర్మల్ గ్రామీణ సీఐ బి. శ్రీనివాస్, లైజనింగ్ అధికారి డల్లుసింగ్ తెలిపిన వివరాల ప్రకారం సారంగాపూర్ మండలం ధని గ్రామానికి చెందిన సౌమ్యకు 2016లో చేపూరి శ్రీనివాస్ అనే వ్యక్తితో వివాహమైంది. పెళ్లి సమయంలో కట్నకానుకలు అందజేశారు. నెలరోజుల పాటు వీరి కాపురం బాగానే సాగింది. ఆ తర్వాత రూ.50 వేలు అదనపు కట్నం కావాలంటూ భర్త, అత్త, మామ ఆమెను వేధించడం ప్రారంభించారు. పుట్టింటి వారు కులపెద్దల సమక్షంలో పంచాయితీ నిర్వహించి అందరికీ నచ్చజెప్పారు. అయినా పరిస్థితిలో మార్పురాలేదు. వేధింపులు ఎక్కువవడంతో భరించలేక 8 అక్టోబరు 2019 రోజున సౌమ్య ఇంట్లోనే ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అరెస్టుచేసి న్యాయస్థానంలో హాజరుపరిచారు. విచారణలో భాగంగా పీపీ కల్వకుంట్ల వినోదారావు 13 మంది సాక్షులను ప్రవేశపెట్టి నేరం రుజువుచేయడంతో నేరస్థులైన భర్త శ్రీనివాస్, మామ వెంకటస్వామికి ఏడేళ్ల కఠిన కారాగారశిక్ష ఒక్కొక్కరికీ రూ.6 వేల చొప్పున జరిమానా విధిస్తూ జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎ.కర్ణకుమార్ శుక్రవారం తీర్పునిచ్చారు.

రిపోర్టింగ్ : కామోజీ వేణుగోపాల్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా HT తెలుగు డెస్క్

సంబంధిత కథనం