తెలంగాణ ప్రజల భవిష్యత్తుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కనీస ఆలోచన లేదని.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. టీజీఐఐసీని పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా మార్చడానికి ప్రభుత్వం రహస్య జీవోను విడుదల చేసిందని ఆరోపించారు. కంపెనీ హోదాను మార్చడం ద్వారా.. వేల కోట్ల రుణం పొందాలని ప్రభుత్వం ఆలోచిస్తోందని వివరించారు.
'టీజీఐఐసీలో 1.75 లక్షల ఎకరాలను కేసీఆర్ అందుబాటులో ఉంచారు. ప్రస్తుత ప్రభుత్వం ఆ భూమిని తాకట్టుపెట్టేందుకు కుట్ర చేస్తుంది. దీనికి సంబంధించిన నిర్ధుష్టమైన ఆధారాలున్నాయి. కంపెనీ హోదా మార్పు విషయాన్ని ప్రజలకు చెప్పకుండా ఎందుకు దాచిపెట్టారు. తెలంగాణ భూములను స్టాక్ ఎక్స్ఛేంజ్లో తాకట్టు పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది. స్టాక్ ఎక్స్ఛేంజ్లో నష్టం జరిగితే.. భూముల భవితవ్యం ఏంటి. టీజీఐఐసీని పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా మార్చే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి' అని కవిత డిమాండ్ చేశారు.
'కాంగ్రెస్ పాలనలో సీఎం రేవంత్ రెడ్డి రూ 1.8 లక్షల కోట్లకుపైగా అప్పులు చేశారు. ఆ అప్పులతో ఒక్క పథకాన్ని కూడా సంపూర్ణంగా అమలు చేయలేదు. అభివృద్ధీ చేయలేదు. గతంలో చేసిన అప్పులకు సంబంధించి రూ.80 వేల కోట్లు మాత్రమే ఈ ప్రభుత్వం తిరిగి చెల్లించింది. మిగిలిన లక్ష కోట్లు ఎక్కడికి వెళ్లాయి. నేను ఆధారాలతో మాట్లాడుతున్నాను. లక్ష కోట్లను పెద్ద కాంట్రాక్టర్లకు చెల్లించారు. ఇది 20 శాతం కమీషన్ ప్రభుత్వం. కాంట్రాక్టర్లకు చెల్లింపులు చేసి.. నేరుగా 20 శాతం కమీషన్ తీసుకున్నారు' అని కవిత ఆరోపించారు.
'దాదాపు రూ. 20 వేల కోట్ల వరకు సీఎం రేవంత్ రెడ్డి సొంత ఖజానాకు వెళ్లింది. నేను చెప్పింది తప్పయితే.. ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలి. ఓ మంత్రి సొంత కంపెనీకి, మేఘా కంపెనీకి బిల్లులు చెల్లిస్తున్నారు. వేల కోట్ల అప్పులు తెచ్చిన రేవంత్ రెడ్డి.. ఒక్క మంచి పని కూడా చేయలేదు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరిచే విధంగా నీచమైన మాటలు మాట్లాడుతున్నారు. కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాలను తాకట్టు పెట్టి.. రూ.10 వేల కోట్లు అప్పు తెచ్చారు. చెట్లను, ప్రకృతిని నాశనం చేసే ప్రయత్నం చేస్తే.. పర్యావరణవేత్తలు ఆందోళన చేశారు' అని కవిత వ్యాఖ్యానించారు.
సంబంధిత కథనం