Nalgonda Politics : పొటిలికల్ ఎంట్రీ కోసం వారసుడు తహతహ, గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్న బడా లీడర్!
వారసుడి పొలిటికల్ ఎంట్రీ కోసం ఆ బడా లీడర్ తహతహలాడుతున్నారు. గులాబీ పెద్దల ఆశీర్వాదంతో తనయుడిని ఎమ్మెల్యే చేయాలని ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఎన్నికలు సమీపిస్తుండటంతో ఆ యువ లీడర్ సామాజిక కార్యక్రమాలతో దూసుకెళ్తున్నారు. పొలిటికల్ స్ట్రాటజీలతో యూత్ కు బాగా కనెక్ట్ అవుతున్నారు. ఇంతకీ ఎవరా యువ లీడర్?
Nalgonda Politics :ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన... శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుంఖేందర్ రెడ్డి తన వారసుడు గుత్తా అమిత్ రెడ్డిని రాజకీయాల్లోకి తీసుకొచ్చేందుకు చక్రం తిప్పుతున్నారు. పార్టీ లైన్ దాటకుండా తన కుమారుడు కూడా రేసులో ఉన్నాడనే హింట్ ఇస్తున్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో గుత్తా అమిత్ రెడ్డిని పోటీలో నిలిపేందుకు పావులు కదుపుతున్నారు. రాజకీయ వ్యూహంలో భాగంగానే ట్రస్ట్ ఏర్పాటు చేసి ఉమ్మడి నల్గొండ జిల్లాలోని నల్గొండ, మునుగోడు నియోజకవర్గాల్లో సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. బీఆర్ఎస్ పెద్దల ఆశీర్వాదంతోనే తన కుమారుడి రాజకీయ ఆరంగ్రేటం చేస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నారు. విదేశాల్లో చదువుకున్న గుత్తా అమిత్ రెడ్డి వ్యాపారాల్లో రాణించారు. రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చేందుకు మంచి టైమింగ్ కోసం ఎదురు చూస్తున్నారు. కొన్ని నెలలుగా తన తాత గుత్తా వెంకట్ రెడ్డి పేరుతో ట్రస్ట్ ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. నల్గొండ, మునుగోడు నియోజకవర్గాల్లో పర్యటిస్తూ జనాలతో కనెక్ట్ అవుతున్నారు. బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలను డిస్టర్బ్ చేయకుండా తనపని తాను చేసుకుంటూ సైలెంటుగా నెట్ వర్క్ పెంచుకుంటూ పోతున్నారు.
ట్రెండింగ్ వార్తలు
భూపాల్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి తీరుపై అధిష్ఠానం అసంతృప్తి
ఉమ్మడి నల్గొండ జిల్లాలోని నల్గొండ, మునుగోడు ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్ రెడ్డి, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఇద్దరిపై సొంతపార్టీలోనే వ్యతిరేకత ఉంది. ఇది గులాబీ బాస్ కేసీఆర్ వరకూ వెళ్లింది. ఇద్దరిని పిలిచి క్లాస్ కూడా పీకినట్టు టాక్ వినిపిస్తోంది. ముఖ్యమంత్రి మందలించినా కంచర్ల భూపాల్ రెడ్డి, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి తీరులో మాత్రం మార్పు కాదు కదా తమ వ్యవహార శైలితో ఈసారి ఏకంగా ప్రజాభిమానం చెడగొట్టుకున్నారు. భూపాల్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డిల తీరుతో అసంతృప్తిగా ఉన్న హైకమాండ్ కూడా గుత్తా అమిత్ రెడ్డిని ఎంకరేజ్ చేస్తున్నట్టు పొలిటికల్ సర్కిళ్లల్లో రూమర్స్ వినిపిస్తున్నాయి.
రంగంలోకి ఐప్యాక్ టీం
ఎన్నికలకు కొద్దినెలల సమయమే ఉండటం, టికెట్ రేసులో తాను పోటీలో ఉన్నానని చెప్పేందుకు పొలిటికల్ స్ట్రాటజీలతో దూసుకెళ్తున్నారు గుత్తా అమిత్ రెడ్డి. రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కు చెందిన ఐప్యాక్ టీం సభ్యులను కూడా రంగంలోకి దించారట. అందుకే ఇటీవల సోషల్ మీడియా యాక్టివిటీతోపాటు గ్రౌండ్ లోనూ యాక్టివ్ అయ్యారు అమిత్ రెడ్డి. ఉమ్మడి నల్గొండ జిల్లాలో యూత్ కు బాగా కనెక్ట్ అయ్యేందుకు నిరుద్యోగులు-విద్యార్థుల కోసం లక్షలు ఖర్చు చేసి ఉచిత ఆన్ లైన్ కోచింగ్ యాప్ కూడా లాంచ్ చేశారాయన. అటు సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ పూర్తిగా పబ్లిక్ లోనే ఉంటున్నారు. హైకమాండ్ ఆదేశిస్తే నల్గొండ లేదా మునుగోడు ఎక్కడి నుంచైనా పోటీ చేసేందుకు గుత్తా సుఖేందర్ రెడ్డి వారసుడు గ్రౌండ్ ప్రిపరేషన్స్ చేసుకుంటున్నారట.