జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం తొంబర్రావుపేట గ్రామంలో హృదయ విదారక ఘటన జరిగింది. ఉపాధి కోసం గ్రామానికి చెందిన గడ్డం నర్సారెడ్డి (50) సౌదీ అరేబియాలోని ఇరాక్ సరిహద్దు ప్రాంతానికి వెళ్లాడు. అక్కడ ఆరార్ నగరంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. 6 నెలలుగా మృత్యువుతో పోరాడి ఈ నెల 6న అక్కడే తుదిశ్వాస వదిలాడు.
ఈ విషయం వృద్ధులైన తల్లిదండ్రులకు తెలిసింది. హృదయ విదారకంగా రోదించారు. తల్లి హన్మక్క (72) కుమారుడి మరణవార్త తెలిసి బెంగతో మంచం పట్టింది. కుమారుడి చివరి చూపు చూడకుండానే శనివారం తెల్లవారుజామున మృతిచెందింది. కేవలం రోజుల వ్యవధిలోనే ఒకే కుటుంబంలో ఇద్దరు మృతిచెందడంతో కుటుంబసభ్యులు, గ్రామస్థులు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు. తొంబర్రావుపేట గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని చాలా ప్రాంతాల్లో తరచు కరువులు రావడం, సరైన నీటిపారుదల సౌకర్యాలు లేకపోవడం, పెట్టుబడి వ్యయం పెరగడం వంటి కారణాల వల్ల వ్యవసాయం లాభదాయకంగా ఉండటం లేదు. దీనివల్ల ఇక్కడి రైతులు అప్పుల పాలవుతున్నారు. వ్యవసాయంపై ఆధారపడిన కుటుంబాలకు ఇతరత్రా స్థానికంగా తగినంత ఉపాధి లభించడం లేదు.
సౌదీ అరేబియాలో మంచి వేతనాలు, ఇతర సౌకర్యాలు ఉంటాయని భావించి, ప్రజలు మెరుగైన జీవితం కోసం వెళ్తున్నారు. కొందరు ప్రైవేట్ ఏజెంట్లు గ్రామీణ ప్రాంతాల ప్రజలకు గల్ఫ్లో మంచి ఉద్యోగాలు ఇప్పిస్తామని ఆశ చూపి వారిని వలసలకు ప్రోత్సహిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉద్యోగాలు, ఆర్థిక స్థిరత్వం వంటి వాగ్దానాలు నెరవేరలేదని కొందరు భావిస్తున్నారు.
ఒకప్పుడు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అనేక చక్కెర కర్మాగారాలు ఉండేవి. అవి మూతపడటంతో చెరకు రైతులు ఉపాధి కోల్పోయి వలస బాట పట్టారు. వలసలు కేవలం ఆర్థిక కారణాల వల్లనే కాకుండా, సామాజిక పరిస్థితులు, వ్యక్తిగత ఆకాంక్షల వల్ల కూడా ఉంటాయని తెలుస్తోంది. కేవలం ఉమ్మడి కరీంనగర్ జిల్లా వాసులే కాకుండా.. నిజామాబాద్, వరంగల్ జిల్లాల వాసులు కూడా ఉపాధి లేకపోవడం వంటి సమస్యల కారణంగా ఇతర దేశాలకు ఉపాధి వెళ్తున్నట్లు తెలుస్తోంది.