కన్నతల్లి రాసిన మరణ శాసనం.. ఇద్దరు కుమారులను చంపేసి ఆపై ఆత్మహత్య.. గాజులరామారంలో తీవ్ర విషాదం-mother kills two sons in gajularamaram of hyderabad ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  కన్నతల్లి రాసిన మరణ శాసనం.. ఇద్దరు కుమారులను చంపేసి ఆపై ఆత్మహత్య.. గాజులరామారంలో తీవ్ర విషాదం

కన్నతల్లి రాసిన మరణ శాసనం.. ఇద్దరు కుమారులను చంపేసి ఆపై ఆత్మహత్య.. గాజులరామారంలో తీవ్ర విషాదం

నవ మాసాలు మోసి కన్న కొడుకుల గొంతుకోసి చంపింది ఓ తల్లి. ఆపై తాను కూడా అపార్ట్‌మెంట్‌లోని 5వ అంతస్తు పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద ఘటన జీడిమెట్ల పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని గాజులరామారంలోని జరిగింది. ఈ ఘటన గురించి బాలానగర్‌ డీసీపీ కె.సురేష్‌కుమార్‌ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

మృతిచెందిన ఇద్దరు చిన్నారులు (ఫైల్ ఫొటో)

పిల్లలకు చిన్న గాయమైతే తట్టుకోలేని కన్నతల్లి.. తన చేతులతోనే వారికి మరణ శాసనం రాసింది. అల్లారు ముద్దుగా చూసుకుంటున్న ఇద్దరు కుమారులను కిరాతకంగా కత్తితో నరికిచంపింది. ఆ తర్వాత ఐదందస్థుల భవనంపై నుంచి దూకి ఆమె ఆత్మహత్య చేసుకుంది. ఆ హృదయవిదార ఘటన హైదరాబాద్ జీడిమెట్లలోని గాజులరామారంలో జరిగింది. పిల్లలకు శ్వాసకోస సమస్య, తనకు కళ్ల సమస్య ఉండడంతో మానసికంగా కుంగిపోయిన తల్లి.. ఇలా చేసినట్లు పోలీసులు చెబుతున్నారు.

నర్సరీ చదువుతున్న పిల్లలు..

ఖమ్మం జిల్లా సత్తుపల్లి పరిధిలోని చోడవరం గ్రామానికి చెందిన గాండ్ర వెంకటేశ్వరరెడ్డి భార్య తేజస్విని(35), ఇద్దరు కుమారులు ఆశిష్ రెడ్డి(7), హర్షిత్‌రెడ్డి(5)లతో కలిసి బాలాజీ లేఅవుట్‌లోని సహస్ర మహేష్‌ హెయిట్స్‌ అపార్ట్‌మెంట్‌లోని ఫ్లాట్‌నంబర్‌ 204లో నివాసం ఉంటున్నారు. వెంకటేశ్వరరెడ్డి బొంతపల్లిలోని ఓ పరిశ్రమలో నాలుగేళ్లుగా పనిచేస్తున్నాడు. పిల్లలిద్దరూ స్థానికంగా ఉన్న ఓ పాఠశాలలో 1వ తరగతి, నర్సరీ చదువుతున్నారు.

రక్తపు మడుగులో చిన్నారులు..

గురువారం ఉదయం వెంకటేశ్వర రెడ్డి విధులకు వెళ్లగా.. ఇంట్లో తేజస్విని, పిల్లలు ఉన్నారు. మధ్యాహ్నం 3.30 గంటల ప్రాంతంలో తేజస్విని అపార్ట్‌మెంట్‌ పైనుంచి దూకడంతో పెద్ద శబ్దం వచ్చింది. ఇది విన్న అపార్ట్‌మెంట్‌ వాసులు వెళ్లి చూడగా తేజస్విని అక్కడికక్కడే మృతిచెందింది. అపార్ట్‌మెంట్‌ వాసులు సెకండ్‌ ఫ్లోర్‌లోని తేజస్విని ఇంట్లోకి వెళ్లి చూడగా.. కిచెన్‌లో ఆశిష్ రెడ్డి అప్పటికే మృతి చెంది రక్తపుమడుగులో పడి ఉన్నాడు. హర్షిత్‌ రెడ్డి కొన ప్రాణంతో కొట్టుమిట్టాడుతున్నాడు.

వివరాలు సేకరించిన పోలీసులు..

హర్షిత్‌ను షాపూర్‌నగర్‌లోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. టన జరిగిన పరిసరాలను పరిశీలిస్తే.. తేజస్విని తన ఇద్దరు కొడుకులను చంపినట్టు ఉందని స్థానికులు చెప్పారు. ఈ విషయం తెలుసుకున్న బాలానగర్‌ డీసీపీ సురేష్ కుమార్, అడిషనల్‌ డీసీపీ హన్మంత్‌రావు, జీడిమెట్ల ఇన్‌స్పెక్టర్‌ గడ్డం మల్లేశ్‌ ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతదేహాలను పోస్టుమార్టమ్‌ నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. చోడవరం గ్రామం, గాజులరామారంలో విషాదం నెలకొంది.