Padmasri Awardee Mogulaiah: దినసరి కూలీగా పద్మశ్రీ పురస్కార గ్రహీత మొగలయ్య, గౌరవ వేతనం ఆగడంతో కష్టాలు-mogalaiah a padma shri awardee now as a daily wage earner struggling with the stoppage of his honorarium ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Padmasri Awardee Mogulaiah: దినసరి కూలీగా పద్మశ్రీ పురస్కార గ్రహీత మొగలయ్య, గౌరవ వేతనం ఆగడంతో కష్టాలు

Padmasri Awardee Mogulaiah: దినసరి కూలీగా పద్మశ్రీ పురస్కార గ్రహీత మొగలయ్య, గౌరవ వేతనం ఆగడంతో కష్టాలు

Sarath chandra.B HT Telugu

Padmasri Awardee Mogulayya: అంతరించిపోతున్న కళను బతికిస్తున్న కళాకారుడు బతకడానికి కూలీ పని తప్ప మరో గత్యంతరం లేకుండా పోయింది. జాతీయ స్థాయిలో పద్మ పురస్కారాన్ని అందుకున్న కళాకారుడు ఆర్దిక అవసరాల కోసం పార పట్టి సిమెంట్‌ కలుపుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది.

కూలీపనులు చేస్తున్న కిన్నెర గాయకుడు దర్శనం మొగులయ్య

Padmasri Awardee Mogulaiah: కిన్నెర పాటతో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన కళాకారుడు కూలీపనులు చేసుకుంటున్నాడు. పద్మశ్రీ అవార్డ్ గ్రహీత మొగులయ్య దినసరి కూలీగా పనులకు వెళుతున్నాడు. రెండేళ్ల క్రితం రాష్ట్రపతి రాంనాథ్‌ కోవింద్‌ చేతుల మీదుగా పద్మ పురస్కారాన్ని అందుకున్న చేతులు ఇప్పుడు సిమెంట్, ఇసుక కలుపుతున్నాయి. కనీస అవసరాలు తీరాలంటే ఇంతకు మించిన మార్గం లేదని మొగులయ్య తెలిపారు.

తనకు ప్రభుత్వం ఇస్తోన్న నెలవారీ గౌరవ వేతనం ఆగిపోయిందని, అంతా సానుకూలంగా స్పందించినప్పటికీ ఎవరు ఏమీ చేయడం లేదని ఆయన చెప్పారు. మొగులయ్య తాజాగా హైదరాబాద్‌ సమీపంలోని తుర్కయమంజాల్‌లోని ఓ నిర్మాణ స్థలంలో కూలి పని చేస్తూ కనిపించాడు.

అరుదైన సంగీత వాయిద్యమైన 'కిన్నెర'ను తిరిగి ఆవిష్కరించినందుకు దర్శనం మొగులయ్యను 2022లో భారతదేశంలో అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీతో సత్కరించారు. రాష్ట్రపతి చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని మొగులయ్య అందుకున్నారు.

మొగులయ్య, కొడుకుల్లో ఒకరు మూర్ఛవ్యాధితో బాధపడుతున్నాడు. కొడుక్కి అవసరమైన మందుతు, తనకు అవసరమైన మందుల కోసం, నాకు నెలకు కనీసం నెలకు రూ.7వేల కావాలని వాటితో అప్పుడప్పుడు సాధారణ వైద్య పరీక్షలు, ఇతర ఖర్చులు ఉన్నాయని చెప్పారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన నెలవారీ గౌరవ వేతనం రూ.10వేలను ఇటీవల నిలిపివేశారని, అలా ఎందుకు జరిగిందో తనకు తెలియదన్నారు..

కోటి రూపాయల గ్రాంట్‌తో పాటు, మొగులయ్యకు రంగారెడ్డి జిల్లాలో 600 చదరపు గజాల స్థలాన్ని కూడా కేటాయిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం గతంలో ప్రకటించింది. అయితే ఆ కేటాయింపు ఇంకా పెండింగ్‌లోనే ఉంది. తెలంగాణలో ప్రభుత్వం మారిపోవడంతో ఆయనకు ఇస్తున్న పెన్షన్ కూడా ఆగిపోయింది.

కిన్నెర గాయకుడు మొగులయ్యకు నటుడు పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ సినిమాలో పాడే అవకాశం ఇవ్వడంతో ఆయనకు గుర్తింపు వచ్చింది. గతంలో ఆయన అనారోగ్యానికి గురైనపుడు పలువురు ఆర్ధిక సాయం అందించడంతో కోలుకున్నారు. ప్రస్తుతం ఆర్ధిక సమస్యలు చుట్టుముట్టడంతో కూలీ పనులు చేసుకుంటున్నారు.

మొగులయ్య పరిస్థితిపై సర్వత్రా సానుభూతి వ్యక్తం అవుతోంది. కళాకారుల విషయంలో కొందరికి వివక్ష తప్పడం లేదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం పురస్కారాలు ప్రకటించిన వాటిని మంజూరు చేయడంలో ఒక్కొక్కరికి ఒక్కో రకమైన స్పందన ఉంటుందనే విమర్శలు ఉన్నాయి. కళాకారుల్ని ప్రోత్సహించడంలో వివక్షలు, పైరవీల వల్లే మొగులయ్య వంటి వారు కూలీ పనులకు వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడుతోంది.

సంబంధిత కథనం