మేడ్చల్ జిల్లా గాజుల రామారంలో దారుణ ఘటన జరిగింది. కుటుంబ కలహాలు, అనారోగ్య సమస్యలతో తల్లి కన్నబిడ్డలను హతమార్చి ఆత్మహత్యకు పాల్పడింది.
హైదరాబాద్ జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని గాజుల రామారంకు చెందిన పదకొండేళ్ల రిషిత్ రెడ్డి, ఐదేళ్ల ఆశిష్ రెడ్డిలను కన్న తల్లి వేటకొడవలితో నరికి చంపి, ఆ తర్వాత భవనం పై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఘటన స్థలంలో పోలీసులు ఐదు పేజీల సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నారు.
గాజులరామారంకు చెందిన తేజస్విని రెడ్డి ఇద్దరు కొడుకుల్ని చంపి ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ కలహాలతో మృతి చెందినట్టు మొదట ప్రచారం జరిగింది. ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన వెంకట్ రెడ్డి-తేజస్విని రెడ్డి దంపతులు కొంత కాలంగా గాజులరామారంలో ఉంటున్నారు.
తేజస్విని రెడ్డికి మానసిక ఆరోగ్యం బాగోదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. భర్త వెంకట్ రెడ్డి ఓ ఫార్మా కంపెనీలో పనిచేస్తున్నారు. గురువారం మధ్యాహ్నం ఇద్దరు పిల్లల్ని నరికి చంపి ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది.
మరోవైపు పిల్లలు తల్లి చేతిలో హత్యకు గురి కావడం స్థానికులను కలిచివేసింది. తల్లి దాడిలో గాయపడిన చిన్న కుమారుడిని స్థానికులు ఆస్పత్రికి తరలించేలోపు మృతి చెందాడు. బాలానగర్ డీసీపీ ఘటనా స్థలికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు.