Telugu News  /  Telangana  /  Munugode By Poll Sheeps Distribution Scheme Becomes Cash Transfer Scheme In Munugode
ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

Munugode Bypoll Effect : నో గొర్రెల పంపిణీ.. డైరెక్ట్ అకౌంట్లోకే డబ్బులు

05 October 2022, 21:21 ISTHT Telugu Desk
05 October 2022, 21:21 IST

Munugode By Election : మునుగోడు ఉపఎన్నిక దగ్గర పడుతుంది. ఇలాంటి సమయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో గొర్రెల పంపిణీ పథకాన్ని నగదు బదిలీకి మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

మునుగోడు ఉపఎన్నిక(Munugode Bypoll) దగ్గర పడుతున్న సమయంలో ప్రభుత్వం నుంచి కీలక ఉత్తర్వులు జారీ అయ్యాయి. గొర్రెల పంపిణీ పథకాన్ని నగదు బదిలీకి ఛేంజ్ చేస్తూ.. సర్కార్ ఉత్తర్వులు జారీచేసింది. నల్గొండ, యాదాద్రి భువనగిరి జిల్లాలో లబ్ధిదారులకు గొర్రెల(Sheeps) పంపిణీ బదులుగా నగదు బదిలీ చేపట్టాలని నిర్ణయించింది. దీనికి సంబంధించి.. ఇప్పటికే ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి.

ట్రెండింగ్ వార్తలు

ఇతర రాష్ట్రాల నుంచి గొర్రెల కొనుగోళ్లకు సమయం పడుతుందని, ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. గొర్రెల పంపిణీలో జాప్యాన్ని నివారించేందుకు గొల్ల, కురుమ సంఘం సభ్యులు సొంతంగా గొర్రెలను కొనుగోలు చేసేలా ప్రత్యక్ష నగదు ప్రయోజన పథకాన్ని ప్రవేశపెట్టాలని ప్రభుత్వం(Govt) నిర్ణయించిందని అంటున్నారు. రెండు జిల్లాలను పేర్కొంటూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినా.. పైలట్ ప్రాజెక్టుగా మునుగోడు(Munugode)ను ఎంపిక చేసినట్టుగా తెలుస్తోంది.

రాయితీని బదిలీ చేయాలని నల్గొండ(Nalgonda), యాదాద్రి భువనగిరి జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు వెళ్లాయి. నల్గొండ జిల్లాలో 5,600 మంది, యాదాద్రి భువనగిరి జిల్లాలో 2,000 మంది లబ్ధిదారులు ఉన్నారు. మొత్తం 93.76 కోట్ల రూపాయల నగదు ప్రయోజనం చేకూరనుంది. అయితే.. ఈ మొత్తం 7,600 మంది లబ్ధిదారులు కూడా మునుగోడు నియోజకవర్గానికి చెందినవారని తెలుస్తోంది. చౌటప్పుల్, నారాయణపురం మండలాల్లో 2 వేల మంది, మునుగోడు, చండూరు, నాంపల్లి, మర్రిగూడ, గట్టుప్పల్ మండలాల్లో 5,600 మంది లబ్ధిదారులు ఉన్నారు.

ఈ పథకంలో భాగంగా.. ఒక్కొ లబ్ధిదారుడికి 20 గొర్రెలు, ఒక పొట్టేలును పంపిణీ చేస్తారు. లబ్ధిదారుడు 25 శాతం జమ చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వం రూ.1,31,250 జమ చేస్తుంది. నగదు బదిలీగా మార్చిన కారణంగా.. ప్రభుత్వం రూ. 1,31,250 నేరుగా లబ్ధిదారులకు బదిలీ చేయనుంది. ఇప్పుడు దీనిపై విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఎన్నికల ముందు ఇలా చేయడమేంటని ప్రశ్నలు వస్తున్నాయి.

ఈ నెల 7న మునుగోడు ఉపఎన్నిక నోటిఫికేషన్(Munugode Bypoll Notification) విడుదల అవుతుంది. నామినేషన్స్ సమర్పణకు ఈనెల 14 వరకు లాస్ట్ డేట్. 15న నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. ఉపసంహరణకు ఈ నెల 17 వరకు అవకాశం ఉంటుంది. నవంబర్ 3వ తేదీన మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ జరగనుంది. 6వ తేదీన ఓట్ల లెక్కింపు నిర్వహిస్తారు.