హైదరాబాద్లోని బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధి ప్రగతినగర్లో దారుణం జరిగింది. కృష్ణపావని అనే మహిళ.. తన నాలుగేళ్ల కూతురు జశ్వికకి పురుగుల మందును కూల్ డ్రింక్లో కలిపి తాగించింది. అనంతరం ఆమె కూడా ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈనెల 18న సాయంత్రం ఈ ఘటన జరిగ్గా.. ఆదివారం తెల్లవారుజామున చికిత్స పొందుతూ చిన్నారి జశ్విక ప్రాణం విడిచింది. తల్లి కృష్ణ పావని ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. అనారోగ్య సమస్యల కారణంగానే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది.
ఇటీవల హైదరాబాద్ గాజులరామారంలో కూడా ఓ తల్లి కర్కశంగా ప్రవర్తించింది. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పరిధిలోని చోడవరం గ్రామానికి చెందిన గాండ్ర వెంకటేశ్వరరెడ్డి భార్య తేజస్విని(35), ఇద్దరు కుమారులు ఆశిష్ రెడ్డి(7), హర్షిత్రెడ్డి(5)లతో కలిసి బాలాజీ లేఅవుట్లోని సహస్ర మహేష్ హెయిట్స్ అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్నారు. వెంకటేశ్వరరెడ్డి బొంతపల్లిలోని ఓ పరిశ్రమలో నాలుగేళ్లుగా పనిచేస్తున్నాడు. పిల్లలిద్దరూ స్థానికంగా ఉన్న ఓ పాఠశాలలో 1వ తరగతి, నర్సరీ చదువుతున్నారు.
వెంకటేశ్వర రెడ్డి విధులకు వెళ్లగా.. ఇంట్లో తేజస్విని, పిల్లలు ఉన్నారు. మధ్యాహ్నం 3.30 గంటల ప్రాంతంలో తేజస్విని అపార్ట్మెంట్ పైనుంచి దూకడంతో పెద్ద శబ్దం వచ్చింది. ఇది విన్న అపార్ట్మెంట్ వాసులు వెళ్లి చూడగా తేజస్విని అక్కడికక్కడే మృతిచెందింది. అపార్ట్మెంట్ వాసులు సెకండ్ ఫ్లోర్లోని తేజస్విని ఇంట్లోకి వెళ్లి చూడగా.. కిచెన్లో ఆశిష్ రెడ్డి అప్పటికే మృతి చెంది రక్తపుమడుగులో పడి ఉన్నాడు. హర్షిత్ రెడ్డి కొన ప్రాణంతో కొట్టుమిట్టాడుతున్నాడు.
హర్షిత్ను షాపూర్నగర్లోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. ఘటన జరిగిన పరిసరాలను పరిశీలిస్తే.. తేజస్విని తన ఇద్దరు కొడుకులను చంపినట్టు ఉందని స్థానికులు చెప్పారు. ఈ విషయం తెలుసుకున్న బాలానగర్ డీసీపీ సురేష్ కుమార్, అడిషనల్ డీసీపీ హన్మంత్రావు, జీడిమెట్ల ఇన్స్పెక్టర్ గడ్డం మల్లేశ్ ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతదేహాలను పోస్టుమార్టమ్ నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
పిల్లలు అల్లరి చేస్తున్నారని తల్లి సుభాషిణి ఇంట్లో ఉన్న పేడ రంగు రసాయన మందును నీటిలో కలిపి ఇద్దరు కుమార్తెలకు ఇచ్చింది. చేదుగా ఉందని పిల్లలు తెలపడంతో.. చేదు లేకుండా ఉండాలని కూల్ డ్రింక్లో కలపి వారికిచ్చింది. తర్వాత క్షణికావేశంలో ఆమె తాగింది. ఇది గమనించిన చుట్టుపక్కల వారు తల్లి, ఇద్దరు కుమార్తెలను చికిత్స నిమిత్తం వెల్దుర్తి తీసుకొచ్చారు. తల్లి సుభాషిణి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది. ఇద్దరు చిన్నారులకు మెరుగైన వైద్యం కోసం కర్నూలు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.